ప్రభాతదర్శిని (తిరుపతి-ప్రతినిధి):తిరుపతి జిల్లా పులికాట్ ప్రాంతంలో కొనసాగుతున్న అంతర్రాష్ట్ర జల వివాదం సమస్య గురించి స్థానిక మత్స్యకారులు తిరుపతి ఎంపీ గురుమూర్తి దృష్టికి తీసుకెళ్లారు. జిల్లాలోని సుమారు 24 గ్రామాల మత్స్యకారులకు పులికాట్ సరస్సు,దాని పరిసర తీర ప్రాంతాల్లో చేపల వేటే ప్రధాన జీవనాధారమని,అందులో ఐదు గ్రామాలు పూర్తిగా మత్స్యవృత్తిపైనే ఆధారపడి ఉన్నాయని వారు ఎంపీకి వివరించారు.పన్నంగాడు ప్రాంతంలో ఉన్న పులికాట్ సరస్సు పబ్లిక్ పులికాట్ మ్యాప్స్ ప్రకారం పూర్తిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిధిలోనే ఉందని, ఈ ప్రాంతం అంతర్రాష్ట్ర సరిహద్దుకు సుమారు 3.34 కిలోమీటర్ల దూరంలో ఉన్నప్పటికీ తమిళనాడు రాష్ట్రానికి చెందిన మత్స్యకారులు సరిహద్దులు మార్చేశారని అందువలన చేపల వేట కొనసాగించడం సమస్యగా మారిందని మత్స్యకారులు తెలిపారు.దీనివల్ల తరచు ఘర్షణలు చోటుచేసుకుంటూ,స్థానిక మత్స్యకారులు భయభ్రాంతులకు గురవుతూ జీవనాధారం కోల్పోయే పరిస్థితి నెలకొందని ఎంపీకి తెలియజేశారు.ఈ అంశం గురించి వారితో మాట్లాడిన ఎంపీ ఈ సమస్య గురించి గతంలో పార్లమెంటు సమావేశాలలో మాట్లాడిన విషయాన్ని గుర్తు చేశారు.ఈ విషయమై మరోసారి పార్లమెంటులో ప్రస్తావిస్తానని వారికి తెలిపారు.ఈ సమస్యపై జిల్లా కలెక్టర్తో మాట్లాడిన ఎంపీ గురుమూర్తి అక్రమ చొరబాట్లను అరికట్టి స్థానిక మత్స్యకారులకు రక్షణ కల్పించాలని,వారి సంప్రదాయ మత్స్యకార హక్కులను కాపాడేలా శాశ్వత పరిష్కారం చూపాలని కోరారు.
నన్నూరు శ్రీనివాసరావు పత్రిక రంగంలో 30 ఏళ్ల అనుభవం ఉన్న అనుభవజ్ఞుడైన పాత్రికేయుడు. ఆంధ్రప్రదేశ్లోని ఉమ్మడి నెల్లూరు జిల్లా కి చెందిన శ్రీనివాసరావు, తన ప్రాతికేయ వృత్తిని గ్రామీణ ప్రాంతము నుండి నెల్లూరు తిరుపతి జిల్లాలలో మొదలైంది. వామపక్ష పాత్రికేయ దిగ్గజాలైన మోటూరు హనుమంతరావు సంపాదకీయంలో వెలువడిన 'ప్రజాశక్తి' దినపత్రికలో ఓనమాలు నేర్చుకొని, మరో వామపక్ష పాత్రికేయ దిగ్గజం ఈడుపుగంటి నాగేశ్వరరావు సంపాదకీయంలో వెలువడిన 'విశాలాంధ్ర' తెలుగు దినపత్రికలో పత్రిక రంగంలో తుది మెరుగులు దిద్దుకున్నారు. 14 సంవత్సరాల పాత్రికేయ వృత్తిలో సంపాదించుకున్న అనుభవాన్ని 'ప్రభాతదర్శిని' తెలుగు దినపత్రిక ద్వారా సంపాదకులుగా మారారు. వామపక్ష భావజాలంతో సామాజిక, రాజకీయ, ఆర్థిక అంశాలపై లోతైన వార్త కథనాల విశ్లేషణలు అందించడానికి ఈ వృత్తిని సమాజానికి అంకితం చేశారు. పత్రిక రంగంలో గ్రామీణ, పట్టణ, జిల్లా క్రైమ్ రిపోర్టర్ గా, సబ్ ఎడిటర్, డెస్క్ ఇంచార్జిగా పేజీ మేకింగ్ హోదాలో డెస్క్ లో విస్తృతమైన అనుభవంను సముపార్జన చేసి జర్నలిజంపై మక్కువతో "తప్పుడు వార్త కథనాలను ప్రచురించడం కూడా పత్రిక స్వేచ్ఛ కాలరాయడమే" అనే సిద్ధాంతంతో నిబద్ధత, నైతిక విలువలు, సామాజిక స్పృహతో కూడిన వార్త కథనాలతో ప్రజలకు అందించేందుకు ముందుకు సాగుతున్నారు. గణనీయమైన శిష్యుల బృందం కలిగిన నన్నూరు శ్రీనివాసరావు తన శిష్యులను కూడా జర్నలిజంలో తన స్థాయికి ఎదిగేందుకు కృషి చేస్తు బహుముఖ ప్రజ్ఞాశాలిగా సమాజంలో స్థానాన్ని సంపాదించుకున్నారు.