
-డాక్టర్ జెట్టి శేషారెడ్డి 17వ స్మారక సదస్సులో వ్యక్తులు స్పష్టం
ప్రభాతదర్శిని, (ప్రత్యేక-ప్రతినిధి): వైద్య రంగంలో ప్రస్తుత పరిస్థితుల్లో అసమానతలు తీవ్రంగా ఉన్న ప్రభుత్వం తన బాధ్యతలనుంచి తప్పించుకుంటూ వైద్య విద్యని ప్రైవేటు వారికి అప్పగిస్తామని నిస్సిగ్గుగా చెప్పడం చాలా దారుణమని డాక్టర్ విరించి తెలిపారు. డాక్టర్ జెట్టి శేషారెడ్డి విజ్ఞాన కేంద్రంలో డాక్టర్ జెట్టి శేషారెడ్డి 17 వ స్మారక సదస్సు సందర్భంగా “మెడికల్ కళాశాల ప్రైవేటీకరణ– పర్యవసానాలు” అనే అంశంపై ప్రసంగించారు. ప్రభుత్వ ఆసుపత్రులను బలోపేతం చేయాల్సిన అంశాన్ని పక్కన పెడుతూ కొత్తకొత్త పథకాలు రచిస్తూ, ఇప్పుడు కొత్తగా తెస్తున్న 12 వైద్య కళాశాలలను పి పి పి పద్ధతిలో ప్రైవేటు వారికి అప్పచెప్తామని అంటున్నారు. ఇది కనుక జరిగినట్లయితే సామాన్య ప్రజల పిల్లలు మెడికల్ కాలేజీల్లో చదువుకునే పరిస్థితి ఉండదని,. ఇప్పటికే ఉన్న నిమ్నకుల రిజర్వేషన్లు సగం తగ్గిపోయి నిమ్నకులస్తులు డాక్టర్ల అయ్యే అవకాశం దరిదాపుగా సగం తగ్గిపోతుందన్నారు. 107,108 జీవోలను తెచ్చి ప్రభుత్వ మెడికల్ కళాశాలల్లో సగం సీట్లను ఒక్కొక్క సీటును 12 లక్షలు, 20 లక్షలకు ప్రభుత్వమే అమ్ముకుంటున్నదన్నారు. దీని కారణంగా సామాన్య ప్రజల పిల్లలు వైద్యవిద్యని అభ్యసించలేరని,ఒకవేళ ఎవరైనా పేద విద్యార్థులు వైద్య విద్యని అభ్యసించాలన్నా అత్యధిక ఫీజులతోటి వారి ఆర్థిక పరిస్థితి తలకిందులు అవుతుందని, కోట్ల రూపాయలు ఫీజులు కట్టి కాలేజీల్లో చదువుకొని వైద్యుడిగా బయటికి వచ్చిన తరువాత సేవా దృక్పథం తగ్గిపోయి వ్యాపార దృక్పధం ముందుకు వచ్చి వైద్యం పేదవానికి అందని పరిస్థితి ఏర్పడుతుందన్నారు. ప్రజలకు వైద్యం అందించడం ప్రభుత్వ బాధ్యతగా ఉండాలి తప్ప ప్రజలే వైద్యం కొనుక్కోవలసిన పరిస్థితి ఉండకూడదన్నారు. భారత రాజ్యాంగ పూర్వపరాలు – సవాళ్లు అనే అంశంపై మాజీ శాసనమండలి సభ్యులు ఎం.వి.ఎస్ శర్మ మాట్లాడుతూ భారత రాజ్యాంగానికి ప్రజాస్వామ్యం, లౌకిక తత్వం, ఫెడరలిజం, సామాజిక న్యాయం, స్వావలంబన అనేవి ఐదు మూల స్తంభాలని, ఈ మూల స్తంభాలపై నేడు తీవ్రమైన దాడులు జరుగుతున్నాయని అన్నారు. దేశ ప్రజాస్వామ్యంపై ఎటువంటి దాడులు జరుగుతున్నాయో ఎలక్షన్ కమిషన్, ఈడి, ఇన్కమ్ టాక్స్ డిపార్ట్మెంట్ వంటి రాజ్యాంగ సంస్థలను ఏ విధంగా కేంద్ర ప్రభుత్వం వాడుకుంటున్నదో మనకు అందరికీ తెలిసిందేనన్నారు. అలాగే భిన్నత్వంలో ఏకత్వాన్ని కాపాడే లౌకికతత్వంపై ఎటువంటి పరిస్థితులు నెలకొన్నాయో మనకి తెలిసిందేనని, దేశాన్ని మతం పేరుతో రెండు ముక్కలుగా చీల్చే ప్రయత్నం జరుగుతుందని,సామాజిక న్యాయం అనే పేరుతో అసమానతలు పెంచుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల కార్యక్రమాలు ఉన్నాయని, మన దేశానికి ముఖ్యమైన ఆర్థిక, సాంఘిక, సైన్స్ రంగాల్లో స్వావలంబనల పై పూర్తిగా దెబ్బకొట్టే ప్రయత్నం జరుగుతోందన్నారు .వ్యవసాయ రంగంలో ఇప్పటి వరకు మనం సాధించిన స్వావలంబనని దెబ్బతీసే విధంగా ఈరోజు కేంద్ర ప్రభుత్వం చర్యలు ఉంటున్నాయన్నారు. దాన్లో భాగంగానే పండించిన పంటకు మద్దతు ధర కల్పించలేకపోవటం, వ్యవసాయ సబ్సిడీలను ఎత్తివేయటం, వ్యవసాయ రంగానికి సంబంధించి నల్ల చట్టాలు తయారు చేయడం లాంటి చర్యలతో కేంద్ర ప్రభుత్వం ముందుకు పోతున్నారు .ఇప్పుడున్న పరిస్థితులని మార్చాలంటే మరొక స్వాతంత్ర పోరాటం అవసరమవుతుందని, అన్ని విధాలుగా సామ్రాజ్యవాద అమెరికాకి మరియు దాని మిత్ర దేశాలకి అనేక విధాల సహాయపడే విధంగా భారతదేశ ప్రభుత్వ చర్యలు ఉంటున్నాయన్నారు. ముఖ్యంగా ప్రభుత్వరంగ ప్రవేటీకరణ, విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ వంటి చర్యలతో మన దేశ స్వావలంబనను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దెబ్బతీస్తున్నాయని,. కరోనా సమయంలో ప్రభుత్వరంగ సంస్లుథలు వ్యాక్సిన్లు తయారు చేస్తామని ముందుకు వచ్చినా ప్రభుత్వ సంస్థలకు అనుమతి ఇవ్వకుండా ప్రైవేటు వారికి అనుమతిచ్చి వ్యాక్సిన్ లను దిగుమతి చేసుకున్నారన్నారు. జన విజ్ఞాన వేదిక, ప్రజారోగ్య వేదిక, మెడికల్ రెప్రజెంటేటివ్ యూనియన్, ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్, డాక్టర్ రామచంద్రారెడ్డి ప్రజా వైద్యశాల, యునైటెడ్ మెడికల్ అండ్ హెల్త్ యూనియన్ లు సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించాయి. ఈ సదస్సులో డాక్టర్లు, వైద్య రంగ ఉద్యోగులు, ఉపాధ్యాయులు కార్మిక సంఘ నాయకులు, ప్రజా వైద్యశాల సిబ్బంది పాల్గొన్నారు.