
రాష్ట్ర గృహ నిర్మాణం శాఖ మంత్రి కొలుసు పార్ధ సారధి
ప్రభాతదర్శిని,(నెల్లూరు-ప్రతినిధి):గృహ నిర్మాణ కార్యక్రమంలో గత ప్రభుత్వంలో జరిగిన అవకతవకలను అధిగమించి అర్హత గల ప్రతి పేదవానికి ఇల్లు నిర్మించి ఇవ్వడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర గృహ నిర్మాణం, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్ధ సారధి అన్నారు. శుక్రవారం సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తో కలిసి మంత్రి పార్థసారథి టీపీ గూడూరు మండలంలోని వరిగొండ, పొదలకూరు మండలంలోని చిట్టేపల్లి తిప్ప గ్రామాల్లోని పేదల గృహ నిర్మాణాలను పరిశీలించారు. అనంతరం జెడ్పి హాల్లో రాష్ట్ర దేవాదాయ, ధర్మాదాయ శాఖ మంత్రి ఆనం రామ నారాయణ రెడ్డి, సర్వేపల్లి, కావలి ,కోవూరు, ఉదయగిరి శాసన సభ్యులు సోమిరెడ్డి చంద్ర మోహన్ రెడ్డి, దగుమాటి వెంకట కృష్ణారెడ్డి, వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి, కాకర్ల సురేష్, నుడా చైర్మన్ శ్రీనివాసులరెడ్డి, హోసింగ్ కార్పొరేషన్ యం డి రాజబాబు, జిల్లా కలెక్టర్ ఒ ఆనంద్ లతో కలసి జిల్లాలోని గృహ నిర్మాణాల పురోగతి గురించి సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి పార్థసారథి మాట్లాడుతూ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి సరిగా లేనప్పటికీ పేదల పక్షపాతి అయిన ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో అసంపూర్తిగా ఉన్న గృహ నిర్మాణ లబ్ధిదారులకు అదనపు మొత్తాలను మంజూరు చేశామన్నారు. ఎస్సీ, బీసీలకు 50 వేలు, ఎస్టీలకు 75 వేలు, ఆదివాసి గిరిజనులకు లక్ష రూపాయల వంతున మంజూరు చేసామన్నారు. ప్రస్తుతమున్న అధిక ధరలను దృష్టిలో ఉంచుకొని పేద ఎస్సీ,ఎస్ టి, బీసీలకు ఆర్థిక వెసులుబాటు కల్పిస్తూ గృహ నిర్మాణ యూనిట్ కాస్ట్ ను 1.8 లక్షల నుండి 2.5 లక్షల వరకు పెంచామన్నారు. గృహ నిర్మాణ శాఖలో ఎటువంటి నిధుల కొరత లేదని, క్రమ పద్ధతిలో ఎప్పటికప్పుడు చెల్లింపులు జరుగుతాయన్నారు. రాబోవు సంవత్సరం 2026 మార్చి ఆఖరుకు లక్ష్యంగా నిర్ణయించుకున్న గృహాలను పూర్తి చేయవలసి ఉందన్నారు. పి ఎం ఏ వై 2 లో నిర్దేశించుకున్న నిర్మాణాలను స్థానిక పరిస్థితులకు అనుగుణంగా రీ డిజైన్ చేసి పూర్తి చేయుటకు చర్యలు తీసుకోవాలన్నారు అలాగే జల్జీవన్ మిషన్లో ఎన్టీఆర్ హౌసింగ్ కాలనీలను అనుసంధానం చేసి త్రాగునీటి సౌకర్యం కల్పిస్తామన్నారు. అదేవిధంగా కాలనీలలో మౌలిక సదుపాయాల కోసం నరేగా పనులలో చేరిస్తే రాష్ట్రస్థాయిలో మ్యాచింగ్ గ్రాంట్ మంజూరుకు చర్యలు తీసుకుంటామన్నారు. అదేవిధంగా గత ప్రభుత్వంలో అమాయక గిరిజనులను మోసం చేసి ఇళ్లు నిర్మించకుండానే ఆయా మొత్తాలను దిగమింగిన కాంట్రాక్టర్లపై కఠిన చర్యలు ఉంటాయన్నారు. క్రిమినల్ కేసులు పెట్టేందుకు సైతం వెనుకాడేది లేదన్నారు. అదేవిధంగా శాఖపరంగా సరైన పర్యవేక్షణ లేనందున అవకతవకులు జరిగాయన్నారు. ఇందుకు బాధ్యులైన వారిపై శాఖపర చర్యలు ఉంటాయన్నారు. తప్పు చేయని, నిజాయితీగల ఉద్యోగులకు ప్రభుత్వం ఎప్పుడు అండగా ఉంటుందన్నారు.