ప్రభుత్వ భూమిలో హెచ్చరిక బోర్డు ఏర్పాటు
ప్రభాతదర్శిని, (ప్రత్యేక-ప్రతినిధి): ఆక్రమణలో ఉన్న ఐదు కోట్ల రూపాయల ప్రభుత్వ స్థలాన్ని రెవెన్యూ అధికారులు ఎట్టకేలకు స్వాధీనం చేసుకున్నారు. ఉన్నత అధికారుల ఆదేశాల మేరకు ఆ ప్రభుత్వ భూమిలో హెచ్చరిక బోర్డు ఏర్పాటు చేశారు. సేకరించిన సమాచారం, అధికారుల వివరాల ప్రకారం నాయుడుపేట మున్సిపాలిటీ పరిధిలో శ్రీకాళహస్తి బైపాస్ రోడ్డు వద్ద ఎల్ ఏ సాగరం గ్రామ రెవెన్యూ సర్వే నంబర్ 65-7సి1 లో ఆక్రమణలో ఉన్న సుమారు 5 కోట్ల రూపాయల విలువ 8 సెంట్లు ప్రభుత్వ స్థలాన్ని నాయుడుపేట మండల వి ఆర్ ఓ లు శుక్రవారం స్వాధీనం చేసుకున్నారు. అదే సర్వే నంబర్ లో పట్టా స్థలాన్ని కొనుగోలు చేసిన ఓ వ్యక్తి సుమారు 5 కోట్ల రూపాయలు విలువ గల 8 సెంట్లు ప్రభుత్వ భూమిని ఆక్రమించి ప్రహరీ గోడను నిర్మించారు. సూళ్లూరుపేట ఆర్డీవో, నాయుడుపేట తాసిల్దార్ లకు అందిన అనేక ఫిర్యాదుల మేరకు శుక్రవారం జెసిబితో ఓ వ్యక్తి ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించి ఏర్పాటు చేసిన ప్రహరీ గోడను తొలగించారు. స్వాధీనం చేసుకున్న ప్రభుత్వ స్థలంలో హద్దురాళ్ళు ఏర్పాటు చేశారు. ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరిక బోర్డును ఏర్పాటు చేశారు.సూళ్లూరుపేట ఆర్డీవో, నాయుడుపేట తాసిల్దార్ ఆదేశాల మేరకు ప్రభుత్వ స్థలంలో ఆక్రమణలు తొలగించి హెచ్చరిక బోర్డు ఏర్పాటు చేసినట్లు ఎల్ ఎ సాగరం విఆర్వో శ్రీనివాసులు తెలిపారు. నాయుడుపేట పట్టణంలో అనేక ప్రాంతాల్లో వందల కోట్ల రూపాయలు విలువగల ప్రభుత్వ స్థలాలు ఆక్రమణంలో ఉన్నాయి. వందల కోట్ల రూపాయల విలువ గల ప్రభుత్వ స్థలాలను ఆక్రమణల చెర నుంచి స్వాధీనం చేసుకొని అవసరమైన ప్రభుత్వ కార్యాలయాలకు కేటాయించాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు.