• మే 5 నుంచి నీటి విడుదలకు చర్యలు
  • 41 టీఎంసీలు నీటిని కేటాయిస్తూ సాగునీటి సలహా మండలి తీర్మానం
  • భవిష్యత్తు అవసరాల దృష్ట్యా నీటిని పొదుపుగా వాడుకోవాలి
  • సాగునీటి కేటాయింపుల్లో నీటి సంఘం అధ్యక్షులు కీలక పాత్ర పోషించాలి
  • లష్కర్ల జీతాల బకాయిల చెల్లింపునకు కృషి చేస్తాం
  • జిల్లాలో మేజర్ ఇరిగేషన్ పనులకు రూ. 18 కోట్లు
  • ఉపాధి హామీ ద్వారా మైనర్ ఇరిగేషన్ పనులు చేపడుతాం
  • ఇరిగేషన్ అధికారులు బాధ్యతగా పనిచేయాలి.. లేకుంటే చర్యలు తప్పవు
  • రైతులందరూ ఆరుతడి పంటల వైపు మొగ్గు చూపాలి
  • రైతుల అవసరాలకు తగ్గట్లు నాలుగు లక్షల విత్తనాలు సిద్ధం
  • జిల్లాలో చివరి ఎకరా వరకు సాగునీరు అందించడమే ప్రధాన లక్ష్యం
  • మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి

ప్రభాతదర్శిని, (నెల్లూరు-ప్రతినిధి) : రైతుల ప్రయోజనాలే లక్ష్యంగా జిల్లాలో రెండో పంట రబీకి సంబంధించి 3లక్షల పైగా ఎకరాలకు 41 టిఎంసిల నీటిని కేటాయిస్తూ సాగునీటి సలహామండలిలో తీర్మానించినట్లు రాష్ట్ర దేవాదాయశాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి వెల్లడించారు. గురువారం ఉదయం నగరంలోని జిల్లాపరిషత్‌ సమావేశ మందిరంలో జిల్లా సాగునీటి సలహామండలి సమావేశం జిల్లా కలెక్టర్‌ ఆనంద్‌ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సమావేశానికి మంత్రి ఆనం రామనారాయణరెడ్డి, ఎమ్మెల్సీ బల్లి కల్యాణ్‌ చక్రవర్తి, సర్వేపల్లి, నెల్లూరు రూరల్‌, కోవూరు, ఉదయగిరి, కావలి ఎమ్మెల్యేలు సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి, కాకర్ల సురేష్‌, దగుమాటి వెంకట కృష్ణారెడ్డి, ప్రాజెక్టు, డిస్ట్రిబ్యూటరీ, నీటిసంఘాల అధ్యక్షులు, రైతుసంఘాల నాయకులు, అధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా సోమశిల, కండలేరు జలాశయాల్లో ప్రస్తుత నీటి నిల్వలు, ఎంతమేర రబీ పంటకు నీటిని కేటాయించాలి, చెన్నై, తిరుపతికి తెలుగుగంగ ద్వారా నీటి కేటాయింపులు, సాగునీటి కాలువల నిర్వహణ, పూడికతీత, గుర్రపుడెక్క తొలగింపు, లష్కర్లకు జీతాల బకాయిల చెల్లింపు మొదలైన అంశాలపై మంత్రి ఆనం, ఎమ్మెల్యేలు, జిల్లాలో నూతనంగా ఎన్నికైన నీటి సంఘాల అధ్యక్షులు ప్రధానంగా చర్చించారు. ఈ సందర్భంగా మంత్రి ఆనం రామనారాయణరెడ్డి మాట్లాడుతూ నూతనంగా ఎన్నికైన నీటిసంఘాల అధ్యక్షులకు ప్రత్యేక అభినందనలు తెలిపారు. సుమారు ఆరేళ్ల అనంతరం తమ ప్రభుత్వం నీటిసంఘాలకు అధ్యక్షులను, సభ్యులను నియమించినట్లు చెప్పారు. రైతులకు అన్నివిధాలా అండగా వుండాలనే ప్రధానలక్ష్యంతోనే నీటిసంఘాలకు