
ప్రజారోగ్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ ఎంవి రమణయ్య
ప్రభాతదర్శిని, (నెల్లూరు-ప్రతినిధి): ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వం వైద్య రంగంలో ప్రమాదకరమైన ప్రభుత్వ -ప్రైవేటు – భాగస్వామ్య ( పీపీపీ)విధానానికి తెలుగుదేశం, జనసేన కూటమి తెరలేపిందని ప్రజారోగ్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ ఎంవి రమణయ్య విమర్శించారు. గత ప్రభుత్వంలో ప్రారంభించిన ఈ ప్రభుత్వం నూతనంగా ప్రారంభించబోతున్న ప్రభుత్వ వైద్య కళాశాలలను, వీటికి అనుబంధంగా ఏర్పడ బోయే ఆసుపత్రులను ప్రవేట్ సంస్థల ఆధీనంలోకి తీసుకుపోవాలని ఇప్పటి ప్రభుత్వం నిర్ణయించడం దురదృష్టకరమని అన్నారు. గత ప్రభుత్వం తీసుకువచ్చిన సెల్ఫ్ ఫైనాన్స్ విధానంపై అప్పట్లో ప్రతిపక్షంలో ఉన్న తెలుగుదేశం జనసేన పార్టీలు అప్పటి ప్రభుత్వం వైఖరి పై విమర్శలు గుప్పిస్తూనే అదే విధానాన్ని అమలుకు పూనుకోవడం దారుణం అన్నారు. తద్వారా ప్రభుత్వ ఆరోగ్య వ్యవస్థను ప్రైవేట్ శక్తుల చేతుల్లో పెట్టబోతున్నాడని ఆందోళన వ్యక్తం చేశారు. గత ప్రభుత్వ కాలంలో మంజూరైన 17 వైద్య కళాశాలల నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం రూ.8548 కోట్లు నిధులు ఆమోదించగా కేవలం నాలుగేళ్లలో రూ.2225 కోట్లు మాత్రమే ఖర్చు పెట్టి 5 కళాశాలలనే అరకొరగా పూర్తి చేసిందని గత ప్రభుత్వాన్ని కూటమి ప్రభుత్వం నేతలు విమర్శించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. గత ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే కూటమి ప్రభుత్వం పీ.పీ.పీ విధానాన్ని వైద్య రంగంలో అమలుకు పూనుకుందని చెబుతూనే ఈ .పీ పీ పీ విధానం ఎంతో గొప్పదని, ఈ విధానం ప్రజలకు ఎంతో మేలు చేస్తోందని కూటమి ప్రభుత్వం ప్రచారం చేయడం సిగ్గుచేటు అని, కూటమి ప్రభుత్వం దొంగ వైఖరి పై ఆయన మండిపడ్డారు. పి.పి.పి అంటే ప్రైవేటీకరణ కాదని, కొత్తగా నిర్మిస్తున్న వైద్య కళాశాలలు, వాటికి అనుబంధంగా ఏర్పడే ఆసుపత్రులు అన్నీ ప్రభుత్వ అజమాయిషీలోనే ఉంటాయని, కావాలనే ప్రతిపక్ష పార్టీలు బురద జల్లుతున్నాయని ప్రజలను నమ్మించే ప్రయత్నం చేస్తున్నదని ఆయన తెలిపారు. ప్రతి పార్లమెంట్ నియోజకవర్గానికి ఒక మెడికల్ కాలేజీ ఏర్పాటు చేసి వైద్యుల సంఖ్యను పెంచాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాలకు మొత్తం 157 వైద్య కళాశాలలు మంజూరు చేసిందని, అందులో భాగంగా ఆంధ్ర రాష్ట్రానికి 17 వైద్య కళాశాలలు కేటాయించిందని తెలిపారు. వీటిని పీపీపీ పద్ధతిలోనే, కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన మార్గదర్శకాలకు అనుగుణంగా నిర్మాణాలు, ఆపరేషన్, మెయింటినెన్స్ ఉండాలని షరతు విధించిందని, ఒక్కో వైద్య కళాశాలకు దాని అనుబంధ ఆసుపత్రి నిర్మాణానికి సుమారు రూ.500 కోట్లు ప్రాజెక్టు వ్యయంగా నిర్ణయించారని పేర్కొన్నారు. ఇందులో 40 శాతం చొప్పున కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు(200 జి 200 కోట్లు) రూ. 