
పాత్రికేయుల సమస్యలను సానుకూల ధృక్పధంతో పరిష్కారిస్తాం
ఏపీయుడబ్ల్యుజే రాష్ట్ర మహాసభలలో మంత్రులు
ప్రభాతదర్శిని, (ప్రత్యేక-ప్రతినిధి): పత్రికారంగానికి కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందని, పాత్రికేయుల సమస్యల పరిష్కారానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సానుకూల ధృక్పధంతో ఉన్నారని పలువురు రాష్ట్ర మంత్రులు పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ (ఏపీయుడబ్ల్యుజే) 36వ రాష్ట్ర మహాసభ బుధవారం ఒంగోలు దక్షిణ బైపాస్ లోని విష్ణుప్రియ కన్వెన్షన్ లో ఘనంగా జరిగింది. ఏపీయుడబ్ల్యుజే రాష్ట్ర అధ్యక్షుడు ఐ.వి.సుబ్బారావు అధ్యక్షతన జరిగిన ఈ మహాసభలో రాష్ట్ర జలవనరుల అభివృద్ధి శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు, సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా బాలవీరాంజనేయ స్వామి, విద్యుత్ శాఖ మంత్రి గొట్టి పాటి రవికుమార్ లు ముఖ్యఅతిధులుగా పాల్గొన్నారు. ముందుగా యూనియన్ నాయకులు శాసనసభ్యులతో కలిసి జ్యోతిప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం మంత్రి డాక్టర్ డోలా బాలవీరాంజనేయ స్వామి మాట్లాడుతూ సమాజంలో పాత్రికేయుల పాత్ర ఎంతో ముఖ్యమైనదని వారి సంక్షేమం కోసం నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం అన్ని విధాల కృషిచేస్తుందని చెప్పారు. తాను ప్రాతినిధ్యం వహిస్తున్న కొండపి నియోజకవర్గ కేంద్రంలో పాత్రికేయులకు ఇళ్ల స్థలాల మంజూరుకు కృషిచేస్తానని ఆయన పేర్కొన్నారు. రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ మాట్లాడుతూ ప్రస్తుతం ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాతో పాటు సామాజిక మాధ్యమాలు కూడా ఎన్నో వచ్చాయని దీనివల్ల ఏ వార్త అయినా వెంటనే ప్రజల వద్దకు చేరుతుందన్నారు. వార్తల విషయంలో పాత్రికేయులు అదేవిధంగా సామాజిక మాధ్యమాల వారు నిజాయితీగా ఉండాలని, ఫేక్ న్యూస్ ను వ్యాపింపజేస్తే అది సమాజానికి మంచిది కాదని అన్నారు. మంత్రి నిమ్మల రామానాయుడు మాట్లాడుతూ ప్రజాస్వామ్యానికి పాత్రికేయులు పట్టుకొమ్మల్లాంటి వారని అం దుకే పత్రికారంగాన్ని ఫోర్త్ ఎస్టేట్ గా పిలుస్తారన్నారు. అటువంటి పత్రికారంగం మనుగడ సాగించటానికి తమ ప్రభుత్వం అన్ని విధాల సహాయ సహకారాలు అం దజేస్తుందన్నారు. గత ప్రభుత్వం పాత్రికేయుల సంక్షేమాన్ని గాలికి వదిలేసిందని ఆయన పేర్కొన్నారు. పాత్రికేయులకు అక్రిడిషన్ కార్డుల మంజూరు కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంత్రుల కమిటీని నియమించారని త్వరలో రాష్ట్రంలో అర్హులైన పాత్రికేయులందరికీ అక్రిడిషన్ కార్డుల మంజూరు చేస్తామన్నారు. అదేవిధంగా పాత్రికేయులకు ఇన్యూరెన్స్, హెల్త్ కార్డుల జారీ, ఇళ్ల స్థలాల మంజూరు విషయంలోను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సానుకూలంగా