
ఎస్టిల ఆర్థిక పరిపుష్టికి ప్రాధాన్యత: కలెక్టర్ ఒ. ఆనంద్
ప్రభాతదర్శిని ( నెల్లూరు-ప్రతినిధి): నెల్లూరు: జిల్లాలో 2024-2025 ట్రైబల్ వెల్ఫేర్ సబ్ ప్లాన్ను పక్కాగా అమలు చేసేందుకు ఆయా శాఖల వారీగా ప్రతిపాదనలు సిద్ధం చేయాలని జిల్లా కలెక్టర్ ఆనంద్ అధికారులను ఆదేశించారు. మంగళవారం ఉదయం కలెక్టరేట్లోని ఎస్ఆర్ శంకరన్ సమావేశ మందిరంలో ట్రైబల్ వెల్ఫేర్ సబ్ ప్లాన్ అమలుకు శాఖలవారీగా పొందుపరచాల్సిన నివేదికపై కలెక్టర్ అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఎస్టిల పరిపుష్టి కోసం ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు ఆయా శాఖల్లో కేటాయింపులు చేయాలని సూచించారు. వివిధ సంక్షేమ పథకాల ద్వారా ఎస్టీలకు ప్రయోజనాలు సమకూర్చడం, ఎస్టిల హెబిటేషన్లలో చేపట్టాల్సిన అభివృద్ధి కార్యక్రమాలపై దృష్టి సారిస్తూ ఎస్టిల ఆర్థిక బలోపేతానికి చర్యలు చేపట్టాలన్నారు. రోడ్లు, ఇళ్ల నిర్మాణాలు, తాగునీరు, విద్య, ఉపాధి కల్పన మొదలైన అంశాలపై దృష్టిపెట్టాలన్నారు. ప్రధానంగా డ్వామా, డిఆర్డిఎ, ఆర్డబ్ల్యుఎస్, పిఆర్, ఆర్ అండ్ బి, పశు సంవర్థక, వ్యవసాయ, ఉద్యానవనశాఖ, ఐసిడిఎస్శాఖల ద్వారా అమలు చేస్తున్న వివిధ పథకాల్లో ఎస్టీలకు అధికంగా ప్రయోజనం కల్పించేలా సబ్ ప్లాన్ను రూపొందించాలని సూచించారు. ఆయాశాఖల్లో కేటాయింపులతో పాటు ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంటు ద్వారా మంజూరు చేసిన కేటాయింపులతో ఎస్టీల ఆర్థిక స్వావలంబనకు కృషి చేయాలని అధికారులకు కలెక్టర్ సూచించారు. మూడు రోజుల్లో ట్రైబల్ వెల్ఫేర్ సబ్ ప్లాన్ కు సంబంధించిన కేటాయింపుల నివేదికను తయారుచేసి ఐటీడీఏ అధికారులకు అందించాలని అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో ఐటిడిఎ పివో పరిమళ, జడ్పీ సిఇవో కన్నమనాయుడు, డిఆర్డిఎ, డ్వామా, ఐసిడిఎస్, హౌసింగ్, మెప్మా ప్రాజెక్టు డైరెక్టర్లు సాంబశివారెడ్డి, శ్రీనివాసులు, దయాకర్, రవీంద్ర, జిల్లా వ్యవసాయ అధికారి సత్యవాణి, ఉద్యానవనశాఖాధికారి సుబ్బారెడ్డి, డిఎంఅండ్హెచ్వో పెంచలయ్య, ఆర్అండ్బి, విద్యుత్శాఖల ఎస్ఈలు గంగాధర్, విజయన్, సిపివో రాజు, డీఈవో రామారావు, సమగ్ర శిక్ష ఏపీసి ఉషారాణి, తదితరులు పాల్గొన్నారు.