మాదిగ జర్నలిస్ట్ ఫారం పిలుపు

ప్రభాతదర్శిని, (ప్రత్యేక-ప్రతినిధి): షెడ్యూల్ కులాలకు రాజ్యాంగం ద్వారా సంక్రమించిన రిజర్వేషన్లను ఎస్సీ లోని 59 కులాలకు జనాభా ప్రాతిపదికన సన్మానంగా అందాలని, కేవలం ఎస్సీ లోని రెండు ప్రధాన కులాలు లబ్ధి పొందుతూ మిగిలిన 59 కులాలకు అన్యాయం జరగడం ద్వారా ఆయా కులాలు సామాజిక, రాజకీయ, విద్య అభివృద్ధి అవకాశాలు కోల్పోయి రాజ్యాంగ ఫలాలను పొందలేక నిరాధారణకు గురవుతున్న నేపథ్యంలో సామాజిక న్యాయం కోసం ఎస్సీలోని ప్రధాన కులాలైన మాల మాదిగల తో పాటు మిగిలిన ఉపకులాలకు న్యాయం జరగాలంటూ 30 ఏళ్ల క్రితం ప్రకాశం జిల్లా ఈదుముడి గ్రామంలో మంద కృష్ణ మాదిగ సారధ్యంలో ఎస్సీ వర్గీకరణ కోసం పురుడు పోసుకున్న మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి (ఎమ్మార్పీఎస్) ఏ బి సి డి పోరాట ఫలితం 30 ఏళ్ళ కల ఎట్టకేలకు ఫలించింది. జాతి బిడ్డల ఆత్మ గౌరవం ఉజ్వల భవితకు మంద కృష్ణ మాదిగ సాగించిన 30 ఏళ్ళ ఉవ్వెత్తున ఎగిసిన ఉద్యమ పోరులో మాదిగల చిరకాల స్వప్నం నెరవేరింది. అలుపెరుగని మంద కృష్ణమాదిగ…30 ఏళ్ళ పోరుకు… కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు తోడు అత్యున్నత న్యాయస్థానం తలొగ్గింది. వర్గీకరణ సబబేనంటూ తీర్పు వెలువరించింది. ఎస్సీ, ఎస్టీ ఉప కులాల వర్గీకరణ అంశమై వాద, ప్రతిపాదనల తదుపరి రాష్ట్రాలకు అధికారాలు కల్పిస్తూ ఏడుగురు సభ్యులతో కూడిన ధర్మాసనంలో ఆరుగురు సభ్యుల నిర్ణయం మేరకు సుప్రీం కోర్టు చారిత్రాత్మకమైన తీర్పును వెలువరించింది. వర్గీకరణకు అవసరమైన అంశాలను ఎప్పటి కప్పుడు సుప్రీం కోర్టుకుఅందించేందుకు ఢిల్లీలోనే మకాం వేసి, జాతి ఉజ్వల భవితకు … జాతి బిడ్డలకు భరోసా కల్పించి హస్తిన నుంచి ఆగస్టు 13న హైదరాబాద్ కు విచ్చేస్తున్న మాదిగల ఆశాజ్యోతి, సామాజిక ఉద్యమాల రధసారధి, సామాజిక న్యాయ విప్లవకారుడు మాన్య శ్రీ మంద కృష్ణ మాదిగ కు ఘన స్వాగతం పలుకుతూనే…సుప్రీం తీర్పును ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు వెను వెంటనే అమలు చేసి జాతి బిడ్డల బంగారు భవితకు బాటలు వేసేలా ఊరు వాడా కదిలి లక్షలాది మందితో విశ్వ ఖ్యాతిని చాటేలా దండోరా మోగించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. ఎన్నో అవాంతరాలు…అడ్డంకులు…అవహేళనలు…అభ్యంతరాలు…ఆక్రందనలు దాటుకుని వర్గీకరణo పురిటి నొప్పుల నుంచి ఉపశమనం లభించింది. 30 ఏళ్లుగా ఇంటిని… వంటిని కూడా పణంగా పెట్టి అకుంఠిత దీక్షతో మాదిగ జాతి భవిత…భద్రతకు భరోసా కల్పించేందుకు సాగించిన పోరు విశ్వ ఖ్యాతిని ఆర్జించింది. లక్షలాది మందితో ఎన్నో సభలు సమావేశాలు, సంప్రదింపులు పిదప ఎట్టకేలకు భారత దేశ ప్రధాని మోడీని సైతం ఆకర్షించింది. తెలంగాణ రాష్ట్ర రాజధానిలోని పెరేడు గ్రౌండ్ లో తలపెట్టిన మాదిగల విశ్వ రూప మహా ప్రదర్శనకు ముఖ్య అతిథిగా హాజరై అశేష జన వాహిని ఎదుట మంద కృష్ణ మాదిగను గుండెలకు అత్తుకుండ్రు. మీ పోరుకు జై… మీతోనే కలిసి… మీ న్యాయమైన డిమాండ్ ఎస్సీ వర్గీకరణకు నేను సైతమంటూ బహిరంగ సభలో ప్రకటించడం…ఆ తదుపరి దేశ హోంమంత్రి అమిత్ షా చొరవ చూపించడం…ఆయా పరిణామాల నేపథ్యానికి… మంద కృష్ణ మాదిగ పోరుకు వెన్నంటి ఉండి నడిపించిన కేంద్ర మంత్రి జీ. కిషన్ రెడ్డి పాత్ర అత్యంత కీలక భూమికను పోషించిన విషయం తెలిసిందే. మాదిగ జర్నలిస్టులుగా సుమారు పదేళ్లుగా మాదిగ జర్నలిస్ట్ ఫోరంగా పురుడు పోసుకుని ఉద్యమించి, ఎన్నో కష్టాలు కడగండ్లు, కన్నీళ్లు… ఆత్మ బలిదానాలు వెరసి ఉద్యమ ఫలాలు జాతి బిడ్డల ఉజ్వల భవితకు అందించే అవకాశం ఆసన్నమైంది. ఈ మహోజ్వల ఘట్టంలో విజయ దండోరా మోగించేందుకు ఊరు, వాడా కదిలి లక్షలాదిగా తరలి వచ్చి హైదరాబాద్ నగరంలో ప్రతి వీధిలో విజయ ధీరుడికి విజయ తిలకం దిద్దాలి.