ఉన్నారని ఆయన పేర్కొన్నారు. ఒంగోలు పార్లమెంటు సభ్యులు మాగుంట శ్రీనివాసులు రెడ్డి మాట్లాడుతూ తమ కుటుంబానికి పత్రికారంగంతో ఎంతో అనుబంధం ఉందని ఎటువంటి సహాయ సహకారాలు కావాలన్నా తాము చేస్తానన్నారు. శాసనసభ్యులు దామచర్ల జనార్జన రావు మాట్లాడుతూ ఒంగోలులో జర్నలిస్ట్ కాలనీ నిర్మాణానికి తనవంతు సహకారాన్ని అందజేస్తానన్నారు. అదేవిధంగా తమ తాతగారైన దామచర్ల ఆంజనేయులు పేరిట తన స్వంత నిధులతో ప్రెస్ క్లబ్ నిర్మాణం చేస్తామని, అందులో ఇతర ప్రాంతాల జర్నలిస్ట్లు వచ్చినప్పుడు విశ్రాంతి గదులను సైతం నిర్మిస్తామని హామీ ఇచ్చారు. ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్ (ఐజేయు) ప్రెసిడెంట్ కె.శ్రీనివాస రెడ్డి మాట్లాడుతూ పాత్రికేయుల వేతన సవరణ చట్టం కార్యరూపం దాల్చలేదని, వేతన సవరణ జరిగి సుమారు 15 సంవత్సరాలు అవుతుందని దీనిపై ప్రజాప్రతినిధులు దృష్టిపెట్టాలని కోరారు. అదేవిధంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సరం అయిందని రాబోయే సం వత్సర కాలంలోనైనా పాత్రికేయుల సమస్యల పరిష్కారం కోసం కృషిచేయాలని కోరారు. మంత్రుల కమిటీ సిఫారసుల మేరకు పాత్రికేయుల అక్రిడిషన్ కార్డుల జారీ కోసం జీ.వో రూపొందినప్పటికీ అది ఇంతవరకు రాష్ట్ర కేబినెట్ ఆమోదానికి నోచుకోలేదని వచ్చే కేబినెట్ సమావేశంలో ఆ జీ.వోను ఆమోదించేవిధంగా కృ షిచేయాలని సభాధ్యక్షులు, ఏపీయుడబ్ల్యుజే రాష్ట్ర అధ్యక్షుడు ఐ.వి.సుబ్బారావు కోరారు. కార్యక్రమంలో శాసనసభ్యులు బి. ఎన్. విజయ్కుమార్, డాక్టర్ ఉగ్ర నరసిం హా రెడ్డి, ఏలూరి సాంబశివ రావు, ముత్తుముల అశోక్ రెడ్డి, మారిటైం బోర్డు ఛైర్మన్ దామచర్ల సత్య, దర్శి తెదేపా ఇంఛార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి, ఐజేయు జనరల్ సెక్రటరీ బల్వీందర్ సింగ్ జమ్ము, స్టీరింగ్ కమిటీ సభ్యులు ఎస్. ఎన్. సిన్హా, జాతీయ కార్యదర్శి డి.సోమసుందర్, ఏపీయుడబ్ల్యుజే ప్రధాన కార్యదర్శి చందు జనార్ధన్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఏ.సురేష్, యూనియన్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు
ఎన్.వి.రమణ, దాసరి కనకయ్య, ఏపీ ఎలక్ట్రానిక్ మీడియా అధ్యక్షుడు వెంకట్రావు, సరస్వతీ విద్యాసంస్థల అధినేత ఏ.వి. రమణా రెడ్డి, పలువురు యూనియన్ నాయకులు, ప్రజాప్రతినిధులు, వివిధ జిల్లాల నుంచి వచ్చిన యూనియన్ కార్యవర్గ ప్రతినిధులు, పెద్దసంఖ్యలో పాత్రికేయులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా చిన్నారులు ప్రదర్శించిన నృత్య ప్రదర్శనలు, పాత్రికేయులు ఆలపించిన సినీగీతాలు, పద్యాలు విశేషంగా అలరించాయి. మహాసభ ప్రారంభానికి ముందు స్థానిక ప్రకాశం భవన్ దగ్గర నుంచి విష్ణుప్రియ కన్వెన్షన్ వరకు నిర్వహించిన బైక్ ర్యాలీలో పాత్రికేయులు ఉత్సాహంగా పాల్గొన్నారు.
