ప్రభాతదర్శిని,(తిరుపతి – ప్రతినిధి): రైతులు యాంత్రీకరణ వ్యవసాయం ద్వారా సమయం తక్కువ,ఖర్చు తక్కువ తో ఎక్కువ రాబడి సాధించవచ్చని రైతులందరూ యాంత్రీకరణ వ్యవసాయం పై మొగ్గుచూపాలని తిరుపతి జిల్లా కలెక్టర్ ఎస్.వెంకటేశ్వర్ కోరారు.గురువారం తిరుపతి జిల్లా వడమాల పేట కదిరిమంగలం గ్రామ పరిధిలోని రైతు పొలాల్లో రాస్ – కృషి విజ్ఞాన కేంద్రం వారు చేపట్టిన డ్రోన్ పైలట్ ద్వారా పురుగు మందులను పంట పొలాలకు డ్రోన్ ద్వార పిచికారి చేసే విధానం ఎంతో ఉపయుక్తంగా ఉందని, అలాగే విత్తనాలు చల్లే రోలర్ ఎంతో ఉపయోగకరంగా ఉందని, డ్రిప్ స్ప్రింక్లర్ల ద్వారా నీటిని ఎఫెక్టివ్ గా వాడుకోగలమని నూతన యాంత్రీకరణ విధానాలను వ్యవసాయంలో వినియోగించడం ద్వారా తక్కువ పెట్టుబడితో ఎక్కువ ఆదాయం పొందే పుష్కల అవకాశాలు ఉన్నాయని, ఆయిల్ పామ్ మన జిల్లాకు ఒక వరం అని రైతులు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ డా.ఎస్.వెంకటేశ్వర్ పేర్కొన్నారు. రాస్ -కృషి విజ్ఞాన కేంద్రం తిరుపతి వారు పైలట్ ప్రాజెక్టుగా కదిరి మంగళం గ్రామ పరిధిలో రైతు పొలంలో పురుగుమందులను డ్రోన్ ద్వారా పిచికారి చేసే విధానంపై అవగాహన కల్పించి డ్రోన్ వినియోగాన్ని ప్రోత్సహిస్తున్నందున తక్కువ ఖర్చుతో వాటిని రైతులకు అందుబాటులో తెచ్చినందున కలెక్టర్ వారిని అభినందిస్తూ రైతులకు సూచిస్తూ వ్యవసాయంలో యాంత్రికరణ పద్ధతులను వినియోగించడం వలన తక్కువ పెట్టుబడితో ఎక్కువ రాబడి వచ్చే అవకాశాలు ఉంటాయని డ్రోన్ ను వినియోగించి మందు పిచ్చికారి చేయడానికి ఎకరాకు 10 ని.నుండి 15 నిమిషాల లోపు సరిపోతుందని, డ్రమ్ సీడర్ వినియోగించడం ద్వారా యూనిఫామ్ గా వరుసగా విత్తనాలను భూమిలో నాటడం జరుగుతుందని, దీనివలన కూలీల ఖర్చు, సమయము ఆదావుతుందని రాబడి పెరుగుతుందని రైతులు అందరూ అంగీకరిస్తే ఒక డ్రోన్ పైలట్ ఏర్పాటుకు సిహెచ్సి గ్రూపుకు సబ్సిడీ ద్వారా లోన్ అందజేయడం జరుగుతుందని తద్వారా గ్రామంలోని రైతులు వాటిని నామ మాత్రపు ధర అద్దెతో వినియోగించుకొనే అవకాశం ఉంటుందని తెలిపారు. అనంతరం కెవికె హెడ్ శ్రీనివాసులు సదర డ్రోన్ ను ఎగురవేసి రైతు పొలంలో పురు మందును పిచికారి చేసి చూపించారు. జిల్లా వ్యవసాయ శాఖ అధికారి ప్రసాద్ రావు వివరిస్తూ వడమాల పేట మండలంలో బిపిటి 3082, కేఎన్ఎం 733 నూతన వరి వంగడాలు బిపిటి 5204 సోనా మసూర (వ్యాధులు రావడం వలన ఎక్కువ పురుగు మందులు వాడాల్సి వస్తుంది) కి ప్రత్యామ్నాయంగా సాగు చేయడం ద్వారా ఇవి 130 రోజులలోనే పంట చేతికి అందుతుందని తెలిపారు. రాస్ – కృషి విజ్ఞాన కేంద్రం ద్వారా 30 మంది డ్రోన్ పైలట్లకు శిక్షణ ఇవ్వడం జరిగిందని అధికారులు వివరించారు అనంతరం కలెక్టర్ రైతుకు గ్రీన్ మ్యాన్యూర్ సీడ్ ను పంపిణీ చేశారు. అనంతరం పాదిరేడు గ్రామ పరిధిలోని ఆయిల్ పామ్ నర్సరీని, అలాగే డ్రిప్ ఇరిగేషన్ పోర్టబుల్ స్ప్రింక్లర్స్, మినీ స్ప్రింక్లర్స్ వాడుతున్న రైతుల పొలాలను పరిశీలించారు. ఉద్యాన శాఖ అధికారి వివరిస్తూ జిల్లాలో 151 హెక్టార్లలో ఆయిల్ పామ్ సాగు అవుతున్నదని, ఈ సంవత్సరానికి 400 హెక్టార్ల లక్ష్యంగా నిర్దేశించారు అని 147 మొక్కలు 20 నుండి 29 వేల రూపాయల సబ్సిడీ తో ప్రభుత్వం ఉచితంగా ఇవ్వడం జరుగుతుందని, అంతర పంటలకు సబ్సిడీ రూ.5250 ఇవ్వడం జరుగుతుందని, అలాగే 5250 రూపాయలు ఎరువులకు సబ్సిడీ ప్రతి సంవత్సరం నాలుగు సంవత్సరాలు ఇవ్వడం జరుగుతుందని, రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ కోరారు. అంతే కాకుండా కలెక్టర్ వివరిస్తూ తక్కువ నీటితో పొలమంతటికి నీటిని సరఫరా చేయడానికి డ్రిప్పు, స్ప్రింక్లర్లు ఎంతగానో ఉపయోగకరంగా ఉంటాయని, వినియోగించుకోవాలని సూచించారు. గ్రామస్తులు స్మశాన వాటికకు స్థలం గురించి కలెక్టర్ కోరగా వారంలోపు స్థలాన్ని గుర్తించి తగు చర్యలు తీసుకోవాలని తాశిల్డార్ కు సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉద్యానవన శాఖ అధికారి దశరథరామిరెడ్డి, ఏపీఎంఐపి పిడి సతీష్, తాసిల్దార్ రాజనర్సింహ, ఎంపీడీవో సుజాత, ఏ డి ఏ లు ధనుంజయ రెడ్డి, రమేష్, విజయ్ కుమార్, రైతులు, వ్యవసాయ శాఖ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.