వీడ్కోల సభలో జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్.వెంకటేశ్వర్
ప్రభాతదర్శిని,(తిరుపతి-ప్రతినిధి): తిరుపతి జిల్లా జాయింట్ కలెక్టర్ గా పని చేసి విజయవాడ మునిసిపల్ కార్పొరేషన్ కమిషనర్ గా వెళ్తున్న ధ్యాన చంద్ర మరియు కడప జిల్లా జెసి గా బదిలీపై వెళ్తున్న తిరుపతి మునిసిపల్ కార్పొరేషన్ కమిషనర్ అదితి సింగ్ చేసిన సేవలు అమూల్యమైనవి అని, సమర్థవంతమైన అధికారులు అని జిల్లా కలెక్టర్ డాక్టర్ .ఎస్. వెంకటేశ్వర్  కొనియాడారు. మంగళవారం ఉదయం స్థానిక కలెక్టరేట్ సమావేశ మందిరంలో విజయవాడ మునిసిపల్ కార్పొరేషన్ కమిషనర్ గా బదిలీపై వెళ్తున్న జెసి ధ్యాన చంద్ర, కడప జెసి గా బదిలీపై వెళ్తున్న అదితి సింగ్ కు నిర్వహించిన ఆత్మీయ వీడ్కోలు సమావేశంలో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ క్లిష్టమైన తిరుపతి జిల్లా ఎన్నికల నిర్వహణ సమయంలో ధ్యాన చంద్ర, అదితి సింగ్ ఉన్నారని వారు సమర్థవంతంగా తమ విధులను నిర్వహించారని, జెసి గా ధ్యాన చంద్ర సేవలు ఎనలేనివని, ఎంతో బాధ్యతగా నిర్వహించారని తెలిపారు. తాను తనదైన శైలి లో చక్కటి నిర్ణయాలు తీసుకుని, క్షుణ్ణంగా సబ్జెక్ట్ అవగాహనతో విధులు అంకిత భావంతో పనిచేస్తారని తెలిపారు. యువ అధికారిగా, చురుకుగా ఎన్నికలలో రిటర్నింగ్ అధికారిగా చక్కగా బాధ్యతలు నిర్వర్తించారని కొనియాడారు. అదితి చక్కగా క్లిష్టమైన తిరుపతి అసెంబ్లీ నియోజకవర్గ సార్వత్రిక ఎన్నికల బాధ్యతలు నిర్వహించారని తెలిపారు.  అదితి సింగ్, ధ్యాన చంద్ర ఇరువురికి అంతా మంచే జరగాలని కోరుకున్నారు. బదిలీపై వెళ్తున్న ధ్యాన చంద్ర మాట్లాడుతూ ఎన్నికల ప్రక్రియ సమయంలో తాను రావడం జరిగిందనీ, రిటర్నింగ్ అధికారిగా ఒక ఛాలెంజ్ గా తీసుకుని జాగ్రత్తగా ఎన్నికలు నిర్వహించడం జరిగిందని తెలిపారు. తిరుపతి జిల్లా వంటి క్లిష్టమైన సార్వత్రిక ఎన్నికలను సమర్థవంతంగా నిర్వహించడానికి సహకరించిన  జిల్లా, డివిజన్, మండల, బూత్ లెవెల్ స్థాయి వరకు అధికారులు, సిబ్బందికి, మీడియా వారికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. అందరూ టీమ్ వర్క్ గా పని చేస్తే సత్ఫలితాలు ఉంటాయని తెలిపారు. తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామి కొలువైన తిరుపతి జిల్లా లో పని చేయడం తన అదృష్టంగా భావిస్తున్నానని అన్నారు. అదితి సింగ్ మాట్లాడుతూ తాను పలు మంచి అంశాలపై వివిధ శాఖల అధికారులను చూసి నేర్చుకోవడం జరిగిందని, ఎన్నికల నిర్వహణలో  గైడెన్స్ తీసుకోవడం జరిగిందన్నారు.
జిల్లా రెవెన్యూ అధికారి కూరపాటి పెంచల కిషోర్ మాట్లాడుతూ వెంకటగిరి రిటర్నింగ్ అధికారిగా సమర్థవంతంగా ప్రణాళికా బద్ధంగా పనిచేస్తూ, అలాగే జిల్లాలో సార్వత్రిక ఎన్నికలు 2024 నిర్వహణలో చాలా కీలకంగా ఎప్పటికప్పుడు అధికారులకు పలు సూచనలు చేస్తూ మార్గదర్శనం చేశారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ లు కిరణ్ కుమార్, చంద్రముని, నిషాంత్ రెడ్డి, రవి శంకర్ రెడ్డి మాట్లాడారు. అనంతరం ధ్యాన చంద్ర, అదితి సింగ్ లను పండితులు ఆశీర్వచనం పలుకగా, అధికారులు పలువురు వారిని సన్మానించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు, ఆర్డీఓ లు,  ఎస్డీసిలు, మండల తాశీల్దార్లు, ఎంపిడిఓ లు పలువురు పాల్గొన్నారు.