రెవెన్యూశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పీ సిసోడియా

45 రోజుల పాటు నిర్వహణ .. మరో 45 రోజుల్లో పరిష్కారం

ప్రజల నుంచి 5 కేటగిరీల్లో పిటిషన్ల స్వీకరణ

ఆర్టీజీఎస్‌ పరిధిలో ప్రత్యేక విభాగంతో పర్యవేక్షణ
ప్రభాతదర్శిని, (ప్రత్యేక-ప్రతినిధి):
గ్రామ సదస్సులో పాల్గొనే అధికారులు వీరే: 1.తహసీల్దార్‌, 2.రెవెన్యూ ఇన్‌స్పెక్టర్‌, (ఆర్ .ఐ) 3.గ్రామ రెవెన్యూ అధికారి, 4. మండల సర్వేయర్‌, 5. దేవదాయ, వక్ఫ్‌ శాఖల ప్రతినిధులు, 6. రిజిస్ట్రేషన్‌శాఖ అధికారి, 7.అటవీ శాఖ అధికారి పాల్గొంటారు. సున్నితమైన భూసమస్యలపై సదస్సులు నిర్వహిస్తున్నందున కార్యక్రమం పూర్తయ్యేవరకు పోలీసులతో భద్రత ఏర్పాటు చేస్తారు. జగన్‌ ప్రభుత్వం రాష్ట్రంలో పెట్టిన భూ వివాదాల చిచ్చును పరిష్కరించేందుకు చంద్రబాబు ప్రభుత్వం నడుం బిగించింది. ‘ప్రజల వద్దకే పాలన’ తరహాలో ప్రతి గ్రామంలో రెవెన్యూ సదస్సులు నిర్వహించాలని నిర్ణయించింది. ఎక్కడికక్కడ అధికారులు భూ సమస్యలను తెలుసుకుంటారు. ఆగస్టు 15వ తేదీ నుంచి 45 రోజులపాటు ఈ కార్యక్రమం జరుగుతుంది. మరో 45 రోజుల్లో సమస్య పరిష్కారంపై దృష్టి సారిస్తారు. గత ఐదేళ్లలో భారీగా భూ అక్రమాలు జరిగాయి. పేదలు, బడుగువర్గాలు, అణగారిన వర్గాల భూములను వైసీపీ నేతలు దౌర్జన్యంగా ఆక్రమించుకొని రికార్డులను తారుమారుచేసి వారికి నరకం చూపించారు. ఇదేమిటని అడిగితే సమాధానం చెప్పే దిక్కులేదు. ఉద్దేశపూర్వకంగా వెబ్‌ల్యాండ్‌లో చిన్న, చిన్న మార్పులు చేసి ప్రజలను హింసించారు. కొత్త ప్రభుత్వం వచ్చాక స్వీకరిస్తోన్న వినతిపత్రాల్లో సగానికిపైగా భూ వివాదాలపైనే ఉంటున్నాయి. జగన్‌, ఆయన అనుయాయులు చేసిన పాపాలు సరిదిద్దకపోతే గ్రామాల్లో అరాచకం ప్రబలుతుందని, పేదల నోటికాడి ముద్దను తీసేసినట్లవుతుందని భావించిన ప్రభుత్వం తక్షణమే ఆ సమస్యల పరిష్కారానికి నడుం బిగించింది. 45 రోజులపాటు ఊరూరు తిరిగి అధికార యంత్రాంగాన్ని మోహరించి ఎక్కడికక్కడే సమస్యలు తెలుసుకోవడం, ఆ తర్వాత 45 రోజుల్లో వాటికి పరిష్కారం చూపడం…ఇదే ప్రస్తుత టార్గెట్‌. ఈ నెల 15న మంత్రులు లాంఛనంగా గ్రామ రెవెన్యూ సదస్సులు ప్రారంభిస్తారు. ఆ తర్వాత 16నుంచి సెప్టెంబరు నెలాఖరు వరకు అంటే 45 రోజుల పాటు సదస్సులు నిర్వహించనున్నారు. జిల్లాలు, మండలాల వారీగా గ్రామాల్లో సదస్సుల నిర్వహణ తేదీలను 13నాటికే ఖరారు చేయాలని కలెక్టర్లను ప్రభుత్వం ఆదేశించింది. సదస్సుల నిర్వహణ, పర్యవేక్షణ కోసం ప్రతి జిల్లాకు ఓ సీనియర్‌ ఐఏఎస్ ను ప్రత్యేక అధికారిగా నియమిస్తారు. జే.సీ నోడల్‌ అధికారిగా వ్యవహరించనున్నారు. ఈ సదస్సుల్లో జిల్లా మంత్రులు, ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, జడ్పీ చైర్మన్‌, సభ్యులు, మండల, గ్రామ ప్రజాప్రతినిధులు పాల్గొనేలా కలెక్టర్‌లు తగిన చొరవ తీసుకోవాలని రెవెన్యూశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పీ సిసోడియా ఆదేశించారు.
