ప్రభాతదర్శిని, (దిల్లీ ప్రత్యేక-ప్రతినిధి): రోగులకు ముప్పుతెచ్చే అవకాశం ఉందనే కారణంతో కేంద్ర ప్రభుత్వం 156 రకాల ఔషధాలను నిషేధించింది. వీటిని ప్రధానంగా జ్వరం, జలుబు, నొప్పులు, ఎలర్జీలకు మందులుగా వాడుతుంటారు. స్థిర మోతాదులో రెండు, అంతకంటే ఎక్కువ క్రియాశీల ఔషధ పదార్థాలను కలిపి వాడే మందులను (కాంబినేషన్‌ డ్రగ్స్‌ను) కాక్‌టెయిల్‌ డ్రగ్స్‌ అని కూడా వ్యవహరిస్తారు. ఎసెక్లోఫెనాక్‌ 500 ఎంజీ + పారాసెటమాల్‌ 125 ఎంజీ మాత్రలను, మెఫెనమిక్‌ యాసిడ్‌ + పారాసెటమాల్‌ ఇంజెక్షన్, సెట్రిజెన్‌ హెచ్‌సీఎల్‌+ పారాసెటమాల్‌+ ఫినైలెప్రైన్‌ హెచ్‌సీఎల్, లెవొసెట్రిజిన్‌+ ఫినైలెప్రైన్‌ హెచ్‌సీఎల్‌+ పారాసెటమాల్‌ వంటివి నిషేధిత మందుల జాబితాలో ఉన్నాయి. ఈ మేరకు నోటిఫికేషన్‌ విడుదలైంది. సురక్షితమైన ప్రత్యామ్నాయ మందులు ఉండగా ఫిక్స్‌డ్‌ డోస్‌ కాంబినేషన్‌ (ఎఫ్‌డీసీ) ఔషధాలను వాడడం ప్రమాదాన్ని ఆహ్వానించడమే అవుతుందని అందులో పేర్కొన్నారు.