ఎన్నికలు నిర్వహించినట్లు చెప్పారు. నీటి సంఘాల అధ్యక్షులందరూ సాగునీటి యాజమాన్యంలో కీలక భూమిక పోషించాలని మంత్రి పిలుపునిచ్చారు. రబీ పంట అవసరాల మేరకు ఏ ప్రాంతాల్లో నీరు ఎక్కువగా కావాలి, ఎక్కడ తక్కువగా కావాలో అంచనా వేసి ఎమ్మెల్యేలు, రైతుల సూచనల మేరకు నీటిని విడుదల చేసేందుకు చర్యలు తీసుకుంటామని మంత్రి స్పష్టం చేశారు. మే నెల 5వ తేదీ నుంచి సోమశిల జలాశయం నుంచి నీటిని పంట కాలువలకు విడుదల చేయనున్నట్లు మంత్రి పేర్కొన్నారు . జిల్లాలో ప్రస్తుతం సోమశిల జలాశయం పరిధిలో 52.653 టిఎంసీల నీటినిల్వ, కనిగిరి మరియు సర్వేపల్లి రిజరాయర్లలో 3.615 టిఎంసిల నీటి నిల్వ కలిపి మొత్తం 56.268 టిఎంసిల నీటినిల్వలో డెడ్‌ స్టోరేజి 7,500టిఎంసిలు, నీటి ఆవిరి 1500 టిఎంసిలు, నెల్లూరు కార్పొరేషన్‌, కావలి, అల్లూరు, ఆత్మకూరు తదితర పట్టణాల తాగునీటి అవసరాలకు 3,500 టిఎంసిలు మొత్తం 12.500 టిఎంసిల నీరు మినహాయించగా 43.768 టిఎంసిల నీటి లభ్యత ఉన్నట్లు మంత్రి చెప్పారు. ఇందులో సుమారు 36 టిఎంసిల వరకు నీటిని పొదుపుగా రబీ పంట సాగునీటి అవసరాలకు వినియోగించుకుని 10టిఎంసిల నీటిని భవిష్యత్‌ అవసరాలు, రాబోయే ఖరీఫ్‌ పంట కోసం నీటిని నిల్వచేసుకునేలా ప్రణాళికాబద్దంగా నీటిని వాడుకునేందుకు అందరూ సహకరించాలని మంత్రి కోరారు. ఈ నీటి లభ్యత ఆధారంగా పెన్నా డెల్టా ఆయకట్టుకు 2లక్షల ఎకరములకు, కనుపూరు కాలువ 25వేల ఎకరాలు, సోమశిల ప్రాజెక్టు కాలువ కింద 1.44లక్షల ఎకరములు మొత్తం 3.69 లక్షల ఎకరాల ఆయకట్టుకు 43.42 టిఎంసిల నీటి కేటాయింపును అధికారులు ప్రతిపాదించగా, ఐఎబీ సమావేశంలో ఎమ్మెల్యేలు, నీటి సంఘాల అధ్యక్షులు అందరి ఆమోదం మేరకు రెండో పంట రబీకి సుమారు 3లక్షల పైగా ఎకరాలకు 41 టిఎంసిల నీటిని కేటాయించాలని తీర్మానించినట్లు చెప్పారు. ఈ మూడునెలలు ఇరిగేషన్‌ అధికారులు నీటిసంఘాల అధ్యక్షులతో కలిసి రైతులకు సక్రమంగా నీటిని అందించాలని, ఎక్కడైనా అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించినా, అక్రమాలకు పాల్పడినా ఎవరినీ ఉపేక్షించే ప్రసక్తే లేదని మంత్రి హెచ్చరించారు. మనమంతా కూడా రైతులకు నీరు అందించడమే ప్రధానలక్ష్యంగా పనిచేయాలని పిలుపునిచ్చారు. జిల్లాలో మేజర్‌, మైనర్‌ ఇరిగేషన్‌ పనులకు ప్రభుత్వం 18కోట్లను ప్రభుత్వం విడుదల చేసిందన్న మంత్రి ఆనం, ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేలు, నీటిసంఘాల అధ్యక్షుల సలహాల మేరకు ప్రాధాన్యతాక్రమంగా పనులు చేపట్టాలని అధికారులకు సూచించారు. మైనర్‌ ఇరిగేషన్‌ కాలువల పూడికతీత, గుర్రపుడెక్క తొలగింపు