తిరుపతి జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ స్పందించాలి
పెళ్లకూరు అవినీతి అధికారులు ఏసీబీ భరతం పట్టాలి

ప్రభాతదర్శిని,(ప్రత్యేక ప్రతినిధి):పెళ్లకూరు మండలంలోని 24 పంచాయతీలలో ప్రజలకు,పాలకులకు,అధికారులకు మధ్య ఏమి జరుగుతుంది?.ప్రభుత్వ కార్యాలయాలకు ప్రజల ఎందుకు రావడం లేదు?అధికారుల తీరుపై ప్రజలు ఎందుకు అసహనంగా ఉన్నారు? అవినీతి,అక్రమాలు దోపిడి దారులు రాజ్య మేలుతుంటే జిల్లా నిఘ యంత్రాంగం, జిల్లా కలెక్టర్,జిల్లా పోలీసు యంత్రాంగం ఎందుకు దృష్టి సారించడం లేదు అంటూ సామాన్య జనం ఎదురుచూస్తున్నరు.ఇటీవల జరిగిన రెవెన్యూ గ్రామసభలలో ఒక్కో గ్రామ పంచాయతీ నుండి ఒకటి రెండు అర్జీలు తప్ప ఎలాంటి సమస్యలపై ఫిర్యాదులు పెద్దగా అందలేదు.అవి కూడా నాయకుల మెహర్బానీ కోసం మొక్కుబడిగా రెండు మూడు అర్జీలు మాత్రమే అందించి ఆన్ లైన్ లో నమోదు చేసుకోవడం పరిపాటి అయ్యింది.ప్రతి సోమవారం జరిగే గ్రీవెన్స్ డే కు అటు రెవెన్యూ కార్యాలయంలో గాని,ఇటు మండల పరిషత్ కార్యాలయంలో గాని ఒక్క అర్జీ కూడా దాఖలు కాకపోవడం విశేషం.
పలు ప్రాంతాల్లో అనేక భూ సమస్యలు, రెవెన్యూ సమస్యలు: 71వ నంబర్ జాతీయ రహదారి రోడ్డు విస్తరణ కోసం భూ సేకరణకు సంబంధించి నిర్వాసితులకు పరిహార చెల్లింపు విషయమై సమస్యలు అనేకం ఉన్నప్పటికీ వాటిని రెవెన్యూ కార్యాలయంలో పరిష్కరించే నాధుడే లేడంటూ బాధితులు కార్యాలయానికి రావడమే మానుకున్నారు.రోసనూరు,శిరసనంబేడు, బంగారంపేట,పునబాక,కానూరు తదితర గ్రామాల్లో ఉన్న ప్రభుత్వ భూములు,రిజర్వ్ ఫారెస్ట్ భూములు,తెలుగు గంగా కాలువ పొర్లు కట్టలు యంత్రాలతో త్రవ్వేసి లారీలు,టిప్పర్లు, ట్రాక్టర్లతో నాయుడుపేట మేనకూరు పట్టణాలకు,వెంచర్లకు,పరిశ్రమలకు అక్రమంగా తరలిస్తున్న ఇక్కడ వ్యాపారులకు అధికారులే అండగా ఉంటూ నెలమాములతో జేబులు నింపుకుంటున్నట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు. అదేవిధంగా 60 ఏళ్లు నిండిన వృద్ధులు,భర్తను కోల్పోయిన వితంతువులు,దివ్వాంగులు పింఛన్ మంజూరు కోసం దరఖాస్తు చేసుకోవడానికి కార్యాలయాల వద్ద ఎలాంటి అవకాశం లేకపోవడం,అందుకు ఆ శాఖ అధికారులు కూడా పట్టించుకోకుండా వ్యవహరించడం వల్ల ప్రభుత్వ అధికారులపై ప్రజలకు నమ్మకం సన్నగిల్లిందని తెలుస్తుంది. గ్రామాల్లో జరుగుతున్న సిమెంట్ రోడ్డు పనులు పలుచోట్ల పంచాయతీ తీర్మానాలు లేకుండా పర్సంటేజీలు పుచ్చుకొని నాణ్యత లేమితో పనులు చేస్తున్నప్పటికీ అధికారుల స్పందించకపోవడం ఏమిటని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.