ప్రభాతదర్శిని, (నెల్లూరు-ప్రతినిధి):నెల్లూరు నగర పాలక సంస్థ కమిషనర్ సూర్యతేజ మంగళవారం నగరంలోని పొదలకూరు రోడ్డు, ఎఫ్.సి.ఐ గోదాములు, వేపదొరువు, బాలాజీ నగర్ తదితర ప్రాంతాల్లోని ఓపెన్ లే అవుట్ ఖాళీ స్థలాలను పరిశీలించారు. నగర పాలక సంస్థ కు చెందిన ఖాళీ స్థలాలను ప్రజాప్రయోజనాల నిమిత్తం అభివృద్ధి చేసేందుకు అవసరమైన ప్రణాళికలు సిద్ధం చేయాలని సూచించారు. అదేవిధంగా ప్రయివేటు ఖాళీ స్థలాల్లో నిర్వహణ లేకుండా ముళ్ళ కంపలు పెరిగిపోయి, వర్షపు నీటి మురుగు నిల్వతో దోమల ఎదుగుదలకు కారణభూతమవుతున్న స్థలాల యజమానులను గుర్తించి శుభ్ర పరుచుకునేలా నోటీసులు జారీ చేయాలని అధికారులను ఆదేశించారు. నిరుపయోగంగా ఉన్న ఖాళీ స్థలాలు అసాంఘిక శక్తులకు, పందులకు ఆవాసంగా మారుతున్నాయని, స్థానిక ప్రజలు తీవ్ర అసౌకర్యాలకు గురవుతున్నారని కమిషనర్ తెలిపారు. అనంతరం స్థానిక అల్లీపురం డంపింగ్ యార్డును తనిఖీ చేశారు. యార్డు నిర్వహణ, రీ సైక్లింగ్ విధానాలు వంటి అన్ని అంశాలను ప్రత్యక్షంగా పరిశీలించారు. స్థానిక వెంకటేశ్వర పురంలోని పశువుల సంత ప్రాంతాన్ని పరిశీలించి అక్కడ పారిశుధ్య నిర్వహణ పనులను క్రమంతప్పకుండా చేపట్టాలని సూచించారు.ఈ కార్యక్రమంలో నగర పాలక సంస్థ ఇంజనీరింగ్ ఈ.ఈ సంజయ్, డి.ఈ సురేష్, సిటీ ప్లానర్ దేవీ కుమారీ, సర్వేయర్ సోమేశ్వర్ రావు, ఉద్యాన శాఖ ఏ.డి ప్రదీప్ కుమార్, సచివాలయ కార్యదర్శులు, సిబ్బంది పాల్గొన్నారు.
నన్నూరు శ్రీనివాసరావు పత్రిక రంగంలో 30 ఏళ్ల అనుభవం ఉన్న అనుభవజ్ఞుడైన పాత్రికేయుడు. ఆంధ్రప్రదేశ్లోని ఉమ్మడి నెల్లూరు జిల్లా కి చెందిన శ్రీనివాసరావు, తన ప్రాతికేయ వృత్తిని గ్రామీణ ప్రాంతము నుండి నెల్లూరు తిరుపతి జిల్లాలలో మొదలైంది. వామపక్ష పాత్రికేయ దిగ్గజాలైన మోటూరు హనుమంతరావు సంపాదకీయంలో వెలువడిన 'ప్రజాశక్తి' దినపత్రికలో ఓనమాలు నేర్చుకొని, మరో వామపక్ష పాత్రికేయ దిగ్గజం ఈడుపుగంటి నాగేశ్వరరావు సంపాదకీయంలో వెలువడిన 'విశాలాంధ్ర' తెలుగు దినపత్రికలో పత్రిక రంగంలో తుది మెరుగులు దిద్దుకున్నారు. 14 సంవత్సరాల పాత్రికేయ వృత్తిలో సంపాదించుకున్న అనుభవాన్ని 'ప్రభాతదర్శిని' తెలుగు దినపత్రిక ద్వారా సంపాదకులుగా మారారు. వామపక్ష భావజాలంతో సామాజిక, రాజకీయ, ఆర్థిక అంశాలపై లోతైన వార్త కథనాల విశ్లేషణలు అందించడానికి ఈ వృత్తిని సమాజానికి అంకితం చేశారు. పత్రిక రంగంలో గ్రామీణ, పట్టణ, జిల్లా క్రైమ్ రిపోర్టర్ గా, సబ్ ఎడిటర్, డెస్క్ ఇంచార్జిగా పేజీ మేకింగ్ హోదాలో డెస్క్ లో విస్తృతమైన అనుభవంను సముపార్జన చేసి జర్నలిజంపై మక్కువతో "తప్పుడు వార్త కథనాలను ప్రచురించడం కూడా పత్రిక స్వేచ్ఛ కాలరాయడమే" అనే సిద్ధాంతంతో నిబద్ధత, నైతిక విలువలు, సామాజిక స్పృహతో కూడిన వార్త కథనాలతో ప్రజలకు అందించేందుకు ముందుకు సాగుతున్నారు. గణనీయమైన శిష్యుల బృందం కలిగిన నన్నూరు శ్రీనివాసరావు తన శిష్యులను కూడా జర్నలిజంలో తన స్థాయికి ఎదిగేందుకు కృషి చేస్తు బహుముఖ ప్రజ్ఞాశాలిగా సమాజంలో స్థానాన్ని సంపాదించుకున్నారు.