ప్రభాతదర్శిని ( తిరుపతి – ప్రతినిధి): జాతీయ నులిపురుగుల దినోత్సవం సందర్భంగా 1 నుండి 19 సంవత్సరాల వయస్సు గల పిల్లలకు నులిపురుగుల నివారణ చర్యల్లో భాగంగా 400 మి.గ్రా అల్బెండాజోల్ మాత్రల పంపిణీ కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ డా. ఎస్. వెంకటేశ్వర్ మంగళవారం స్థానిక కలెక్టరేట్ లో ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, పిల్లల ఆరోగ్య పరిరక్షణలో నులిపురుగుల నివారణ అత్యంత కీలకమని తెలిపారు. నులిపురుగుల వల్ల రక్తహీనత, పోషకాహార లోపం, ఎదుగుదల మందగింపు వంటి సమస్యలు తలెత్తే అవకాశమున్నందున ప్రభుత్వం చేపడుతున్న ఈ కార్యక్రమాన్ని ప్రతి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు ప్రాముఖ్యతతో తీసుకోవాలని సూచించారు.ఈ కార్యక్రమం జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రవేటు పాఠశాలలు, కళాశాలలు, ఆంగన్‌వాడీ కేంద్రాలలో పంపిణి చేసి విద్యార్థులకు అల్బెండాజోల్ మాత్రలపై విస్తృతంగా అవగాహనా కల్పించాలన్నారు. జిల్లాలోని అర్హత గల పిల్లలందరికీ ఆరోగ్య శాఖ, విద్యాశాఖ, ఐసీడీఎస్ విభాగాల సమన్వయంతో మాత్రలను పంపిణీ చేయాలని తెలిపారు. విద్యార్థులు ఆరోగ్య సిబ్బంది సూచనల మేరకు మాత్రలను తీసుకోవాలని, పరిశుభ్రత పాటించడం, చేతులు శుభ్రంగా కడుక్కోవడం వంటి అలవాట్లు అలవరచుకోవాలని కోరారు. అనంతరం విద్యార్థులకు 400 మి.గ్రా అల్బెండాజోల్ మాత్రలను జిల్లా కలెక్టర్ పంపిణీ చేశారు. ఫిబ్రవరి 2026లో నిర్వహిస్తున్న ఈ మొదటి విడతలో తిరుపతి జిల్లాలో మొత్తం 4,97,311 మంది పిల్లలకు అల్బెండాజోల్ మాత్రలను వేయనున్నట్లు తెలిపారు. నేడు గైర్హాజరైన లేదా అనారోగ్యంతో ఉన్న పిల్లలకు 24 ఫిబ్రవరి 2026 న మాప్-అప్ దినంగా అల్బెండాజోల్ మాత్రలు పంపిణీ చేయనున్నట్లు వెల్లడించారు. కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి బాలకృష్ణ నాయక్, రాష్ట్ర పరిశీలకులు ఏ పి ఎస్ ఏ సి ఎస్ జె డి డా ప్రస్సన్న, రాష్ట్ర నాణ్యత పరిశీలకులు జ్యోతి, ఆర్ బి ఎస్ కె పి ఓ రెడ్డి ప్రసాద్ వైద్య సిబ్బంది, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.