యర్రగొండపాలెం టీడీపీ ఇంచార్జ్ ఎరిక్షన్ బాబు
ప్రభాతదర్శిని, (యర్రగొండపాలెం-ప్రతినిధి):కడుపుకు అన్నం తినేవాళ్లు ఎవరూ అన్నా క్యాంటిన్ గురించి చెడుగా మాట్లాడరని, నోరు ఉందికదా అని ఎలా పడితే ఆలా మాట్లాడితే ఊరుకోబోం – నోరుజారితే చట్టపరమైన చర్యలు తప్పవని  యర్రగొండపాలెం నియోజకవర్గ టీడీపీ ఇంచార్జ్ గూడూరి ఎరిక్షన్ బాబు హెచ్చరించారు. మంగళవారం యర్రగొండపాలెం పట్టణంలోని టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ వైసీపీ ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ అన్న క్యాంటీన్ల పై చేసిన వ్యాఖ్యలపై అభ్యంతరం తెలిపి, చంద్రశేఖర్ తీరుపై ధ్వజమెత్తారు. అన్నా క్యాంటీన్ లో అన్నం తినే పేదలను బిచ్చగాళ్ళతో పోల్చడం తాటిపర్తి చంద్రశేఖర్ కు సిగ్గుచేటు అనిపించలేదా అని ప్రశ్నించారు. అన్నం తినే ఎవరూ అన్నా క్యాంటీన్ గురించి హేళనగా మాట్లాడరని మరి చంద్రశేఖర్ తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకొని పేద ప్రజలకు క్షమాపణలు కోరాలని హెచ్చరించారు. గతంలో కూడా నోరు ఉంది కదా అని మీడియా సమావేశాలలో ఎలా పడితే అలా మాట్లాడుతున్నారని, మరోసారి ఇలా మాట్లాడితే ఖచ్చితంగా చట్టపరంగా చంద్రశేఖర్ పైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పరబ్రహ్మ స్వరూమైన అన్నం పై మాట్లాడిన ఎవరు బాగుపడిన చరిత్ర లేదని తెలిపారు. నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడాలని హితవు పలికారు. లేకపోతే భవిష్యత్తులో ప్రజలే బుద్ది చెప్పే పరిస్థితి ఏర్పడుతుందని హెచ్చరించారు.