ముగింపు కార్యక్రమ వేడుకలకు రాష్ట్ర రెవెన్యూ, మంత్రి అనగాని సత్యప్రసాద్
ప్రభాతదర్శిని,(తిరుపతి-ప్రతినిధి): ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఫ్లెమింగో ఫెస్టివల్ 2025 కార్యక్రమాలు జిల్లాలో అత్యంత ఘనంగా పండుగ వాతావరణంలో నిర్వహించడం జరిగిందని, పర్యాటక రంగ అభివృద్ధికి, సంక్షేమం అభివృద్ధి సమపాళ్లలో అమలుకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఇది మంచి ప్రభుత్వం అని మూడవ రోజు ఫ్లెమింగో ఫెస్టివల్ 2025 కార్యక్రమ ముగింపు వేడుకలకు రాష్ట్ర రెవెన్యూ, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ మరియు జిల్లా ఇన్చార్జి మంత్రి అనగాని సత్యప్రసాద్, రాష్ట్ర దేవాదాయ, ధర్మాదాయ శాఖమంత్రి ఆనం రామ నారాయణ రెడ్డి పాల్గొని పేర్కొన్నారు. సోమవారం సాయంత్రం సూళ్లూరుపేట పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రాంగణంలో ఫ్లెమింగో ఫెస్టివల్ 2025 ముగింపు వేడుకలు ఘనంగా నిర్వహించగా రెవెన్యూ, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ మరియు జిల్లా ఇన్చార్జి మంత్రి, రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖమంత్రి, ఎంఎల్ఏ నెలవల విజయ శ్రీ, బొజ్జల సుధీర్ రెడ్డి, పాశం సునీల్ కుమార్, కొరుగొండ్ల రామకృష్ణ, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, జిల్లా కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్ ఎస్, జెసి శుభం బన్సల్, మాజీ పార్లమెంటు సభ్యులు నెలవల సుబ్రమణ్యం, మాజీ మంత్రి పరసా రత్నం, మాజీ ఎంయల్సి వాకాటి నారాయణ రెడ్డి, మున్సిపల్ చైర్మెన్ శ్రీమంత్ రెడ్డి, శ్రీసిటీ ఎండి రవి సన్నారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రెవెన్యూ మరియు జిల్లా ఇన్చార్జి మంత్రి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ఫ్లెమింగో ఫెస్టివల్ 2025 పక్షుల పండుగను అత్యంత వైభవంగా చేపట్టుటకి అన్ని చర్యలు తీసుకుందని తెలిపారు. మనం ప్రకృతిని, సంస్కృతిని గుర్తు పెట్టుకోవాలి. పర్యాటకం ను అభివృద్ధి పరచాలి. గత ప్రభుత్వ హయాంలో ఫ్లెమింగో ఫెస్టివల్ ను నిర్వహించలేదని నిర్లక్ష్యం చేశారని అన్నారు. మన ముఖ్యమంత్రి విజన్ ఉన్న లీడర్. కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక ముఖ్యమంత్రి పర్యాటక రంగాన్ని పరిశ్రమగా గుర్తించారని అన్నారు. బడ్జెట్ కేటాయించి ఎంతో ఘనంగా నిర్వహిస్తున్నామని అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఎంతో అభివృద్ధిలో ఉందంటే మన ముఖ్యమంత్రి ముందు చూపే అన్నారు. ప్రభుత్వం మంచి చేస్తున్నా కూడా ప్రతిపక్షాలు బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారు. పులికాట్ ముఖ ద్వారం వద్ద 100 కోట్లు నిధులతో పూడిక తీత ద్వారా మత్స్యకారులకు మేలు కలిగేలా చర్యలకు ప్రభుత్వం కట్టుబడి అడుగులు ముందుకు వేస్తున్నదని తెలిపారు. ప్రభుత్వం సంక్షేమం, అభివృద్ధి సమపాళ్లలో అమలుకు కట్టుబడి ఉందని తెలిపారు. ఈ నెల18 నుండి 20 వరకు తిరుపతి జిల్లాలో ఘనంగా ఫ్లెమింగో ఫెస్టివల్ 2025 వేడుకలు నిర్వహించు కున్నామని తెలిపారు. పర్యాటక శాఖ, అటవీ శాఖ సమన్వయంతో అందరూ ప్రజా ప్రతినిధులు, అధికారులు, మీడియా సహకారంతో ఈ ఫ్లెమింగో ఫెస్టివల్ 2025 ను ఘనంగా నిర్వహించుకున్నామని అన్నారు. ఎంఎల్ఏ మాట్లాడుతూ గత నాలుగు సంవత్సరాలుగా ఈ ఫ్లెమింగో ఫెస్టివల్ నిర్వహించబడలేదు. 2001 లో టిడిపి ప్రభుత్వంలో ప్రారంభించి నిర్వహించడం జరిగింది. మన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఫ్లెమింగో ఫెస్టివల్ ను వైభవంగా నిర్వహించాలని సూచించారని, లోకేష్ గారు, పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేశ్ గారి సహకారం చాల ఉందని తెలిపారు. ఎన్నో వేల కిలోమీటర్ల నుండి వలస వచ్చి ఇక్కడ పులికాట్ సరస్సు ఎంతో పర్యావరణం ఈ కార్యక్రమం విజయవంతం చేయడంలో సహకరించిన అధికారులు, ప్రజా ప్రతినిదులు అందరికీ ధన్యవాదాలు తెలిపారు. పులికాట్ సరస్సు, అటకాని తిప్ప, బి వి పాలెం బోటింగ్ తదితర టూరిస్ట్ ప్రదేశాలను మన జిల్లా ప్రజలే కాకుండా విద్యార్థినీ విద్యార్థులు, యువత , ప్రకృతి ప్రేమికులు, ప్రక్క రాష్ట్రాల ప్రజలు కూడా వచ్చి తిలకించి ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం అయి విజయవంతం చేశారని అన్నారు. కలెక్టర్ మాట్లాడుతూ గత నవంబర్ నెలలో గౌ. ముఖ్యమంత్రి జిల్లా పర్యటనకు వచ్చినప్పుడు ఫ్లెమింగో ఫెస్టివల్ ను ఘనంగా నిర్వహించాలని సూచించారని ప్రజా ప్రతినిధులు, అధికారులు సమన్వయంతో, మీడియా, తదితరుల సహకారంతో ఈ నెల 18 నుండి 20 వ తేదీ వరకు తిరుపతి జిల్లాలో సూళ్లూరుపేట నియోజక వర్గంలో ఘనంగా నిర్వహించుకున్నామని, అందరికీ ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో తారలు పాల్గొని ప్లాస్టిక్ వాడకం వద్దని, సోషల్ మీడియాను సరైన విధంగా వాడాలని సందేశం ఇచ్చారు. అనంతరం మంత్రిని అధికార యంత్రాంగం సత్కరించింది. మూడు రోజులుగా నిర్వహించిన పలు క్రీడలలో గెలుపొందిన వారికి మొమెంటో ఇచ్చి సత్కరించారు. పలు సాంస్కృతిక కార్యక్రమాలు ప్రజలను అలరించాయి. ఈ కార్యక్రమంలో ఆర్. డి. వో కిరణ్మయి, ఆర్డి టూరిజం రమణ ప్రసాద్, జిల్లా టూరిజం అధికారి జనార్ధన్ రెడ్డి, అటవీ శాఖ అధికారి సూళ్లూరుపేట హారిక, సంబంధిత అధికారులు, ప్రజలు, విద్యార్థిని విద్యార్థులు తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.