సదస్సుల్లో ఏం చేస్తారంటే..:గ్రామ రెవెన్యూ సదస్సుకు రెండు రోజుల ముందే ప్రభుత్వం గ్రామ రెవెన్యూ మ్యాప్‌ను ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తుంది. ప్రభుత్వ, ప్రైవేటు భూముల మ్యాప్‌లను ప్రకటిస్తుంది. సదస్సులకు రెవెన్యూ, రిజిస్ట్రేషన్‌, అటవీ, దేవదాయ, వక్ఫ్‌ శాఖల మండల, గ్రామస్థాయి అధికారులు హాజరవుతారు. భూ కొలతల్లో తేడాలు, సర్వేనెంబర్లలో మార్పులు, వారసత్వం పేర్ల నమోదు, సరిహద్దు సమస్య, భూ విస్తీర్ణంలో తేడాలు, రీసర్వే జరిగిన గ్రామాల్లో రైతులకు ఇచ్చిన రికార్డుల్లో నమోదైన తప్పులు, ప్రజల నుంచి వైసీపీ నేతలు లాక్కున్న భూములు, భూ కబ్జాలు, భూ ఆక్రమణలు, అసైన్డ్‌, చుక్కల భూముల పరాధీనం వంటి తదితరాలపై బాధితుల నుంచి పిటిషన్లు తీసుకుంటారు. 2019కి ముందు భూమి రికార్డులు ఎలా ఉన్నాయి? ఇప్పుడెలా ఉన్నా యో పరిశీలిస్తారు. అడంగల్‌, పహనీ, ఆర్‌ఓఆర్‌, 1బీ రిజిస్టర్‌, 22(ఏ) జాబితాలను అందుబాటులో ఉంచుతారు. వాటిపై ప్రజల నుంచే వచ్చే ఫిర్యాదులను స్వీకరిస్తారు. తహసీల్దార్ల నేతృత్వంలో అవసరమైతే భూములను పరిశీలన చేస్తారు. రీ సర్వే జరిగిన గ్రామాల్లో ఆర్‌ఓఆర్‌ రికార్డును ప్రజల సమక్షంలో చదివి వినిపించాలని ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. కొత్త పాస్‌పుస్తకాలు ఇచ్చేందుకు జగన్‌ బొమ్మలున్న పాస్‌పుస్తకాలను వెనక్కి తీసుకోవాలని సూచించింది. జగన్‌ బొమ్మలున్న పాస్‌ పుస్తకాలను తహసీల్దార్లు ధ్వంసం చేయాలని రెవెన్యూ స్పెషల్‌ సీఎస్‌ సిసోడి యా మార్గదర్శకాల్లో పేర్కొన్నారు. గ్రామంలో జగన్‌ పేర్లు, బొమ్మలతో సర్వేరాళ్లు ఉంటే, వాటిపై పేర్లను చెరిపివేయాలని నిర్దేశించారు.