400 కోట్లు భరించాలని, మిగిలిన రూ. 100 కోట్లు పీ.పీ.పీ పద్ధతిలో ప్రైవేట్ సంస్థల నుండి సేకరించవలసి ఉందన్నారు. అయితే కారణాలేమైనా వీటిని కేంద్ర ప్రభుత్వం రూపొందించిన పీ.పీ.పీ పద్ధతిలో కాకుండా రాష్ట్ర ప్రభుత్వమే కేంద్ర ప్రభుత్వం ఇచ్చే నిధులతో పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా నిర్మించటానికి పూనుకుందని తెలిపారు. ఆయా వైద్య కళాశాలకు అవసరమైన భూములు కేటాయించినప్పటికి వీటిని సకాలంలో పూర్తి చేయడానికి తీవ్ర నిర్లక్ష్యం వహించిందని విమర్శించారు. పూర్తయిన కళాశాలలు దానికి అనుబంధంగా ఉన్న ఆసుపత్రులు కూడా అరకొరకగానే పూర్తి చేసిందని, కేవలం ఐదు వైద్య కళాశాలల్లోనే గత ఏడాది అడ్మిషన్లు ప్రారంభమయ్యాయని, అయితే ఆ కాలేజీలకు మంజూరైన ఎం.బి.బి.ఎస్ మెడికల్ సీట్ల భర్తీ మాత్రం కేంద్ర ప్రభుత్వం ఆదేశించిన విధంగా సెల్ఫ్ ఫైనాన్స్ సీట్లుగా భర్తీకి పూనుకుందని తెలిపారు. కన్వీనర్ కోటా సీటుకి ఏడాదికి ఫీజు రూ..15000 ఉంటే మేనేజ్మెంట్ కోటా సీటుకి రూ.12 లక్షలు, ఎన్.ఆర్.ఐ కోటా సీటుకి ఏడాదికి రూ. 20లక్షల చొప్పున నిర్ణయించి, దాని అమలుకు పూనుకుందని, కన్వీనర్ కోటాను కుదించడంతో పాటు జనరల్ కేటగిరి సీట్లకు కూడా భారీ గా ఫీజులు నిర్ణయించిందని తెలిపారు. ప్రతిపక్షంలో ఉండగా తెలుగుదేశం, జనసేన పార్టీలు ఈ పద్ధతిని తీవ్రంగా వ్యతిరేకించాయని, అధికారంలోకి వస్తే ఈ సెల్ఫ్ ఫైనాన్స్ ఫీజుల పద్ధతిని పూర్తిగా రద్దు చేస్తామని, కళాశాలలన్నింటిని రాష్ట్ర ప్రభుత్వమే నిర్వహణ చేపడుతుందని ఎన్నికలలో హామీ ఇచ్చారని అన్నారు. పూర్తి కాని కళాశాలలను, ఆసుపత్రులను కూడా ప్రభుత్వమే పూర్తి చేసి ప్రభుత్వమే నిర్వహిస్తుందని వాగ్దానం చేసి, అధికారంలోకి వచ్చిన తరువాత ప్రజలకిచ్చిన వాగ్దానానికి తిలోదకాలిచ్చి సెల్ఫ్ ఫైనాన్స్ పద్ధతిని రద్దు చేయకుండా గత ప్రభుత్వ విధానాన్నే కొనసాగిస్తూ వైద్య విద్యార్థులపై తీవ్ర భారానికి నిస్సిగ్గుగా జై కొట్టడం దారుణమన్నారు. భవిష్యత్లో కన్వినర్ కోటా సీట్లు తగ్గిపోయి, క్రమేనా సెల్ఫ్ ఫైనాన్స్ సీట్లు పెరిగిపోతున్నాయని, ఫలితంగా సామన్య , పేద, దిగువ తరగతి విద్యార్థులు మంచి ర్యాకులు సంపాదించినా భారీ పీజులు చెల్లించుకోలేక వైద్య విద్యకు దూరమవుతారని ఆవేదన వ్యక్తం చేశారు.
