రేణిగుంట విమానాశ్రయంలో ఘన స్వాగతం పలికిన అధికారులు, ప్రజాప్రతినిధులు

ప్రభాతదర్శిని,(రేణిగుంట-ప్రతినిధి): ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ప్రమాణం స్వీకారం అనంతరం మొట్ట మొదటి సారిగా తిరుపతి జిల్లాలో రెండు రోజుల పర్యటనలో భాగంగా రేణిగుంట విమానాశ్రయానికి బుధవారం రాత్రి 7.35 గం.లకు కుటుంబ సమేతంగా చేరుకున్న ముఖ్యమంత్రికి ఘన స్వాగతం లభించింది. ముఖ్యమంత్రి వెంట మంత్రి నారా లోకేష్ ఉన్నారు. ప్రిన్సిపల్ సెక్రటరీ ఎండోమెంట్స్ కరికాల వలనన్, డిఐజీ షిమోషి, తిరుపతి, చిత్తూరు జిల్లాల కలెక్టర్లు ప్రవీణ్ కుమార్, షన్మోహన్, తిరుపతి ఎస్పి హర్ష వర్ధన్ రాజు, ఎమ్మెల్యే లు బొజ్జల సుధీర్ రెడ్డి, పులివర్థి నాని, ఆరణీ శ్రీనివాసులు, జెసి చిత్తూరు శ్రీనివాసులు, టీటీడీ జే ఈ ఓ గౌతమి, తిరుపతి మునిసిపల్ కమిషనర్ అదితి సింగ్ జిల్లా రెవెన్యూ అధికారి పెంచల కిషోర్ తదితరులు ముఖ్య మంత్రికి స్వాగతం పలికిన వారిలో ఉన్నారు. అనంతరం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాత్రి 07.55 గం.లకు రేణిగుంట విమానాశ్రయం నుండి రోడ్డు మార్గాన తిరుమలకు శ్రీవారి దర్శనార్థం బయల్దేరి వెళ్లారు. రేపు ఉదయం 7.30 గం.లకు తిరుమల శ్రీవారిని కుటుంబసమేతంగా దర్శించుకోనున్నారు.