పనులను ఉపాధిహామీ పథకం ద్వారా చేపట్టనున్నట్లు మంత్రి చెప్పారు. ఎంపిడివోలు, డ్వామా సిబ్బంది, ఇరిగేషన్‌, నీటిసంఘాల అధ్యక్షుల సమన్వయంతో ఈ పనులు చేపట్టాలని మంత్రి ఆదేశించారు. జిల్లాలో సాగునీటికాలువ పరిధిలో రైతులు రూ.38కోట్ల నీటిపన్ను బకాయిలు చెల్లించాలని మంత్రి ఆనం చెప్పారు. ఈ పన్ను బకాయిలు వసూలైతే ఆ నిధులను జిల్లాలో కాలువల మెయింటెనెన్స్‌కు మనమే వినియోగించుకోవచ్చన్నారు. ఈ పన్నుల వసూలుకు నీటిసంఘాల అధ్యక్షులు సహకారం అందించాలన్నారు. రైతులందరూ తక్కువ నీటితో పండే ఆరుతడి పంటలు వేసేలా వ్యవసాయాధికారులు ఈనెల 21 నుంచి 30వరకు ముమ్మరంగా అవగాహన సదస్సులు నిర్వహించాలని ఆదేశించారు. అన్నిరకాల విత్తనాలను సిద్ధంగా చేసుకోవాలని, ఎక్కడైనా విత్తనాల కొరత వుంటే ముందగా జిల్లా కలెక్టర్‌ దృష్టికి తీసుకెళ్లి అవసరమైన విత్తనాలు అందుబాటులో వుంచుకోవాలని సూచించారు. 4లక్షల ఎకరాలకు తక్కువ కాకుండా ధాన్యం విత్తనాలను సిద్ధం చేసుకోవాలన్నారు. లష్కర్ల జీతాల బకాయిల చెల్లింపు విషయమై నీటిపారుదలశాఖ మంత్రి నిమ్మల రామానాయుడు, ఆర్థికశాఖ మంత్రి పయ్యావుల కేశవ్‌ దృష్టికి తీసుకెళ్లి సమస్య పరిష్కారిస్తామని మంత్రి చెప్పారు. జిల్లాలో సుమారు 4.68 కోట్ల బకాయిలు లష్కర్లకు చెల్లించాల్సి వుందని, ఇవన్నీ గత ప్రభుత్వ బకాయిలన్నారు. ఏదేమైనా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి లష్కర్లకు జీతాలు చెల్లించడం తమ బాధ్యతగా మంత్రి చెప్పారు. శాసనసభ్యులు తమ దృష్టికి తీసుకొచ్చిన సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత ఇస్తూ పరిష్కారానికి కృషి చేస్తామని మంత్రి చెప్పారు. జిల్లాలో ఖరీప్‌ ధాన్యం కొనుగోళ్లకు సంబంధించి 191 కోట్ల రూపాయల విలువైన 1.09 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని ప్రభుత్వం రైతుల వద్ద నుంచి కొనుగోలు చేసినట్లు మంత్రి చెప్పారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ధాన్యం విక్రయించిన 24 నుంచి 48 గంటల్లోనే రైతుల ఖాతాలకు నగదు జమచేశామని, రైతుల పట్ల తమ ప్రభుత్వానికి వున్న చిత్తశుద్ధికి ఇది ఒక నిదర్శనంగా మంత్రి ఆనం చెప్పారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రికి, కూటమి ప్రభుత్వానికి మంత్రి ప్రత్యేక ధన్యవాదాలు చెప్పారు. గత రెండు రోజుల క్రితం సర్వేపల్లి నియోజకవర్గంలో కురిసిన వర్షాలు, ఈదురుగాలులకు దెబ్బతిన్న పంటనష్టాన్ని అంచనా వేసి నివేదికను అందించాలని అధికారులను ఆదేశించారు. ఈ నివేదిక ఆధారంగా రైతులను ప్రభుత్వపరంగా ఆదుకుంటామని మంత్రి చెప్పారు.

