

శ్రీనివాస మైనింగ్ పరిశీలనకు వెళ్తున్న ఎమ్మెల్సీ ని అడ్డుకున్న పోలీసులు
-వైసీపీ కార్యాలయం వద్ద ఉద్రిక్తత
ప్రభాతదర్శిని,(గూడూరు-ప్రతినిధి): గూడూరు మండల పరిధిలోని మంగళపూరు వద్ద శ్రీనివాస మైనింగ్ లో అక్రమ మైనింగ్ జరుగుతోందని ఆరోపిస్తూ నేడు వైకాపా నేత , ఎమ్మెల్సీ మేరిగ మురళీధర్ వైసీపీ నాయకులతో కలిసి పరిశీలించేందుకు వెళ్తున్న క్రమంలో ఆయన నివాసం వద్ద పోలీసులు అడ్డుకున్నారు.సదరు మైన్ ను పరిశీలించేందుకు అధికారుల అనుమతులు తప్పనిసరి అంటూనే పోలీసులు నోటీసులు అందజేసి పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది.భారీ సంఖ్యలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు ర్యాలీగా వెళ్తున్న క్రమంలో పోలీసులు మోహరించి అడ్డుకోవడంతో కాసేపు ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ మేరిగ మురళీధర్ మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో ప్రజలను కించపరిచే విధంగా వ్యవస్థలు ఉండకూడదనీ ఒక ఎమ్మెల్సీగా తన పరిధిలో అనుమతులు లేకుండా బాంబ్ బ్లాస్టింగ్ చేస్తూ భయభ్రాంతులకు గురిచేస్తున్న అక్రమ మైనింగ్ జరుగుతోందన్న విషయం తెలుసుకుని పరిశీలనకు వెళ్తుంటే పోలీసులు అడ్డుకోవడం ఏమిటని ప్రశ్నించారు. ప్రభుత్వాస్తులను ధ్వంసం చేస్తూ ఎలాంటి అనుమతులు లేకుండా మైనింగ్ నిర్వహిస్తున్న నిర్వాహకంపై తనిఖీ చేసే హక్కు ఉందన్నారు. రాజ్యాంగానికి విరుద్ధంగా పోలీసులు అధికార పార్టీ ఏజెంట్ లాగా వ్యవహరిస్తున్నారని, తాము తీవ్రంగా ఖండిస్తున్నామని, తగిన మూల్యం చెల్లించుకుంటారని ఆగ్రహం వ్యక్తం చేశారు…కూటమి ప్రభుత్వమో లేక ప్రజలను కూల్చే ప్రభుత్వమో అర్థం కావడం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు… మరో వైపు మైనింగ్ ఏడీ తీరుపై కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో వైకాపా సీనియర్ నాయకులు విజయ మోహన్ రెడ్డి, జిల్లా వైసిపి ఉపాధ్యక్షులు మెట్ట రాధాకృష్ణారెడ్డి, వాయుగుండ్ల నాగరాజు,గూడూరు మండల పరిషత్ అధ్యక్షులు బూదురు గురవయ్య, రాష్ట్ర యువజన విభాగం నాయకులు కొండూరు సునీల్ కుమార్ రెడ్డి అట్ల శ్రీనివాసులురెడ్డి, గోపి యాదవ్, కొట్టు అశోక్, నాయకులు కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.