తిరుపతి ఆర్ఎస్ఎస్ ఏడీజే కోర్టు న్యాయమూర్తి తీర్పు
ప్రభాతదర్శిని,(తిరుపతి-ప్రతినిధి): ఎర్రచందనం అక్రమ రవాణా కేసులో ఇద్దరు స్మగ్లర్లకు ఐదేళ్ల చొప్పున జైలు శిక్ష తలా రూ.6 లక్షల జిరిమానా విధిస్తూ ఎర్రచందనం ప్రత్యేక కోర్టు శుక్రవారం తీర్పువెల్లడించింది. ఎర్రచందనం అక్రమ రవాణాను అరికట్టడంలో భాగంగా ఆర్ఎస్ఎఎస్టీఎఫ్ చీఫ్ ఎల్. సుబ్బారాయుడు రూపొందించిన ప్రత్యేక కార్యాచరణను అమలులో భాగంగా టాస్క్ ఫోర్సు ఎస్పీ శ్రీ పీ.శ్రీనివాస్ పర్యవేక్షణలో గతంలో నమోదై విచారణలో ఉన్న కేసులకు సంబంధించిన సాక్ష్యాధారాలను పగడ్బందీగా నిరూపించి ముద్దాయిలకు శిక్ష పడేలా ప్రణాళికలు రూపొందించారు. అందులో భాగంగా క్రైమ్ నెంబరు 06-2020లో కరకంబాడి బీటు, తిరుపతి రేంజి పరిధిలో పట్టుబడ్డ ప్రకాశం జిల్లాకు చెందిన చెరబోయిన వెంకటరమణ, పింజరి మహబూబ్ బాషా ఇద్దరు ముద్దాయిలు చేసిన నేరం రుజువయ్యింది. దీంతో తిరుపతి ఆర్ఎస్ఎస్ ఏడీజే కోర్టు న్యాయమూర్తి నరసింహ మూర్తి ఒకొక్కరికి ఐదేళ్ల జైలు శిక్ష, రూ. 6లక్షల జరిమానా విధిస్తూ తీర్పు నిచ్చారు. తదుపరి కోర్టు ఆదేశాల మేరకు వారిని నెల్లూరు సెంట్రల్ జైలుకు తరలించారు. ముద్దాయిలకు శిక్ష పడేలా కృషి చేసిన సిబ్బందిని టాస్క్ ఫోర్సు ఉన్నతాధికారులు అభినందించారు. శేషాచలం రిజర్వు ఫారెస్టులో అత్యంత విలువైన సహజ సంపద ఎర్ర చందనం చెట్లను నరికి అక్రమ రవాణా చేసే నేరస్తులకు ఈ తీర్పు ఒక హెచ్చరికగా పని చేస్తుందని టాస్క్ ఫోర్సు ఉన్నతాధికారులు పేర్కొన్నారు.