జులై 19 నుండి ప్రారంభం కానున్న తరగతులు
మలివిడత కోసం మిగిలి ఉన్న సీట్లు 19,524
తదుపరి దశలో క్రీడా, ఎన్ సిసి కోటా సీట్ల భర్తీ
ప్రభాతదర్శిని, (ప్రత్యేక-ప్రతినిధి): ఇంజనీరింగ్ ప్రవేశాలకు నిర్దేశించిన ఎపిఈఎపిసెట్ 2024 కౌన్సిలింగ్ ప్రక్రియలో భాగంగా బుధవారం తొలివిడత సీట్ల కేటాయింపును పూర్తి చేసినట్లు సాంకేతిక విద్యా శాఖ సంచాలకురాలు, ప్రవేశాల కన్వీనర్ డాక్టర్ బి నవ్య తెలిపారు. విధ్యార్ధులు జులై 22వ తేదీ లోపు తమకు నిర్దేశించిన కళాశాలల్లో ఆన్ లైన్ రిపోర్టింగ్ తో పాటు, వ్యక్తిగతంగా కళాశాలలో నమోదును పూర్తి చేయవలసి ఉందన్నారు. అయితే జులై 19 నుండే తరగతులు ప్రారంభం అవుతాయని వివరించారు. అర్హత పొందిన 1,86,031 మందిలో తొలి విడత కౌన్సిలింగ్ కోసం 1,28,619 మంది విద్యార్ధులు నమోదు చేసుకోగా, దృవీకరణ పత్రాల తనిఖీ అనంతరం 1,28,065 మంది అర్హత సాధించారన్నారు. కోర్సుల ఎంపికలను 1,26,608 మంది పూర్తి చేసుకోగా, 44,69,203 ఎంపికలు నమోదు అయ్యాయని కన్వీనర్ పేర్కొన్నారు. కన్వీనర్ కోటా కింద 24 విశ్వవిద్యాలయ ఇంజనీరింగ్ కళాశాలల్లో 6877 సీట్లు ఉండగా, 6189 సీట్లు భర్తీ అయ్యాయన్నారు. 212 ప్రవేటు కళాశాలల్లో 1,21,951 సీట్లు ఉండగా, 1,03,247 భర్తీ అయ్యాయని, 9 ప్రవేటు విశ్వవిద్యాలయాల్లో 7832 సీట్లు ఉండగా, 7700 సీట్లు భర్తీ చేసామని తెలిపారు. మొత్తంగా 245 కళాశాలల్లో 1,36,660 సీట్లు ఉండగా, 1,17,136 సీట్లు భర్తీ అయ్యాయని, 19,524 సీట్లు మలివిడత కోసం ఉన్నాయని డాక్టర్ నవ్య వివరించారు. ఎన్ సిసి సంచాలకులు, శాఫ్ ఎండి నుండి తుది మెరిట్ జాబితా రానందున క్రీడా కోటా, ఎన్ సిసి కోటా సీట్లను భర్తీ చేయలేదని తదుపరి దశలో వీటిని భర్తీ చేస్తామని కన్వీనర్ స్పష్టం చేసారు.