నీటి సంఘాల అధ్యక్షులు కీలకంగా పనిచేయాలి : ఎమెల్యే సోమిరెడ్డి: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో సోమశిల, కండలేరు జలాశయాల్లో 100 టిఎంసీల నీటి నిల్వలు గల ఏకైక జిల్లా నెల్లూరుజిల్లా మాత్రమేనని సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి అన్నారు. సాగునీటి నిర్వహణలో నీటి సంఘాల అధ్యక్షులు కీలకంగా పనిచేయాలన్నారు. నీరు వృథాకాకుండా అవసరం మేరకు పొదుపుగా వాడుకోవాలని సూచించారు. సర్వేపల్లి నియోజకవర్గంలో సర్వేపల్లి, కృష్ణపట్నం కాలువల కింద చాలామంది రైతులు రెండో పంట వేయలేదన్నారు. పంటలు వేసిన రైతులకు మాత్రం ఇబ్బందులు లేకుండా నీటిని విడుదల చేయాలన్నారు. ప్రధాన కాలువల్లో పనులకు నిధులు మంజూరు కాగా, చిన్నకాలువల్లో ఉపాధిహామీ ద్వారా పనులు చేపట్టనున్నట్లు చెప్పారు. గత ప్రభుత్వంలో పనులు చేయకుండానే బిల్లులు స్వాహా చేశారని మండిపడ్డారు. ఒక్క సర్వేపల్లి నియోజకవర్గంలోనే 150కోట్లు కాజేశారని ఆరోపించారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి బాగోలేదని, ప్రభుత్వం మంజూరు చేసిన ప్రతిరూపాయిను కూడా వృథాకాకుండా పనులు చేయాలన్నారు.
చివరి ఆయకట్టు వరకు నీరందించాలి : ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డి
కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి మాట్లాడుతూ జిల్లాలోనే అతిపెద్ద డెల్టా ప్రాంతం కోవూరు అని, 1.93 లక్షల మెట్రిక్‌ టన్నులతో కోవూరు నియోజకవర్గ రైతులు 500కోట్ల టర్నోవర్‌ సాధించినట్లు చెప్పారు. సకాలంలో వర్షాలు పడడం, ధాన్యం కొనుగోళ్లలో అధికారుల సహాయ సహాకారాలతో రైతులు సుభిక్షంగా వున్నారన్నారు. కనిగిరి, జాఫర్‌ సాహెబ్‌ కాలువల్లో పూడికతీత పనులు చేయాలని కోరారు. చివరి ఆయకట్టు వరకు నీరు అందించడమే లక్ష్యంగా అధికారులు పనిచేయాలని, ఇదే తమ లక్ష్యంగా ఆమె చెప్పారు. అలాగే లష్కర్లకు జీతాలు చెల్లించేందుకు కృషిచేయాలని మంత్రి ఆనంను ప్రశాంతిరెడ్డి కోరారు.
డిఆర్‌ ఛానల్‌ పనులు చేపట్టాలి : ఎమ్మెల్యే కృష్ణారెడ్డి
ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారం చేపట్టిన తరువాత సకాలంలో వర్షాలు పడి అన్నదాతలు సంతోషంగా వున్నారన్నారు. కావలి కాలువ, దగదర్తి డిఆర్‌ ఛానల్‌ పనులు త్వరగా పూర్తి చేయాలని కోరారు. డిఆర్‌ ఛానల్‌ పరిధిలో 70వేల ఎకరాలకు నీరందించాల్సి వుందన్నారు. సాగునీరు వదిలేందుకు ముందుగానే కాలువల అభివృద్ధి పనులు పూర్తి చేయాలని ఆయన కోరారు. మే 10లోగా నీరు విడుదల చేయాలన్నారు.