ఐదు కేటగిరీలుగా: ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులను ఐదు రిజిస్టర్లలో నమోదు చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. 1.మ్యుటేషన్‌, 2.కౌలు రైతు కార్డులు (ఎల్‌ఈసీ), 3.భూమి వివాదాలు, 4.భూ ఆక్రమణ, 5.నిషేధ జాబితా 22(ఏ) గోల్‌మాల్‌ రిజిస్టర్లను నిర్వహిస్తారు. వీటిలో నమోదుచేసి, ఆ తర్వాత ఆన్‌లైన్‌లో పొందుపరుస్తారు. వీటిని ఆర్‌టీజీఎస్‌ విభాగం పర్యవేక్షిస్తుంటుంది. ఫిర్యాదు ఇచ్చిన ప్రజలకు వెంటనే ఓ రశీదు ఇస్తారు. రెవెన్యూ సదస్సుల నిర్వహణ అనేది ప్రభుత్వం చేపట్టిన పెద్ద టార్గెట్‌. దాన్ని విజయవంతం చేయాలంటే ప్రజాప్రతినిధుల భాగస్వామ్యం ఉండాలి. అందుకే ప్రజాప్రతినిధులతో కలెక్టర్‌ సమావేశం నిర్వహించాలని ప్రభుత్వం ఆదేశించింది. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, రైతు నేతలు, వివిధ రాజకీయ పార్టీల నేతలు, భూ సమస్యలపై పనిచేస్తోన్న ఎన్‌జీవోలను పిలిచి సదస్సుల ఆవశ్యకతను తెలియజేయాలని, ఈ సదస్సులకు విస్త్రత ప్రచారం కల్పించాలని ఆదేశించింది. జిల్లా, డివిజన్‌, మండల, గ్రామంవారీగా రెవెన్యూ సదస్సుల నిర్వహణ, వాటి లక్ష్యాలు తెలిపేలా ప్రచారం చేయాలని నిర్దేశించింది.
90 రోజుల టార్గెట్‌: ఆర్పీ సిసోడియా: ఈ నెల 15నుంచి సెప్టెంబరు నెలాఖరు వరకు సదస్సులు నిర్వహించి ప్రజల నుంచి పిటిషన్లు స్వీకరిస్తారు. ఆ తర్వాత మరో 45 రోజుల్లో అంటే నవంబరు 15 నాటికి వాటిని పరిష్కరించాలని ప్రభుత్వం లక్ష్యంగా నిర్దేశించింది. పిటిషన్ల స్వీకరణ, పరిష్కారం 90 రోజుల్లోనే పూర్తిచేయాలనేది లక్ష్యం. ఇందుకోసం రాష్ట్రస్థాయిలో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేయనుంది. పిటిషన్ల స్వీకరణ, పరిష్కారంపై రోజువారీగా సమీక్ష చేయనున్నారు. అర్జీదారుకు ఫోన్‌చేసి పరిష్కారంపై వివరించాలని ఆదేశించారు. పర్యవేక్షణకు ఆర్టీజీఎస్‌ పరిధిలో ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేయనున్నారు.
ప్రజల వద్దకే అధికారులు: రెవెన్యూ సదస్సుల పేరిట ఐదేళ్ల తర్వాత కీలక ప్రభుత్వ శాఖలు ప్రజల వద్దకు వెళ్లనున్నాయి. ఇది ప్రజల వద్దకు పాలనే అని సీనియర్‌ అధికారులు విశ్లేషిస్తున్నారు. ఇంతకు ముందు అధికారుల వద్దకు ప్రజలు వెళ్లి గోడు చెప్పుకొనేవారు. దీంతో అధికారి స్వీకరించే పరిస్థితిని బట్టి పరిష్కారం ఉండేది. కానీ, ఇప్పుడు ప్రజల భూ వివాదాలు వినడానికే ఐదారుశాఖల అధికారులతో కూడిన బృందాలు రోజంతా గ్రామంలో మకాం వేయబోతున్నాయి. ఇందు లో ప్రజాప్రతినిధులు కూడా భాగస్వామ్యం కాబోతున్నారు. రాష్ట్ర, జిల్లా స్థాయిల్లో పర్యవేక్షణ ఉంటోంది.