

రైతుల ఖాతాలకు 24 గంటల్లోనే డబ్బులు జమ
రైతులకు గిట్టుబాటు ధర కల్పించాం:
రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్
ప్రభాతదర్శిని,(ప్రత్యేక-ప్రతినిధి):: రైతులకు గిట్టుబాటు ధర కల్పించి రైతులు పండించిన ప్రతి బస్తాను ప్రభుత్వము కొనుగోలు చేస్తుందని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు. శుక్రవారం సాయంత్రం వెంకటగిరి మండలం యాతలూరు గ్రామము నందు జాయింట్ కలెక్టర్ శుభం బన్సల్, తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు,రైల్వే కోడూరు ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ శ్రీధర్, గూడూరు సబ్ కలెక్టర్ రాఘవేంద్ర మీనా, గ్రామ సర్పంచ్ పెంచలమ్మల తో కలసి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర పౌరసరఫరాల సంస్థ రైతు సేవ కేంద్రం ద్వారా ధాన్యము కొనుగోలు రబీ సీజన్ 2024 – 25 సంవత్సరానికి సంబంధించి రైతులతో నిర్వహించిన ముఖా ముఖి కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర కల్పించడంతో పాటుగా ప్రతి బస్తాను ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని రైతులు ధైర్యంగా ఉండాలన్నారు. రైతుల సంక్షేమం దృష్టిలో పెట్టుకొని కూటమి ప్రభుత్వం వచ్చిన ఎనిమిది నెలలోనే 7 వేల మంది రైతుల నుంచి 74 వేల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం కొనుగోలు చేసి 154 కోట్లు రైతుల ఖాతాలకు జమ చేయడం జరిగిందని తెలిపారు. రాష్ట్రంలో ఉన్న ప్రతి రైతు సంతోషంగా ఉండాలన్నదే రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ముఖ్య ఉద్దేశం అన్నారు. జిల్లాలో 134 రైతు సేవా కేంద్రాల ద్వారా రైతుల నుంచి వరి ధాన్యం కొనుగోలు చేయడం జరుగుతోందని తెలిపారు. గత ప్రభుత్వం రైతులకు బకాయిలు చెల్లించకుండా పెండింగ్ పెట్టిన 1674 కోట్ల రూపాయల బకాయిలను కూటమి ప్రభుత్వం రైతులకు చెల్లించడం జరిగింది అన్నారు. రైతుల అనుభవాలను, వారి కష్టాలను తెలుసుకొనడానికి యాతలూరు గ్రామానికి రావడం జరిగిందన్నారు. భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా వాట్సప్ ద్వారా రైతుల ధాన్యమును కొనుగోలు చేసుకునే విధంగా రాష్ట్ర ప్రభుత్వం టెక్నాలజీని తీసుకొచ్చిందని, రైతులకు నచ్చిన రైసుమిల్లులకు ధాన్యమును వారు అమ్ముకోవచ్చునని రైతులకు సూచించారు. రైతుల నుండి ధాన్యము కొనుగోలు చేసిన 48 గంటల్లోనే రైతులకు డబ్బు చెల్లించడం జరుగుతుందని ముఖ్యమంత్రి ఆదేశాలు ఇవ్వడం జరిగిందని, అయితే 24 గంటల్లోనే 90 శాతం మంది రైతులకు జమవుతుందని తెలిపారు. రైతు నుంచి ప్రతి బస్తాని కొనుగోలు చేయడం జరుగుతుందని, రైతులు ధైర్యంగా ఉండాలన్నారు. 17 శాతం తేమ ఉన్ననూ ధాన్యంను కొనుగోలు చేయాలని మిల్లర్ల కు ఆదేశాలు ఇవ్వడం జరిగిందన్నారు. గోతాల కొరత వల్ల ఏ రైతు ఇబ్బందులు పడకూడదని ఉద్దేశంతో జిల్లా కు ఐదు లక్షల గోతాలను అందజేయడం జరిగిందన్నారు. రైతుల ఆవేదనను అధికారులు అర్థం చేసుకోవాలన్నారు. అధికారులు కార్యాలయాల్లో కూర్చోకుండా క్షేత్రస్థాయిలో పర్యటించి రైతుల సాధక బాధలు తెలుసుకొని రైతులకు ధైర్యం నూరిపోయాలన్నారు. రైతులకు గిట్టుబాటు ధర కల్పించి రైతులు ఎలాంటి ఇబ్బందులు పడకుండా అధికారులు చూడాలన్నారు. పండించిన ధాన్యాన్ని ఎప్పుడు తీసుకొచ్చినా ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని, రైతులకు కావలసిన ఎరువులు విత్తనాలు సకాలంలో అందజేయడం జరుగుతుందన్నారు. రైతులు రైతు సేవా కేంద్రం లో అమ్మగానే రైతులకు మీరు అమ్మినట్లుగా, మీకు డబ్బులు పడిందని, మీరు సంతోషంగా ఉన్నారా అని మీ ఫోన్ కు మెసేజ్ లు వస్తున్నాయా అని రైతులను అడిగి తెలుసుకున్నారు. రైతులు వస్తున్నాయని, గతంలో రైతులు మిల్లర్ల వద్ద నాలుగైదు రోజులు పడిగాపులు కాచే వారమని, ప్రస్తుత కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత నాలుగు గంటల లోపల మిల్లర్లకు అప్పజెప్పి రైతులు సంతోషంగా వస్తున్నారని రైతులు మంత్రికి వివరించారు. ఈ కార్యక్రమంలో డిసిఓ లక్ష్మి, డిఎం సివిల్ సప్లైస్ సుమతీ,మండల తహశీల్దార్, ఎంపిడిఓ మండల స్థాయి వివిధ శాఖల అధికారులు, ప్రజా ప్రతినిధులు, పార్టీల నేతలు, రైతులు తదితరులు పాల్గొన్నారు.