ప్రభాతదర్శిని, (తిరుపతి-ప్రతినిధి):తిరుపతి జిల్లాలో పదవ తరగతి సప్లమెంటరీ పరీక్షలను పకడ్బందీగా, నిర్వహించేలా ప్రత్యేక చర్యలు చేపట్టాలని డి ఆర్ ఓ కూరపాటి పెంచల్ కిషోర్ సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం మధ్యాహ్నం స్థానిక జిల్లా కలెక్టరేట్ లోని డిఆర్ఓ ఛాంబర్ నందు సంబoదిత శాఖల సిబ్బందితో పదవ తరగతి సప్లమెంటరీ పరీక్షల నిర్వహణపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డిఆర్ఓ మాట్లాడుతూ పదవ తరగతి సప్లమెంటరీ పరీక్షలను పగడ్బందీగా నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. జిల్లాలో 5530 మంది విద్యార్థులు పరీక్షకు హాజరుకానున్నారని వారి కోసం 23 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. ప్రతి పరీక్షా కేంద్రం వద్ద త్రాగునీటి వసతి ఓఆర్ఎస్ ప్యాకెట్లు, బీపీ, షుగర్ చెక్ చేసే పరికరాలు, అత్యవసర మందులతో వైద్యారోగ్యశాఖ సిబ్బంది ఒకరు అందుబాటులో ఉండాలన్నారు.
మాస్‌ కాపీయింగ్‌ను నిరోధించేందుకు 2 ఫ్లయింగ్‌ స్క్వాడ్లను ఏర్పాటు చేసి ప్రతిరోజూ కేంద్రాలను తనిఖీ చేయడం జరుగుతుందని అన్నారు. అలాగే ఇంటర్మీడియట్ సప్లమెంటరీ పరీక్షలు, ఓపెన్ స్కూల్ సప్లమెంటరీ పరీక్షల నిర్వహణపై కూడా సంబంధిత అధికారులు ప్రత్యేక శ్రద్ధ పెట్టాలన్నారు. జిల్లా విద్యాశాఖాధికారి మాట్లాడుతూ జిల్లాలో పదవ తరగతి మే 24 వ తేది నుంచి జూన్ 3 వ తేది వరకు జరగనున్న సప్లమెంటరీ పరీక్షలకు సంబంధించి మొత్తం 5530 మంది విద్యార్థినీ, విద్యార్థులు హాజరుకానున్నారని చెప్పారు. జిల్లాలో 23 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. పరీక్షలు ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.45 వరకు జరుగుతాయన్నారు. విద్యార్థులను 8.45కు కేంద్రాల్లోకి అనుమతిస్తామన్నారు. ఆలస్యంగా వచ్చిన వారిని పరీక్ష కేంద్రంలోకి అనుమతించేది లేదని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ గవర్నమెంట్ ఎగ్జామ్ గురు స్వామి రెడ్డి, ఆర్ ఐ ఓ ప్రభాకర్ రెడ్డి తదితర సంబంధిత అధికారులు పాల్గొన్నారు.