
ప్రభాతదర్శిని, (ప్రత్యేక-ప్రతినిధి): నెల్లూరు జిల్లా రాపూరులోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన పెంచలకోనలోని శ్రీ పెనుశీల లక్ష్మీ నరసింహస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు మే నెల 8 నుంచి 14 వరకు జరగనున్న బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు నెల్లూరు ఆర్డీఓ నాగ సంతోషిణి అనూష అన్నారు.. పెంచలకోన దేవస్థానం ఈవో పోరెడ్డి శ్రీనివాసులు రెడ్డి ఆధ్వర్యంలో బ్రహ్మోత్సవ ఏర్పాట్లపై పెంచలకోన క్షేత్రంలోని కమ్మ కళ్యాణ మండపంలో మంగళవారం వివిధ శాఖల అధికారులతో ఆమె తొలి విడత సమస్వయ కమిటీ సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా ఆర్డీఓ నాగ సంతోషిణి అనూష మాట్లాడుతూ బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై శాఖల వారీగా సమీక్షించారు. మే నెల 8 నుంచి 14వ తేదీ వరకు జరిగే ఉత్సవాలు క్షేత్ర ప్రాధాన్య తకు తగిన విధంగా, పవిత్రత ఉట్టిపడేలా నిర్వహించాలని సూచించారు. భక్తుల రద్దీకి తగిన విధంగా ప్రత్యేక వసతులు కల్పించాలన్నారు.త్వరితగతిన స్వామివారి దర్శనం లభించేలా క్యూలైన్ల ఏర్పాటుతో పాటు చలువ పందిళ్లు, పెద్ద సంఖ్యలో తాత్కాలిక మరుగుదొడ్లు,స్నానపు గదులు ఏర్పాటు చేయాలన్నారు. భక్తుల రద్దీ కారణంగా పారిశుధ్య సమస్య తలెత్తకుండా ఎప్పటిక ప్పుడు చర్యలు చేపట్టాలన్నారు. బ్రహ్మోత్సవాలకు తరలివచ్చే భక్తుల కోసం పెద్ద సంఖ్యలో ఆర్టీసీ బస్సులు ఏర్పాటు చేయాలని ఆదేశించారు.రెండో విడత సమన్వయ సమావేశం దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి, వెంకటగిరి ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుందన్నారు..అప్పటికి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లు పూర్తి స్థాయిలో ఉండాలన్నారు.ఈ కార్యక్రమంలో జిల్లా దేవాదాయ శాఖ అధికారి కోవూరు జనార్దన్ రెడ్డి,రాపూరు సీఐ సత్యనారాయణ, అటవీశాఖ రేంజి అధికారి పందిళ్ల రవీంద్ర బాబు,తహసీల్దార్ లక్ష్మీ నరసింహం,ఎంపీడీఓ భవాని,ఆర్టీసీ డిఎం అనిల్ కుమార్,వేపినాపి వైద్యాధికారి సూర్యధర్మేంద్ర,ఇతర అధికారులు పాల్గొన్నారు.