●కౌమార దశ ఆడపిల్లల పై జరుగుతున్న దాడులను అరికట్టాలి.
● అంతర్జాతీయ బాలికా దినోత్సవం సందర్భంగా డాక్టర్ పసుపులేటి పాపారావు అందిస్తున్న ప్రత్యేక కథనం.
దేశ భవిష్యత్తు పిల్లల పై ఆధారపడి ఉంటుంది. బాల బాలికలు జాతి సంపద. సమానత, స్వేచ్ఛ, గౌరవం, వారసత్వం, వ్యక్తిత్వం సార్వజనీనత వంటివి అందరికీ సమానంగా వర్తించే మానవ హక్కుల లక్షణాలు. కానీ నేటి మన దేశ పరిస్థితులలో బాలికలు వాళ్ళ హక్కులను పూర్తిగా పొందలేక పోతున్నారు. ప్రస్తుతం సమాజంలో బాలికలు, బాల్య వివాహం, విద్య అసమానత, లింగ ఆధారిత హింస, కుటుంబ సభ్యుల ప్రవర్తన , ఆత్మగౌరవం, ఋతుస్రావం సమయంలో, ప్రార్థనా స్థలాలలో, బహిరంగ ప్రదేశాల్లో, పని చేస్తున్న ప్రదేశాలలో లైంగిక వేధింపులు వంటి సమస్యలను ఎదుర్కొంటున్నారు. బాలికల హక్కుల ఉల్లంఘన, మానవహక్కులకు వ్యతిరేకంగా ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది ఆడపిల్లలు ఎదుర్కొంటున్న సవాళ్లని ప్రపంచానికి తెలియజేయడంతో పాటు బాలికలకు అవగాహన పెంచే ఉద్దేశంతో ప్రతి ఏడాది అక్టోబర్ 11 వ తేదీని అంతర్జాతీయ బాలికల దినోత్సవంగా జరుపుకోవాలని ఐక్యరాజ్య సమితి మొదట డిసెంబర్‌ 19న 2011లో ప్రకటించింది. అక్టోబర్ 11, 2012 నుండి ఇది అమలవుతుంది. కౌమార దశలో ఆడపిల్లలు, యువతులు ఎదుర్కొనే వివిధ రకాల హింసను అంతం చేయాలని, హింసను ఎదుర్కోవడమే కాకుండా, లేకుండా చేయడానికి ఆడపిల్లలు తమ శక్తి సామర్ధ్యాలను గుర్తించాలి. సాధికారిత ప్రాముఖ్యాన్ని గుర్తించాలని అభిప్రాయపడింది. కిశోర బాలిక మహిళగా రూపొందే కీలక దశ కౌమార దశ. ఆమెను వర్తమానం లోనే కాదు భవిష్యత్తులోనూ సాధికరతా దిశలో నడిపించడానికి ఆమెకు అవగాహన అవసరం. ఆమెను చైతన్యం చేయడం అవసరం. ప్రపంచ వ్యాప్తంగా బాలికల పట్ల వివక్ష, అసమానత, చిన్నచూపు, లైంగిక వేధింపులు, అత్యాచారాలు, హింస, ఆధిపత్యం వివిధ రకాలగా హాని కలిగిస్తున్నాయి. ఈ ధోరణి సమాజాభివృద్దికి, మహిళా సాధికారతకి అవరోధం కలిగిస్తుంది. అందుకే బాల్యవివాహా లని నిరోధించి, హింస నుండి ఆమెను రక్షించ డానికి కుటుంబం , మిత్రులు, సమాజం అంతా సన్నద్ధం కావాలి. కిశోర బాలికలని స్వశక్తివంతులుగా తీర్చి దిద్దడానికి విద్య ప్రధానమైన ఆయుధం. బాలికల విద్యా హక్కు కోసం ఉద్యమించిన పాకిస్తానీ బాలిక మలాల చొరవ, సాహసం, చైతన్యం ఆమెకు నోబెల్ బహుమతి దక్కేలా చేశాయి. విద్యావంతుల కుటుంబంలో, సామాజిక చైతన్యం గల నేపథ్యం నుండి వచ్చిన మలాల మాత్రమే కాదు, కొద్ది పాటు చైతన్యం ఇస్తే