ప్రభాతదర్శిని, (ప్రత్యేక-ప్రతినిధి): అన్నమయ్య జిల్లా మదనపల్లిలో ఘోరం జరిగింది. కన్న కూతురు తన ప్రియుడికి 10 లక్షల సుఫారి ఇచ్చి కన్నతండ్రిని కడతేర్చిన వైనం మానవతా విలువలను మంట కలిపింది. వివాహం కాకుండానే తన ఇంట్లోనే సహజీవనం చేస్తున్న కుమార్తె వ్యవహారాన్ని తెలుసుకున్న తండ్రి, తనకు నచ్చని పెళ్లికి సిద్ధమయ్యాడని కన్న తండ్రినే ఓ బిడ్డ కడతేర్చిన ఘటన సభ్య సమాజాన్ని కలచి వేసింది. తప్పటడుగుల ప్రాయంలో చిటికిన వేలుతో నడక నేర్పి,, కౌమార దశలో కంటికి రెప్పలా కాపాడిన తండ్రి మమకారం..ప్రియుడి ప్రేమమత్తులో ఆ కూతురుకు గుర్తుకురాలేదా? అని మదనపల్లి జనం తమను తాము ప్రశ్నించుకునే దారుణ ఘటన ఇది. అన్నమయ్య జిల్లా మదనపల్లెలో బుధవారం తెల్లవారు జామున ఈ ఘాతుకం జరిగింది. వివరాలు ఇలా ఉన్నాయి. మదనపల్లి పట్టణంలోని ఎగువ కురవంక ఆంజనేయ స్వామి గుడి సమీపంలోని పోస్టల్ అండ్ టెలీకమ్ కాలనీలో జీఆర్టీ స్కూల్ టీచర్ దొరస్వామి నివసిస్తున్నారు. ఆయన భార్య లత ఏడాదన్నర కిందట చని పోయారు. అప్పటి నుంచి తన ఒక్కగాని ఒక్క గారాల పట్టి హరిత (25) ను కంటికి రెప్పలా దొరస్వామి కాపాడుతున్నారు. ఆమె బీఎస్సీ బీఈడీ చదివింది. త్వరలో టీచర్ ఉద్యోగం నుంచి రిటైర్ కానున్నారు. ఉద్యోగ విరమణతో వచ్చే డబ్బుతో .. తల్లి లేని బిడ్డకు వైభవంగా పెళ్లి చేసి మెట్టినింటికి పంపించాలని నిర్ణయం తీసుకున్నారు. కుప్పంలో ఓ కుటుంబంతో సంబంధం కుదిర్చారు. సుమారు రూ.80 లక్షల విలువ చేసే రెండు అంతస్తుల భవనం ఆస్తిని ఈ మధ్యనే తన కూతురుకు పసుపు కుంకుమగా రిజిస్ర్టేషన్ చేశారు. ఆయనకు మద్యం అలవాటు ఉంది. బుధవారం రాత్రి మద్యం తాగి నిద్ర పోయారు. ఉదయం చూసే సరికి రక్త మడుగులో దొరస్వామి శవం కనిపించింది. మదనపల్లి పోలీసులకు ఈ సమాచారం అందింది. డీఎస్పీ ప్రసాద్ రెడ్డి వన్ టౌన్, తాలుకా సీఐలు వల్లి బసు , శేఖర్, క్లూస్ టీం, డాగ్ స్క్వాడ్ చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. కీలక ఆధారాలు సేకరించారు. ప్రియుడికి రూ.10 లక్షల సుఫారీ: మాస్టార్ హత్య కేసు మిస్టరీని పోలీసులు ఛేదిస్తున్నారు. అంత్యంత గోప్యంగా అందిన పోలీసుల దర్యాప్తు సమాచారం మేరకు.. కన్నకూతురే అత్యంత క్రూరంగా చంపిందని, ఇందుకు ఇద్దరు ప్రియులను వినియోగిందనే సమాచారం బయటకు పొక్కింది. ఎందుకంటే.. . దొరస్వామి హత్య జరిగిన సమయంలో కుమార్తె హరిత ఇంటిలోనే ఉంది. ఈ విషయాన్ని గుర్తించిన పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. తొలుత గుర్తు తెలియని వ్యక్తులు చంపేశారని చెప్పింది. ఆ సమయంలో ఘర్షణ వినపడలేదా? దెబ్బల శబ్ధం వినపడలేదా? ఇలాంటి ప్రశ్నలు సంధించే సరికి.. తన తండ్రి దొరస్వామిని తానే చంపానని హరిత పోలీసులకు తెలిపింది. దొరస్వామి తనపై లైంగిక వేదింపులకు పాల్సడినట్టు ఆమె వినిపించిన కథను దర్యాప్తు అధికారులు నమ్మలేదు. మరిన్ని ప్రశ్నలు సంధించగా… అసలు ప్రియుల కథను విప్పిందని తెలుస్తోంది. తనకు ఇద్దరు ప్రియులు ఉన్నారు. పై అంతస్తులో రహస్యంగా సహజీవనం చేస్తుంది. రోజుకు ఒకరు పై అంతస్తుకు వస్తారు. కింది అంతస్తులోని దొరస్వామికి ఈ విషయాన్ని స్థానికులు తెలిపారు. పెళ్లి చేసి పంపించాలని నిర్ణయానికి వచ్చారు. వేరే వ్యక్తితో తనకు పెళ్లి వద్దని హరిత ఎదురు తిరిగింది. తండ్రి ఒప్పుకోలేదు. దీంతో అతడిని హతమార్చటానికి హరిత సిద్ధమైంది. ఒక ప్రియుడికి రూ.10లక్షల సుఫారీ ఇచ్చింది. అంతే దొరస్వామిని హతమార్చారు. ఈ ఘటన జరిగిన సమయంలో ఓ ప్రియుడు తిరుమలలో వెంకన్న దర్శనం క్యూలో ఉన్నాడు. మరొక ప్రియుడి ఫోన్ ఆధారంగా ఎక్కడ ఉన్నాడో పోలీసులు సమాచారం సేకరిస్తున్నారు. చపాతీల కర్రతో.. ఇనుప రాడ్డుతో తానే కొట్టి చంపానని నిందితురాలు పోలీసులకు చెప్పిట్టు సమాచారం. కానీ.. ఒంటరిగా ఆమె మాత్రమే హత్య చేసే అవకాశం లేదని, కనీసం ఇద్దరు ముగ్గురు సహకరించినట్టుగా పోలీసులు అనుమానిస్తున్నారు. ఆమె చెప్పిన కొన్ని విషయాలపై మరిన్ని అనుమానాలు ఉన్నట్టు తెలుస్తోంది.ఈ ఉత్తమ ఉపాధ్యాయుడిని కన్నకూతురే హతమార్చినట్టు పోలీసులు ఓ నిర్ణయానికి వచ్చినట్టు ప్రచారం జరుగుతోంది.