ప్రభాతదర్శిని, (తిరుపతి-ప్రతినిధి): ఎన్నికల కౌంటింగ్ సజావుగా జరిగేందుకు రాజకీయ పార్టీల నాయకులు, అభ్యర్థులు, మీడియా ప్రతినిధులు, ప్రజలు సహకరించాలని, కౌంటింగ్ పారదర్శకంగా నిర్వహిస్తామని కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి ప్రవీణ్ కుమార్ తెలుపారు. ఎలాంటి అవాంచనీయ హింసాత్మక ఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నామని తిరుపతి జిల్లా ఎస్పీ హర్ష వర్ధన్ రాజు సంయుక్తంగా పేర్కొన్నారు. సోమవారం ఉదయం స్థానిక కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాల్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కలెక్టర్, ఎస్పీలు సంయుక్తంగా మాట్లాడుతూ 2019 సంవత్సరానికి సంబంధించిన సార్వత్రిక ఎన్నికలలో పోలింగ్ శాతం నమోదు 78.48 గా ఉందని, ఈ సార్వత్రిక ఎన్నికలు 2024 నందు 78.63 శాతంగా పోలింగ్ నమోదు అయిందని తెలిపారు. తిరుపతి పార్లమెంటరీ నియోజకవర్గ ఓటర్ టర్న్ ఔట్ మేరకు 79.10 శాతంగా ఉందని తెలిపారు. స్వీప్ యాక్టివిటీ వలన కొంత పోలింగ్ శాతం మెరుగుపడిందని, సుమారు 54 వేల మంది ఎఎస్డి జాబితా నుండి తిరుపతి అసెంబ్లీ నియోజకవర్గంలో సుమారు 4000 మంది ఓటు వినియోగించుకున్నారు అని, పారదర్శక ఎన్నికల నిర్వహణ నేపథ్యంలో తిరుపతి అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో ఓటర్ టర్న్ ఔట్ తగ్గిందని తెలిపారు. మాల్ ప్రాక్టీస్ చేయడానికి వచ్చిన వారిని పోలీసు వారు అరెస్టు చేయడం జరిగిందని, వెబ్ కాస్టింగ్ ద్వారా, మీడియా మానిటరింగ్ ఏర్పాటు ద్వారా పోలింగ్ సరలిని పరిశీలించి ఎప్పటికప్పుడు చర్యలు తీసుకున్నామని తెలిపారు. అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించిన మరియు తిరుపతి పార్లమెంట్ కు సంబంధించిన పోల్డ్ ఈవీఎంలను సాధారణ పరిశీలకులు మరియు పోటీలో ఉన్న అభ్యర్థుల, రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో మే14వ తేదీన శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం ఇంజనీరింగ్ కళాశాల నందు కట్టుదిట్టమైన భద్రత నడుమ భద్రపరచడమైనదని తెలిపారు. వినియోగించని ఈవిఎం లు వాటిని ప్రత్యేక గదిలో పెట్టడం జరిగిందని, కౌంటింగ్ కు సంబంధించిన ఏర్పాట్లు 95% అంతకు మునుపే పూర్తి చేశామని, మిగిలిన కౌంటింగ్ ఏర్పాట్లు కౌంటింగ్ తేదీ కి మూడు రోజుల ముందు చేపట్టి పూర్తి చేస్తామని, కౌంటింగ్ సూపర్వైజర్లు, కౌంటింగ్ ఆబ్జర్వర్ లకు, తదితర సిబ్బందికి శిక్షణ కార్యక్రమం 300- 400 మందికి రేపటినుండి చేపట్టనున్నామని వివరించారు. సుమారు 90 సిసి టీవీ కెమెరాలను ఏర్పాటు చేసి స్ట్రాంగ్ రూములు అన్ని, లోపల బయట పరిసర ప్రాంతాలు కవర్ అయ్యేలా ఏర్పాటు చేశామని సదరు కంట్రోల్ రూమ్ ఏర్పాటుతో 24 గంటల నిఘా పర్యవేక్షణ ఉంటుందని, ప్రతి స్ట్రాంగ్ రూమ్ వద్ద 8 గంటలకు ఒక తాసిల్దార్ విధులలో ఉండేలా 24 గంటలు పర్యవేక్షణ ఉంటుందని, రియల్ టైంలో సీసీటీవీ ద్వారా పర్యవేక్షణ ఉంటుందని తెలిపారు. పోటీలో ఉన్న అభ్యర్థులు కూడా సదరు సీసీటీవీ విజువల్స్ ను రియల్ టైం లో చూసే విధంగా ఏర్పాటు చేశామని, వారికి రాజకీయ పార్టీల ప్రతినిధులకు పాసులు మంజూరు చేసి పర్యవేక్షణకు ఏర్పాట్లు చేశామని అన్నారు. స్ట్రాంగ్ రూముల వద్ద ఒకే కామన్ ఎంట్రీ ఎగ్జిట్ ఉండేలా ఏర్పాటుతో అన్ని కిటికీలు, వాకిళ్లు కాంక్రీట్ తో సీల్ చేయడం జరిగిందని, పవర్ సప్లై నిరంతరంగా ఉండేలా ఏర్పాటు చేశామని, సుమారు 6 గార్డు పాయింట్లు ఏర్పాటుతో స్ట్రాంగ్ రూం, కౌంటింగ్ సెంటర్, వాటి పరిసరాలు పూర్తిగా కవర్ అయ్యేలా భద్రత ఏర్పాట్లు చేయడం జరిగిందని తెలిపారు. