అధికారులు విధిగా మండల సర్వసభ్య సమావేశానికి హాజరు కావాల్సిందే
గంజాయి నిషేధంపై ఎక్సైజ్ శాఖ నిర్లక్ష్యం తగదు
చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని

ప్రభాతదర్శిని, (ప్రత్యేక-ప్రతినిధి):ప్రభుత్వ సంక్షేమ పథకాలను పార్టీలకు అతీతంగా ప్రజలకు అందే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలని చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని సూచించారు. సోమవారం ఆయన చంద్రగిరి మండల పరిషత్ సర్వసభ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత వైకాపా పాలకుల నిర్లక్ష్య వైఖరితో ప్రతివ్యవస్త గాడి తప్పిందని…. వాటిని సరిదిద్దడానికి కొంచెం సమయం పడుతుందని అన్నారు. అందుకు అధికారులు కూడా పూర్తిగా సహకరించాలని కోరారు. విద్యా వ్యవస్థను సైతం గాలికి వదిలేసారన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేరుస్తుందని తెలిపారు. చంద్రగిరి నియోజకవర్గంలో 95 శాతం మందికి తల్లికి వందనం అందించడం జరిగిందన్నారు. స్కూల్ పిల్లలకు ప్రత్యేక ఆధార్ డ్రైవ్ ను సంబంధిత అధికారులు సమన్వయంతో నిర్వహించాలని విద్యాశాఖ అధికారులను కోరారు. అధికారులు విధిగా మండల సర్వసభ్య సమావేశానికి హాజరు కావాల్సిందేనని, సరైన కారణాలు లేకపోతే వారికి శాఖాపరమైన చర్యలకు సిఫారసు చేస్తామని హెచ్చరించారు. చంద్రగిరి మండలం పరిధిలోని రంగంపేట స్కూల్ ను మోడల్ స్కూల్ గా మార్చినందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ కీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. రాష్ట్ర వ్యాప్తంగా రెవెన్యూ శాఖలో రీ సర్వే నిర్వహించడం జరిగిందని, దానిలో భాగంగా చంద్రగిరి మండలంలో నిర్వహిస్తున్న రీ సర్వేలో రైతులకు ఇబ్బంది కలగకుండా రీ సర్వే చేయాలని అధికారులను కోరారు. చంద్రగిరి మండలంలో 177 స్మశాన వాటికలు గుర్తించిన రెవెన్యూ శాఖ అధికారులు ఆయా పంచాయతీలలో పంచాయతీ కార్యదర్శిలు స్మశాన వాటికలు రోడ్లు, ఇతర సమస్యలను త్వరగా ఎంపీడీవో, తహసీల్దార్ కుదృష్టికి తీసుకువెళ్ళి వాటి వివరాలు ఇవ్వాలని ఎమ్మెల్యే కోరారు.రానున్నది వర్ష కాలం కాబట్టి ఇరిగేషన్, పంచాయతీ రాజ్ శాఖల ఇద్దరు కలసి చిన్న చిన్న మరమత్తులు త్వరగతన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. చంద్రగిరి మండలంలో రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసిన లే అవుట్ లలో బినామీ పేర్లతో ఇచ్చిన పట్టాలను గుర్తించి వారిపై శాఖాపరమైన చూసుకోవాలని అధికారులను ఆదేశించారు. అసలైన లబ్ధిదారులకు ఇంటి పట్టాలు మంజూరు చేసేందుకు చంద్రగిరి మండలంలో జంగిల్ క్లియరెన్స్ త్వరగా పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. త్వరలోనే చంద్రగిరి టవర్ క్లాక్ వద్ద అన్న క్యాంటీన్ ప్రారంభిస్తామని ఎమ్మెల్యే తెలిపారు. చంద్రగిరి మండలంలో విచ్చలవిడిగా గంజాయి ఉందని ఇంతవరకు ఒక్క కేసు కూడా నమోదు చేయలేకపోవడంపై ఎక్సైజ్ శాఖ అధికారులపై త్రీవ స్థాయిలోఎమ్మెల్యే మండిపడ్డారు. చంద్రగిరి మండలంలో డాబాల వద్ద గంజాయి అమ్ముతున్నారు. నాకు వ్యక్తిగతంగా ఫోటోలు వస్తున్నాయని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా పి4 విధానాన్ని ప్రవేశపెట్టిందని, పి4 విధానాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లి అవగాహన కల్పించాలని ఎమ్మెల్యే అధికారులను ఆదేశించారు. కొత్తగా వచ్చిన పంచాయతీ సెక్రటరీలు పార్టీలకు అతీతంగా అభివృద్ధి ముందుకు వెళ్లాలని పిలుపు నిచ్చారు.చంద్రగిరిలో నిర్మిస్తున్న గోవింద ధామంకు మతాలకు, పార్టీలకు అతీతంగా ముందుకు రావాలని అధికారులకు, ప్రజా ప్రతినిధులుకు పిలుపు నిచ్చారు. అతి త్వరలోనే రోడ్డు విస్తరణ పనులు ప్రారంభిస్తామని, రోడ్డు విస్తరణ పనులను పార్టీలకు అతీతంగా ముందుకు రావాలని ప్రజలను, ప్రజా ప్రతినిధులను ఎమ్మెల్యే కోరారు. మండలం పరిధిలోని గ్రామ పంచాయతీ సర్పంచులను, ఎంపీటీసీలను ప్రజా సమస్యలపై ఎమ్మెల్యే అడిగి తెలుసుకున్నారు.ఈ సందర్భంగా పంచాయతీలలోని డ్రైనేజ్, వాటర్ ట్యాంక్, పైప్ లైన్,సీ.సీ రోడ్డు, నూతన అంగన్వాడి భవనాలు, ఇతర సమస్యలను అధికారులు ప్రజాప్రతినిధులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు. అంతకుముందు ఎమ్మెల్యే పులివర్తి నానిని అధికారులు ప్రజాప్రతినిధులు పుష్పగుచ్చాలు, శాలువాలతో సత్కరించి ఘన స్వాగతం పలికారు. ఈ సమావేశంలో ఎంపీపీ ఎంపీటీసీలు సర్పంచులు జడ్పిటిసి అధికారులు తదితరులు పాల్గొన్నారు.