వైద్య రంగంలో పీపీపీ విధానం: ప్రభుత్వాలు 2020సంవత్సరం నుండి వైద్య రంగంలో ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్య విధానాన్ని అమలుకు పూనుకున్నాయని, గతంలో ప్రభుత్వ ఆసుపత్రుల్లో యూజర్ చార్జీలు ప్రభుత్వాలే నేరుగా వసూలుచేసే ప్రయత్నాలు చేశాయని, లేబరేటరీలు, స్కానింగ్ వంటి సేవలు ఔట్సోర్సింగ్ ప్రాతిపదికన కొన్ని రాష్ట్రాల్లో అమల్లో ఉన్నాయని, మన రాష్ట్రంలో 104, 108 అంబులెన్స్ సేవలు ఈ పద్ధతిలోనే కొనసాగుతున్నాయని తెలిపారు. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన విధానం ఇప్పటివరకు అనుసరిస్తున్న విధానానికి పూర్తిగా భిన్నమైనదని, 2020 వరకు దేశంలో ప్రభుత్వ, ప్రైవేట్ వైద్య కళాశాలలే ఉండేవి.ఈ నూతన పి.పి.పి విధానంలో ప్రభుత్వమే ప్రైవేట్ వైద్య కళాశాలల స్థాపనకు, ఆసుపత్రులకు అన్ని సదుపాయాలు సమకూరుస్తుందని, దీనికి కావలసిన మౌలిక సదుపాయాల కల్పన కొరకు వైబులిటీ గ్యాప్ ఫండ్స్( వై.జీ.ఎఫ్) అనే పథకాన్ని కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిందని తెలిపారు. ఈ పథకం క్రింద రాష్ట్రప్రభుత్వాలు నూతనంగా చేపట్టే మౌలిక సదుపాయాలు అన్నీ పీ.పీ.పీలో ప్రైవేట్ సంస్థల ఆధీనంలోనే చేపట్టాలని, ఇందుకు అయ్యే ప్రాజెక్టు వ్యయంలో కేంద్ర ప్రభుత్వం 30 నుండి 40 శాతం నిధులు గ్రాంట్ రూపంలో చెల్లిస్తుందని, ఈ విధానం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అమలు చేయటానికి కూటమి ప్రభుత్వం తొలిసారిగా బడ్జెట్లో 2వేల కోట్ల రూపాయలను కూడా వైబులిటీ గ్యాప్ ఫండ్ క్రింద కేటాయించిందని తెలిపారు. ఈ పథకం క్రింద వైద్య కళాశాలకు, దానికి అనుబంధంగా నిర్మించే ఆసుపత్రికి అవసరమైన భూమిని ప్రైవేట్ సంస్థకి రాష్ట్ర ప్రభుత్వమే తక్కువ లీజుకిస్తుందని, లీజు కాల పరిమితి 60 నుండి 99 ఏళ్ల వరకు ఉంటుందని తెలిపారు. భూమితో పాటు కళాశాలకు, ఆసుపత్రి నిర్మాణానికి అవసరమయ్యే మొత్తం పెట్టుబడిలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఉమ్మడిగా 80 శాతం గ్రాంట్ రూపంలో ప్రైవేట్ సంస్థకి ఇస్తాయి. లీజు భూమిని బ్యాంకుల్లో తనఖా పెట్టి . మిగిలిన 20శాతం పెట్టుబడిని రుణరూపంలో ప్రైవేట్ సంస్థ సమకూర్చుకుంటుందని, వైద్య కళాశాల ఆపరేషన్, మెయింటెనెన్స్ లో 50శాతం ఐదేళ్లు పాటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలే హరిస్తాయని తెలిపారు. అంతేగాక వైద్య కళాశాలకు అనుబంధంగా ఉండే ఆసుపత్రికిని ప్రభుత్వ, ప్రైవేటు అనే రెండు విభాగాల కింద వేరు చేసి నిర్వహించబడుతుందని పేర్కొన్నారు. ఉదాహరణకు 1000 పడకల పీ.పీ.