ప్రభాతదర్శిని, (నెల్లూరు- ప్రతినిధి): భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్ఫూర్తితో భారత ప్రభుత్వ సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్, నెల్లూరు క్షేత్ర కార్యాలయం ఆధ్వర్యంలో వన మహోత్సవం కార్యక్రమం ఘనంగా ప్రారంభమైంది. నెల్లూరు రంగనాయకుల పేటలోని పి.ఎం.ఆర్. మున్సిపల్ హైస్కూల్ నుంచి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించి, తొలి రోజు నవాబు పేటలోని ఎం.సి.హెచ్.ఎస్. ప్రత్తి వారి పాఠశాల, పప్పుల వీధిలోని వై.వి.ఎం.సి.హచ్. స్కూల్ (సత్రం బడి)లోనూ మొక్కలను నాటారు. అనంతరం ఆసక్తి గల విద్యార్థులకు మొక్కలు పంపిణీ చేశారు. వారధి ఫౌండేషన్ ఈ కార్యక్రమానికి సంరక్షణ సహకారం అందిస్తుండగా, శుభమస్తు షాపింగ్ మాల్, పెరుమాళ్ సిల్క్స్ సహకారాన్ని అందిస్తున్నారు. లాయర్ పత్రిక, యాక్ట్ ఛానల్, రెడ్ ఎఫ్.ఎం.లు మీడియా పార్ట్నర్ లుగా వ్యవహరిస్తున్నాయి. సామాజిక వనవిభాగం, నెల్లూరు డివిజన్ సహకారంతో వందలాది మొక్కలను రానున్న నెల రోజుల్లో నెల్లూరులోని అన్న పాఠశాలల్లో నాటుతున్నట్లు భారత ప్రభుత్వ క్షేత్ర ప్రచార అధికారి పరవస్తు నాగసాయి సూరి ఈ సందర్భంగా పేర్కొన్నారు. విద్యార్థులు మొక్కలు నాటడం పట్ల ఆసక్తి చూపుతున్నారని, అవకాశం ఉన్న ఇంటిలోనూ పెంచేందుకు ఆసక్తి వ్యక్తం చేస్తున్నట్లు తెలిపారు. పాఠశాలల్లో మొక్కలు నాటటమే కాకుండా ప్రతి తరగతికి ఒక మొక్క సంరక్షణ బాధ్యతలు అప్పగించటంతో పాటు, మొక్క ఓ స్థాయి వరకూ పెరిగే దాకా వారధి ఫౌండేషన్ పర్యవేక్షిస్తుందని సంస్థ చైర్మన్ శ్రీరంగనాథ్, కార్యదర్శి ఆర్కాట్ శ్రీనివాసులు తెలిపారు. బుధవారం నాడు మూడు పాఠశాలల్లో జరిగిన కార్యక్రమాల్లో పాఠశాల ప్రధానోపాధ్యాయులతో పాటు విద్యార్థులు, అధ్యాపకులు ఆసక్తిగా పాల్గొన్నారు.