ఉదయగిరిని ప్రత్యేకంగా చూడాలి : ఎమ్మెల్యే కాకర్ల సురేష్‌
మెట్ట ప్రాంతమైన ఉదయగిరి నియోజకవర్గాన్ని ప్రత్యేకంగా చూడాలని ఎమ్మెల్యే సురేష్‌ మంత్రి ఆనంను కోరారు. డిస్ట్రిబ్యూటరీ ఛానల్స్‌ను ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి చేయాలన్నారు. కాకుటూరు, కొండాపురం, గండిపాలెం ప్రాజెక్టులపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలన్నారు. తన నియోజకవర్గంలో 149 నీటిసంఘాలు వున్నాయని, 8 మండలాలు వుండగా కేవలం 2 మండలాలకే సోమశిల జలాలు అందుతాయని, మిగిలిన 6 మండలాలు పూర్తిగా వర్షంపైనే ఆధారపడినట్లు ఎమ్మెల్యే సురేష్‌ వివరించారు. ఉదయగిరిని ప్రత్యేకంగా పరిగణించి నీటిని కేటాయించాలని, కాలువల మరమ్మతు పనులు చేపట్టాలన్నారు. గండిపాలెం ప్రాజెక్టు నిర్వహణపై ప్రత్యేకంగా దృష్టిపెట్టాలని కోరారు.
స్వర్ణముఖికి 3 టిఎంసిలు కేటాయించాలి : ఎమ్మెల్సీ బల్లి కల్యాణ్‌చక్రవర్తి: తిరుపతి జిల్లా గూడూరు, సూళ్లూరుపేట, తిరుపతి పట్టణాలకు నీటిని 4.75 టిఎంసిలు కేటాయించడం చాలా సంతోషంగా వుందని, ఇందుకు మంత్రి ఆనంకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నట్లు ఎమ్మెల్సీ బల్లి కల్యాణ్‌ చక్రవర్తి చెప్పారు. కోట, వాకాడు, చిట్టమూరు, నాయుడుపేట మండలాల ప్రధాన నీటివనరు అయిన స్వర్ణముఖి కింద 48చెరువులకు ఒకటిన్నర టిఎంసి, తాగునీటి అవసరాలకు 0.75 టిఎంసిలు కేటాయించినట్లు చెప్పారు. దీనిని 3 టిఎంసీలకు పెంచాలని కల్యాణ్‌ చక్రవర్తిని మంత్రిని కోరారు. ఈ సమావేశంలో సోమశిల, పెన్నాడెల్టా, కందుకూరు కెనాల్‌ ప్రాజెక్టు కమిటీల చైర్మన్లు కేశవచౌదరి, రాజగోపాల్‌, మస్తానయ్య, కందుకూరు సబ్‌కలెక్టర్‌ శ్రీపూజ, ఆత్మకూరు ఆర్డీవో పావని, ఇరిగేషన్‌, సోమశిల, తెలుగుగంగ ఎస్‌ఈలు దేశ్‌నాయక్‌, వెంకటరమణారెడ్డి, రాధాకృష్ణారెడ్డి, జిల్లా వ్యవసాయాధికారి సత్యవాణి, ఉద్యానవనశాఖ అధికారి సుబ్బారెడ్డి, ఎపిఎంఐపి పిడి శ్రీనివాసులు, సోమశిల ఈఈ మల్లికార్జున, సోమశిల, తెలుగుగంగ, ఇరిగేషన్‌ ఇంజనీరింగ్‌ అధికారులు, రైతుసంఘాల నాయకులు పాల్గొన్నారు.