పీ ఆసుపత్రికి పేదలకు 440 పడకలు కేటాయిస్తే మిగిలిన 560 పడకలు వాణిజ్య ప్రాతిపదికన నిర్వహించబడతాయని, వాటికి ప్రైవేట్ రంగంలో కార్పొరేట్ వైద్య రేట్లు నేడు ఎలా అమలు చేస్తున్నారో అలా నిర్ణయించబడతాయని తెలిపారు. పేదలకు కేటాయించిన పడకలనిర్వహణా, ఓపి ఫీజు,శస్త్ర చికిత్సలు, ఇతర వైద్య ఖర్చులు మొత్తం రాష్ట్ర ప్రభుత్వం ప్రైవేట్ సంస్థకి చెల్లించాల్సి ఉంటుందని, కొంత భాగాన్ని యూజర్ ఛార్జీల రూపంలో పేదల నుండి కూడా వసూలు చేస్తారని తెలిపారు. ఈ వైద్య కళాశాల నిర్వహణ మొత్తం ప్రైవేట్ సంస్థే చూస్తుందని, కళాశాలలు, ఆసుపత్రులపై పూర్తి అధికారాలు ప్రవేట్ సంస్థకే కల్పించబడతాయని తెలిపారు. అలాగే విద్యార్థుల హాస్టల్స్, మెస్ వంటి నిర్వహణ కూడా ప్రైవేట్ సంస్థకే చెందుతుందని, ఒకవేళ వైద్య కళాశాలకు అనుబంధంగా ఆసుపత్రి నిర్మించకపోతే జిల్లా కేంద్రంలో ఉండే ప్రభుత్వ ఆసుపత్రిని పూర్తిగా అన్ని విభాగాలు ఉపయోగించుకోవడానికి,సంస్థకి అనుబంధంగా మార్చటానికి అనుమతిస్తారని తెలిపారు. వీటిల్లో పనిచేసే డాక్టర్లను విద్యార్థుల బోధనకు కూడా వినియోగించుకునేందుకు అవకాశం కల్పిస్తారని, ఈ ఆసుపత్రి పై కూడా పూర్తి ఆధిపత్యం ప్రైవేట్ సంస్థకే కల్పించబడుతుందని, ప్రభుత్వ పెట్టుబడితో నిర్మిస్తున్న వైద్య కళాశాలలు, ఆసుపత్రులను ప్రైవేట్ సంస్థల లాభాల కోసం ధారధతం చేస్తారని అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పి.పి.పీ పద్ధతిలో వస్తున్న 17 వైద్య కళాశాలలు వీటికి అనుబంధంగా వచ్చే ఆసుపత్రులు పూర్తిగా ప్రైవేటు సంస్థల గుత్తాధిపత్యం లోనే వస్తాయని, ఇవి ప్రభుత్వ ఆధీనంలోనే ఉంటాయని ప్రభుత్వ ప్రచారంలో తగదని, ఇందులో ఏమాత్రం వాస్తవం లేదని, కేవలం ప్రజలను మోసగించడానికే ఈ ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. పీపీపీ విధానం కొత్తగా స్థాపిస్తున్న ప్రభుత్వ వైద్య కళాశాలలకే పరిమితం కాదు. ప్రస్తుతం ప్రభుత్వ ఆధీనంలో నడుస్తున్న వైద్య కళాశాలల్లోని ఒక్కొక్క విభాగాన్ని విడదీసి ప్రైవేట్ సంస్థలకు ధారాదత్తం చేస్తారని, జిల్లా కేంద్రాల్లో ఉండే ప్రభుత్వ ఆసుపత్రులు, ప్రాంతీయ ఆసుపత్రులు, పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలన్నీ దశలవారీగా ప్రైవేట్ సంస్థలకి కట్టబెడతారని ఆరోపించారు. కొత్తగా ప్రారంభించే ఆసుపత్రులు కూడా పీ.పీ.పీ పద్ధతిలోనే చేపడుతారని, మొత్తం ప్రభుత్వ ఆధీనంలో నడిచే వైద్యవిద్య, ఆసుపత్రులు ఇతర అన్ని రకాల ఆరోగ్య సేవల నిర్వహణ బాధ్యత నుండి రాష్ట్ర ప్రభుత్వం తప్పుకొని ప్రైవేట్ సంస్థల పరం చేస్తుందని, విమర్శించారు.
