ప్రభాతదర్శిని (కర్నూలు -ప్రత్యేక ప్రతినిధి):విధుల పట్ల నిర్లక్ష్యం వహించిన సీఐ, ఎస్ఐలపై డి.ఐ.జి. విజయారావు వేటు వేశారు. నంద్యాల జిల్లా, ముచ్చుమర్రి పోలీస్ స్టేషన్ పరిధిలో బాలిక అదృశ్యం ఘటనను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది. విధుల పట్ల నిర్లక్ష్యం వహించడమే కాకుండా క్రమశిక్షణ ఉల్లంఘించిన ఇద్దరు పోలీసు ఉద్యోగులను కర్నూల్ రేంజ్ డీఐజీ సీహెచ్ విజయరావు బుధవారం సస్పెండ్ చేశారు. ఇందులో భాగంగా నందికొట్కూరు రూరల్ సీఐ విజయ భాస్కర్, ముచ్చుమర్రి పోలీసు స్టేషన్ ఎస్సై ఆర్. జయశేఖర్ లపై వేటు వేస్తూ కర్నూల్ రేంజ్ డీఐజీ ఉత్తర్వులు జారీ చేశారు. విధుల పట్ల ఎవరైనా నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని కర్నూలు రేంజ్ డిఐజి హెచ్చరించారు.రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపిన ముచ్చుమర్రి ఘటనపై పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. బాలిక మృతదేహం కోసం ముమ్మరంగా గాలిస్తున్నారు. జూలై 7న ఆడుకోవడానికి వెళ్లిన బాలికను ముగ్గురు మైనర్ బాలురు లైంగిక దాడి చేసి చంపేశారని, మృతదేహాన్ని కేసీ కెనాల్ లో పడేసినట్టు నంద్యాల ఎస్పీ అదిరాజ్ తెలిపారు. తమ పిల్లలు దొరికి పోతారనే భయంతో నిందితుల కుటుంబీకులు బాలిక మృత దేహానికి రాళ్లు కట్టి పుట్టిలో తీసుకెళ్లి కృష్ణా నదిలో పడేశారని వెల్లడించారు. ఇంకా ఈ సంఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే రాబట్టడం జరుగుతుందని ఎస్పీ విలేఖరులకు తెలిపారు.
నన్నూరు శ్రీనివాసరావు పత్రిక రంగంలో 30 ఏళ్ల అనుభవం ఉన్న అనుభవజ్ఞుడైన పాత్రికేయుడు. ఆంధ్రప్రదేశ్లోని ఉమ్మడి నెల్లూరు జిల్లా కి చెందిన శ్రీనివాసరావు, తన ప్రాతికేయ వృత్తిని గ్రామీణ ప్రాంతము నుండి నెల్లూరు తిరుపతి జిల్లాలలో మొదలైంది. వామపక్ష పాత్రికేయ దిగ్గజాలైన మోటూరు హనుమంతరావు సంపాదకీయంలో వెలువడిన 'ప్రజాశక్తి' దినపత్రికలో ఓనమాలు నేర్చుకొని, మరో వామపక్ష పాత్రికేయ దిగ్గజం ఈడుపుగంటి నాగేశ్వరరావు సంపాదకీయంలో వెలువడిన 'విశాలాంధ్ర' తెలుగు దినపత్రికలో పత్రిక రంగంలో తుది మెరుగులు దిద్దుకున్నారు. 14 సంవత్సరాల పాత్రికేయ వృత్తిలో సంపాదించుకున్న అనుభవాన్ని 'ప్రభాతదర్శిని' తెలుగు దినపత్రిక ద్వారా సంపాదకులుగా మారారు. వామపక్ష భావజాలంతో సామాజిక, రాజకీయ, ఆర్థిక అంశాలపై లోతైన వార్త కథనాల విశ్లేషణలు అందించడానికి ఈ వృత్తిని సమాజానికి అంకితం చేశారు. పత్రిక రంగంలో గ్రామీణ, పట్టణ, జిల్లా క్రైమ్ రిపోర్టర్ గా, సబ్ ఎడిటర్, డెస్క్ ఇంచార్జిగా పేజీ మేకింగ్ హోదాలో డెస్క్ లో విస్తృతమైన అనుభవంను సముపార్జన చేసి జర్నలిజంపై మక్కువతో "తప్పుడు వార్త కథనాలను ప్రచురించడం కూడా పత్రిక స్వేచ్ఛ కాలరాయడమే" అనే సిద్ధాంతంతో నిబద్ధత, నైతిక విలువలు, సామాజిక స్పృహతో కూడిన వార్త కథనాలతో ప్రజలకు అందించేందుకు ముందుకు సాగుతున్నారు. గణనీయమైన శిష్యుల బృందం కలిగిన నన్నూరు శ్రీనివాసరావు తన శిష్యులను కూడా జర్నలిజంలో తన స్థాయికి ఎదిగేందుకు కృషి చేస్తు బహుముఖ ప్రజ్ఞాశాలిగా సమాజంలో స్థానాన్ని సంపాదించుకున్నారు.