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వారు సూచించిన త్రీ టైర్ భద్రత మేరకు ఫస్ట్ లేయర్లో కేంద్ర బలగాలు స్ట్రాంగ్ రూంల వద్ద ఏర్పాటు, సెకండ్ లేయర్ వంద మీటర్ల పరిధిలో రాష్ట్ర సాయుధ బలగాలు, థర్డ్ లేయర్ 200 మీటర్ల నందు రాష్ట్ర సివిల్ పోలీసు బలగాలు ఏర్పాటు చేయడంతో పాటు మహిళా యూనివర్సిటీ ఎంట్రన్స్ లో పోలీసు బలగాల ఏర్పాటు, చేసిన మహిళా యూనివర్సిటీ రహదారి వద్ద పోలీస్ భద్రత ఏర్పాటుతో అదనంగా రెండు లేయర్లు ఏర్పాటు చేయడం జరిగిందని వెరసి మొత్తం ఐదంచెల భద్రత ఏర్పాటు చేసి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామని ఎస్పీకి తదనుగుణంగా ఆదేశాలు ఇవ్వడం జరిగిందని తెలిపారు. కౌంటింగ్ రోజున ఉదయం ఐదున్నర గంటలకు అబ్జర్వర్, ఏజెంట్ల సమక్షంలో కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభించడం జరుగుతుందని తెలిపారు. జిల్లాలో 144 సెక్షన్ అమలు అవుతోందని, గంగమ్మ జాతర, వారాంతపు సంత వంటి ముఖ్యమైన సమయాలలో 144 సెక్షన్ సడలింపు పై సమీక్షించి ప్రజలకు ఇబ్బంది కలగకుండా చర్యలు తీసుకుంటామని తెలిపారు. రెవెన్యూ మరియు పోలీస్ సిబ్బంది దీనిపై పర్యవేక్షణ ఉండాలని అన్నారు. కౌంటింగ్ తర్వాత కూడా 15 రోజులు కేంద్ర బలగాలు ఉండి ఎలాంటి హింసాత్మక సంఘటనలు జరగకుండా శాంతిభద్రతలు పరిరక్షిస్తారని తెలిపారు. మోడల్ కౌంటింగ్ సెంటర్ ఏర్పాటు చేస్తామని తెలిపారు. తిరుపతి అసెంబ్లీ నియోజకవర్గంలో 46 మంది అభ్యర్థులు పోటీలో ఉన్న నేపథ్యంలో కౌంటింగ్ కేంద్రంలో ఏజెంట్లు, అభ్యర్థుల అనుమతి ఈసీఐ మార్గదర్శకాల మేరకు చేయడం జరుగుతుందని అన్నారు. అందరూ రాజకీయ పార్టీల ప్రతినిధులు, అభ్యర్థులు, ప్రజలు, మీడియా సహకరించి కౌంటింగ్ సజావుగా జరిగేలా సహకరించాలని కోరారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ జిల్లా ఎన్నికల అధికారి సూచించిన మేరకు అన్ని విధాల కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేపట్టనున్నామని, కేంద్ర సాయుధ బలగాలు ఒక కంపెనీ వచ్చాయని, మరికొంత బలగాలు త్వరలోనే వస్తాయని తెలిపారు. కౌంటింగ్ రోజున శాంతి భద్రతలకు భంగం కలగకుండా అవసరం మేరకు సమస్యాత్మక వ్యక్తులను గుర్తించి గృహనిర్బంధం, పోలీస్ స్టేషన్ లో ఉంచడం వంటి చర్యలు చేపడతామని తెలిపారు. గంగమ్మ జాతర వారాంతపు సంత వంటి వాటికి ఇబ్బంది కలగకుండా చూస్తామని, అదనపు బలగాల ఏర్పాటుతో క్షుణ్ణంగా శాంతి భద్రతలను పర్యవేక్షిస్తామని తెలిపారు. ఎన్నికల కౌంటింగ్ నేపథ్యంలో బెట్టింగ్ వంటి అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడితే తప్పకుండా సంబంధిత సెక్షన్ల కింద చట్టపరమైన చర్యలు ఉంటాయని తెలిపారు. చంద్రగిరి నియోజకవర్గ టిడిపి అభ్యర్థి పులివర్తి నాని అంశంపై సిట్ పర్యవేక్షిస్తోందని తెలిపారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించేది లేదని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి పెంచల కిషోర్, జిల్లా సమాచార పౌర సంబంధాల అధికారి బాల కొండయ్య, మీడియా ప్రతినిధులు పాల్గొన్నారు.