ఉన్నత విద్యారంగంలో కూడా:వైద్యరంగంలోనే కాకుండా విద్యారంగంలో కూడా కేంద్ర ప్రభుత్వం ఇటువంటి హానికర విధాన అమలకు గత కొంత కాలంగా ప్రయత్నిస్తూ ఉందని, ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వ ఉన్నత విద్యా సంస్థల్లో ఈ పీపీపీ విధానం అమలకు 2017లోనే ఉన్నత విద్య ఫైనాన్సింగ్ ఏజెన్సీ (హెచ్ఇఎఫ్ఏ)అనే సంస్థను ఏర్పాటు చేసి ప్రైవేటీకరణ విధానాలు అమలు చేస్తుందని తెలిపారు.ఈ సంస్థకు కేంద్ర బడ్జెట్ నుండి నిధులు కేటాయించి వాటిని ఉన్నత విద్యారంగంలోని ఐ.ఐ.టి, ఎన్.ఐ.టి, ఐ.ఐ.ఎం, ఇతర సెంట్రల్ యూనివర్సిటీలు, పరిశోధనా సంస్థల మౌలిక సదుపాయాల కల్పన, పరిశోధనల అభివృద్ధి పేర రుణాల రూపంలో నిధులు ఇస్తుందని, కేంద్ర ప్రభుత్వం ఈ ప్రాజెక్టు కింద అయ్యే మొత్తం వ్యయానికి సరిపడా నిధులు ఇవ్వదని, ప్రాజెక్టు వ్యయంలో కేవలం 50శాతం మాత్రమే రుణరూపంలో ఇస్తుంది. మిగిలిన 50శాతం ప్రైవేట్ సంస్థల నుండి పీ.పీ.పీ పద్ధతిలో సేకరించుకోవాలని, తద్వారా ఉన్నత విద్యా సంస్థల్లోకి ప్రైవేట్ సంస్థలను కేంద్ర ప్రభుత్వం చొప్పిస్తున్నదని ఆరోపించారు. ఆయా సంస్థలు విద్యార్థుల నుండి వివిధ రూపాల్లో అధిక ఫీజులు, ఛార్జీలు వసూలు ద్వారా లాభదాయకమైనవిగా వాటిని మార్చుకుంటున్నాయని తెలిపారు. అంతేగాక కొత్తగా రకరకాల సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సులు కూడా ఏర్పాటు చేస్తూ తద్వారా వచ్చేఆదాయాన్ని కూడా ప్రైవేట్ సంస్థలకు ప్రభుత్వ విద్యా సంస్థల యాజమాన్యాలు చెల్లిస్తున్నాయని, ఇది కేంద్ర ప్రభుత్వ ఉన్నత విద్యా సంస్థలకే పరిమితం కాదని, ఇప్పుడు రాష్ట్రాలకు కూడా ఈ విధానాన్ని విస్తరించటానికి పథకం రూపొందించిందని, దీనిని కూడా కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో అమలుకు కార్యాచరణ సిద్ధం చేస్తున్నదని ఆరోపించారు. బిజెపి కేంద్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత అన్ని రంగాల్లో ప్రైవేటీకరణ విధానాలను వేగంగా అమలు చేస్తున్న నేపథ్యంలో మౌలిక సదుపాయాల రంగంలో ప్రభుత్వ పాత్రను తగ్గించుకుని కార్పొరేట్ శక్తుల గుత్తాధిపత్యాన్ని పెంచుతున్నదని అన్నారు. సామాజిక రంగంలో కూడా ఇదే వైఖరిని అవలంబిస్తున్నదని, రాష్ట్రాలకు పీ.పీ.పీ, వైబిలిటీ గ్యాప్ ఫండ్స్ పేర నిధులు ఎరేసి రాష్ట్ర ప్రభుత్వాలను లోబర్చుకుంటున్నదని, . ఈ ప్రజా వ్యతిరేక విధానాలకి వ్యతిరేకంగా నిలబడకుండా కూటమి ప్రభుత్వం కేంద్ర బిజెపి ప్రభుత్వ విధానాలను తలకెత్తుకొని బిజెపితో అంటగాగుతూ ప్రజల ప్రయోజనాలను దెబ్బతీస్తున్నదని విమర్శించారు. ప్రభుత్వ ఆరోగ్య వ్యవస్థనే ప్రైవేట్ శక్తుల గుప్పెట్లో పెట్టే ప్రయత్నంలో ఉందని, ఈ పీ. పీ. పీ మోడల్ అమలైతే వైద్య కళాశాలల్లో ఫీజులు పెరుగుతాయని, పేద విద్యార్థులు డాక్టర్లయ్యే అవకాశం తగ్గుతుందని,వైద్య రంగంలో సేవా దృక్పథం తగ్గిపోయి వ్యాపార దృక్పథం పెరుగుతుందని, వైద్యం ఖర్చులు పెరిగిపోయి పేదవానికి వైద్యం అందడం కష్టమవుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. అలాగే ప్రభుత్వ రంగంలో వైద్యుల కొరత ఏర్పడి,ఆరోగ్యాన్ని హక్కుగా పొందే అవకాశం తగ్గిపోతుందని, ఈ ప్రమాదకర విధానాన్ని ప్రజలు వ్యతిరేకించాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో ప్రజారోగ్య వేదిక నాయకులు టి. కామేశ్వరరావు పాల్గొన్నారు.