టోల్-ఫ్రీ నంబర్ 1800-599-4599 బుకింగ్ ప్రక్రియను లోడింగ్ కేంద్రాల నుండి వేరు చేయటంతో సత్ ఫలితాలు
అదనపు ఛార్జీల వసూలుపై కఠినంగా వ్యవహరించాలని కలెక్టర్లకు అదేశాలు

ప్రభాతదర్శిని, (ప్రత్యేక-ప్రతినిధి):ముఖ్యమంత్రి చేస్తున్న రోజువారీ సమీక్షల ఫలితంగా ఉచిత ఇసుక విధానం గాడిలో పడుతోంది. క్షేత్ర స్దాయికి ఉచిత ఇసుక లక్ష్యం చేరాలన్న చంద్రబాబు నాయిడు ఆకాంక్ష సాకారం అవుతోంది. ఇసుక కోసం వేచి చూస్తున్న లారీల క్యూలు తగ్గుముఖం పడుతున్నాయి. గనుల శాఖ తీసుకుంటున్న చర్యలు మంచి ఫలితాలను ఇస్తుండగా, ఒక్కోక్కటిగా సమస్యలు కనుమరుగవుతున్నాయి. లారీల యజమానులు, మధ్యవర్తులు పేరిట వసూలు చేస్తున్న అధిక ధరలను నియంత్రిటానికి ఇసుక బుకింగ్ విధానంలో తీసుకు వచ్చిన మార్పులు బుకింగ్ కేంద్రాల వద్ద లారీల రద్దీని నివారిస్తున్నాయన్నారు. సెప్టెంబరు 11న మరింత మెరుగైన నూతన ఆన్ లైన్ విధానాన్ని ఆవిష్కరించనుండగా, ఆవిధానం అమలులోకి వచ్చే వరకు వేచిచూడకుండా, ఈ మూడు వారాలు సైతం కఠిన నిబంధనలనే అమలు చేయనున్నామని గనులు, అబ్కారీ శాఖ ముఖ్య కార్యదర్శి ముఖేష్ కుమర్ మీనా తెలిపారు. ఉచిత ఇసుక విషయంలో ప్రజలు ఎదుర్కునే ఇబ్బందులను ఇమెయిల్-ఐడి: dmgapsandcomplaints@yahoo.com., టోల్-ఫ్రీ నంబర్ 1800-599-4599, ద్వారా ఫిర్యాదు చేయవచ్చని, ప్రతి ఫిర్యాధు పైనా తప్పని సరిగా చర్య తీసుకుని, సంబంధిత వ్యక్తులకు అయా జిల్లా కలెక్టర్ల కార్యాలయాల నుండి తిరిగి సమాచారం అందిస్తారని అన్నారు. ఉచిత ఇసుక అందరికీ అందుబాటులోకి తీసుకు రావాలన్నదే రాష్ట్ర ప్రభుత్వ ధ్యేయమని, ఐవిఆర్ఎస్ విధానం ద్వారా ప్రతి రోజు వినియోగదారుల నుండి అభిప్రాయాన్ని సేకరిస్తున్నామన్నారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు జిల్లాల వారిగా ఇసుక నిల్వలు, లోడింగ్ పరిణామం, లబ్దిదారుల సంఖ్య, అందుబాటులో కేటాయింపు తేదీ వంటి వివరాలతో ప్రతి రోజు శాండ్ బులెటిన్ ను విడుదల చేయాలని నిర్ణయించామన్నారు. వినియోగదారులకు బుకింగ్ సౌలభ్యాన్ని మెరుగుపరచి, రవాణాను సులభతరం చేసి కార్యకలాపాలను క్రమబద్ధీకరించటమే ప్రభుత్వ ధ్యేయమన్న మీనా, ఈ క్రమంలో విజిలెన్స్ మెకానిజంను పటిష్టం చేసి కఠిన చర్యలకు సైతం వెనకాడబోమన్నారు. సరఫరా కేంద్రాల వద్ద అధిక రద్దీని నివారించడానికి బుకింగ్ ప్రక్రియను రెవిన్యూ కార్యాలయాలకు మార్చామన్నారు. ఇసుక బుకింగ్ కోసం అయా కార్యాలయాల వద్ద ప్రత్యేక కౌంటర్లు నిర్వహిస్తున్నామని, వినియోగదారుల బుకింగ్‌ కోసం ప్రామాణికమైన ఇన్‌వాయిస్ విధానం పరిచయం చేసామని మీనా తెలిపారు. ఈ కేంద్రాల వద్ద వినియోగదారులకు సంబంధించిన అన్ని వివరాలను సేకరించి, మొబైల్ నంబర్, వాహనం నంబర్, చెల్లింపు వివరాలు, రవాణా రేటులతో కూడిన ఇన్‌వాయిస్‌ను వారికి అందచేస్తామన్నారు. రీచ్‌లు, స్టాక్‌యార్డ్‌ల సరఫరా సామర్థ్యం ఆధారంగా ఇన్‌వాయిస్‌లో డెలివరీ తేదీ, సమయం ఉంటుందని, రవాణా దారులు నిర్దేశించిన సమయానికి అక్కడికి చేరుకుంటే సరిపోతుందని ముఖేష్ కుమార్ మీనా వివరించారు. ఇకపై ముందుగా ఇన్‌వాయిస్‌లను బుక్ చేసుకోని, అయా రోజులలో షెడ్యూల్ చేయని వాహనాలు రీచ్/స్టాక్‌యార్డ్‌ వద్ద వేచి ఉండటాన్ని అనుమతించబోమన్నారు. అయా ప్రాంతాలో పోలీసు యంత్రాంగం నిఘా ఉంచాలని ఆదేశాలు జారీ చేసామని, పటిష్టంగా చెక్ పోస్టులను నిర్వహిస్తామని తెలిపారు. చెల్లుబాటు అయ్యే ఇన్‌వాయిస్‌లు ఉన్న వాహనాలను మాత్రమే అనుమతించాలని పోలీసు యంత్రాంగానికి ఆదేశాలు ఇచ్చామని, మరోవైపు స్టాక్‌యార్డ్‌లలో లోడింగ్ సామర్థ్యాన్ని పెంచడానికి అవసరమైన అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని పేర్కొన్నారు. రవాణా ధరలు నిర్ణయించి వాటిని వినియోగదారులకు అందుబాటులో ఉంచుతామని, రిజిస్టర్డ్, వెరిఫై చేయబడిన వాహనాలు మాత్రమే రవాణా కోసం ఉపయోగించుకునేలా చూస్తామని మీనా వెల్లడించారు. స్టాండర్డ్ చార్జీలకు మించి వసూలు చేసిన రవాణాదారులపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. జిల్లా కలెక్టర్లు ఉచిత ఇసుకకు సంబంధించిన రోజువారి కార్యకలాపాలు, నమోదైన ఫిర్యాదులు, తీసుకున్న చర్యలపై సవివరమైన నివేదికను ప్రభుత్వానికి సమర్పించేలా అదేశాలు జారీ చేసామన్నారు. నిబంధనల ఉల్లంఘన, అక్రమ మైనింగ్, అదనపు రవాణా ఛార్జీల వసూలు వంటి వాటిపై కఠినంగా వ్యవహరించాలని కలెక్టర్లకు ముఖ్యమంత్రి స్వయంగా స్పష్టం చేసారన్నారు.