అలాగే ఇటీవల విద్యుత్ తీగలు,విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ లోని రాగి వైర్లు చోరీ కేసులో 6 మంది నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు వారిపై కేసులు లేకుండా చేస్తామంటూ భారీ మొత్తంలో ముడుపులు తీసుకుని చివరకు కేసులు నమోదు చేసి నిందితులను అరెస్టు చేయడంపై వారి కుటుంబ సభ్యులు పోలీసులు తీరుపై పోలీస్ స్టేషన్ ఎదుట బహిరంగంగా శాపనార్ధాలు పెట్టడం అప్పట్లో చర్చనీయాంశంగా మారింది.తాళ్వాయిపాడు, పెన్నేపల్లి గ్రామాల సమీపంలో కోడిపందాల స్థావరాలపై ఇటీవల పోలీసులు చేపట్టిన దాడుల్లో అసలు నిందితులను వదిలేసి దారిన వెళ్లే బాటసారులను కొందరి వద్ద నుండి అధిక మొత్తంలో నగదు,సెల్ ఫోన్లు లాక్కొని ఎలాంటి కేసులు నమోదు చేయకుండా పోలీస్ స్టేషన్ చుట్టూ తిప్పుతున్నట్లు పలువురు బాధితులు వాపోయారు. పోలీస్ స్టేషన్ జీడి పోలీస్ జీబుకు డ్రైవర్లగా వ్యవహరించే కొందరు కలవకూరు,పుల్లూరు,రావులపాడు,పెన్నేపల్లి గ్రామాల వద్ద స్వర్ణముఖి నది నుండి ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్ యజమానుల నుండి నెల మామూలు వసూలు చేస్తూ స్టేషన్ బాస్ కు అందిస్తున్నట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు . దీనిపై జిల్లా ఎస్పీ ప్రత్యేక దృష్టి సారించి అవినీతి అధికారులపై కొరడా జలుపించాలని పలువురు కోరుతున్నారు.అలాగే పెళ్లకూరు మీదుగా పునబాక గ్రామం సమీపంలో ఉన్న ఓ కలప పరిశ్రమకు వెళ్లే జామాయిల్ కర్ర లోడ్ ట్రాక్టర్ల,లారీలు,వరి కోత యంత్రాలు,ప్రతి శుక్రవారం వెళ్లే గొర్రెలు,మేకలు,పశువుల వాహనాల నుండి నెల మామూలు వసూలు చేస్తున్న పోలీస్ బాస్ పై జిల్లా ఎస్పీ ప్రత్యేక నిఘా ఉంచి చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.ముఖ్యంగా గ్రామాల్లో జరుగుతున్న చిన్న చిన్న వివాదాలు,తేలికపాటి దాడులు,చిన్నచిన్న ఘటనలపై న్యాయం కోసం పోలీస్ స్టేషన్ కు వచ్చే అర్జీదారులను బెదిరింపులకు గురిచేసి,ఇరువురుపై కేసులు నమోదు చేస్తామని బెదిరిస్తూ రెండు మూడు రోజులగా పోలీస్ స్టేషన్ చుట్టూ తిప్పుకుంటూ కేసులు లేకుండా చేసుకునేందుకు ఇరు వర్గాల నుంచి భారీ మొత్తంలో గుంజుతున్నట్లు కొందరు పోలీసులు తీరుపై పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.అలాగే క్షేత్రస్థాయిలో ఉన్న పలువురు వీఆర్వోలు,పంచాయితీ కార్యదర్శులు,సచివాలయ ఉద్యోగులు ప్రజలకు అందుబాటులో లేకపోవడంతో అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు స్థానికులు విమర్శిస్తున్నారు.పైసలు ఇవ్వందే పనులు కాకుండా అధికారులు చేస్తున్న జాప్యంపై ఏసీబీ అధికారుల సైతం ప్రత్యేక దృష్టి సారించి మండలంలోని అవినీతి అక్రమాలకు పాల్పడుతున్న అధికారులపై జిల్లా ఉన్నతాధికారులు ప్రత్యేక దృష్టి సారించి తగిన చర్యలు చేపట్టాలని మండల ప్రజలు కోరుతున్నారు.