సామాజికంగా వెనుకబడ్డ, నిరక్షరాస్యుల కుటుంబాల్లోంచి వచ్చిన ఆడపిల్లలు కూడా ఏంతో మంది మలాలాలు గా మారతారు!! తమపై జరిగే హింసని , దాడులని తిప్పికోడతారు. కిశోర బాలికలపై జరిగే హింసని అంతం చేయడానికి, ఆమెని స్వశక్తి వంతురాలిగా చేస్తూ సాదికారిత వైపు పయనింప చేయాలంటే అది ఏ ఒక్కరో కాదు చేయాల్సింది. ప్రభుత్వం, పౌర సంస్థలు, ప్రజలు, ప్రభుత్వ-ప్రభుత్వేతర సంస్థలు ఏకం కావాలి. కలసి కట్టుగా ప్రణాళికా బద్దంగా నిబద్దతతో కృషి చేయాలి. కిశోర బాలికలకి సాంకేతిక, వృత్తి విద్యా అవకాశాలు కల్పించాలి. శిక్షణ ఇవ్వాలి. తన జీవితాన్ని తాను తీర్చి నడిపించుకునేందుకు వృత్తి నైపుణ్యాలు, ఆత్మవిశ్వాసం, జీవన నైపుణ్యాలు, సామాజిక, ఆర్ధిక, ఆరోగ్యఅంశాలపై అవగాహన కల్పించాలి. శిక్షణలు ఇవ్వాలి. నేటి ఆడపిల్లలకి తప్పని సరి అవసరమైన భద్రత, సాంకేతిక విజ్ఞానాన్ని సేవల్ని అందు బాటులో ఉంచాలి. సామాజిక, ఆర్ధిక, రాజకీయ పరిస్థితులపట్ల అవగాహన కలిగించాలి. బాలికలకు అబ్బాయిలతో సమానంగా సరైన వనరులు, విద్యని అందించగలిగితే వారు ప్రపంచ వ్యాప్తంగా ఆకలి పస్తులు అనుభ విస్తున్న 16 శాతానికి తగ్గించగలరు. భారత్‌లో లింగ నిర్థారణ పరీక్షలపై నిషేధం ఉన్నా అవి అక్రమంగా జరిగిపోతున్నాయి. ఇది 1000 కోట్ల రూపాయల అక్రమ, అనైతిక పరిశ్రమగా రూపుదాల్చింది. భ్రూణ హత్యలకు కారణమవుతోంది.●ప్రపంచంలో ఏదోఒక చోట ప్రతి 10 నిమిషాలకు బాలికలు హింస కారణంగా మరణిస్తున్నారు.●16వ శతాబ్దం వరకు గాళ్‌ అనే పదంతో ఆడ, మగ ఇద్దరినీ సంబోధించేవారు.●ఆఫ్రికా ఖండంలో మాధ్యమిక విద్య లేని బాలికలు దాదాపు 2కోట్ల మందిగా నివేదికలున్నాయి.●ప్రపంచ వ్యాప్తంగా 36 మిలియన్ల మంది బాలికలు పాఠశాల విద్యను అందుకోలేకపోతున్నారు.●ప్రపంచవ్యాప్తంగా 70 కోట్లమంది అడపిల్లల వివాహాలు 18 సంవత్సరాల లోపు జరుగు తున్నాయి. వీళ్లలో ప్రతి ముగ్గురిలో ఒకరి కంటే ఎక్కువ మంది బాలికల వివాహం 15 సంవత్సరాలలోపే జరుగుతోంది.●అంతర్జాతీయ బాలికల దినోత్సవ లక్ష్యం కౌమార దశలో ఉన్న అమ్మాయిల స్థిరమైన అభివృద్ధి మరియు లింగ సమానత్వం.●అన్ని అభివృద్ధి చెందుతున్నదేశాల్లో దాదాపు సగం శాతం ఆడపిల్లలు 18 సంవత్సరాలోపే తల్లులుగా మారడంతో ఆరోగ్యసమస్యల్ని ఎదుర్కొంటున్నారు. ఇలాంటి ప్రత్యేక దినోత్సవాల్లో ఏదో ఒక కార్యక్రమం చేసి చేతులు దులుపుకోవడం కాకుండా అవగాహన, చైతన్య కార్యక్రమాలు నిరంతర ప్రక్రియగా కొనసాగుతుంటే తప్ప ఆడపిల్ల పట్ల తరతరాలుగా నిండి ఉన్న భావనలు సమూలంగా నశించవు.