మనస్థాపానికి గురైన పార్టీకి రాజీనామా చేస్తున్నాం:మీడియాతో కట్టా దంపతులు ప్రభాతదర్శిని, (ప్రత్యేక-ప్రతినిధి): వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో గ్రూపులు కట్టి, ప్రాధాన్యత ఇవ్వకపోవడంతో పాటు అనేక అవమానాలకు గురి చేశారని ఆ పార్టీ సీనియర్ నాయకులు, రాష్ట్ర మాజీ కార్యదర్శి కట్టా సుధాకర్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో మనస్థాపానికి గురైన తాను, తన అనుచరులు పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ఆయన తెలిపారు. బుధవారం ఆయన తన సతీమణి, నాయుడుపేట మండలం జడ్పిటిసి సభ్యులు కట్ట జ్యోతి రెడ్డితో కలిసి ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ తాను, తన సతీమణి నాయుడుపేట జడ్పిటిసి సభ్యులు కట్టా జ్యోతి రెడ్డిలు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు.తమ రాజీనామా పత్రాలను వైసీపీ కేంద్ర కార్యాలయానికి మెయిల్ ద్వారా పంపినట్లు తెలియజేశారు. అలాగే వైసీపీ నాయకులు కట్టా కోటారెడ్డి, మేనకూరు సర్పంచ్ సిహెచ్ సురేష్, నాయుడుపేట మండల పరిషత్ మాజీ ఉపాధ్యక్షులు నల్లు కస్తూరయ్య, ఓజిలి మండలం, అత్తివరం గ్రామానికి చెందిన ఎంపీటీసీ సభ్యులు శేఖర్ లు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు తెలిపారు. అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన తమ సొంత ఊరు మేనకూరు గ్రామాభివృద్ధిని ఆకాంక్షిస్తూ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు తెలియజేశారు. తమ కుటుంబ సభ్యులు, శ్రేయోభిలాషులందరితో చర్చించి, రాజకీయ భవిష్యత్తును నిర్ణయించుకుంటావని తెలిపారు. వైసీపీలో తమకు సహకరించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేశారు. తమ గ్రామ అభివృద్దే ధ్యేయంగా పనిచేస్తున్నట్లు తెలిపారు. మేనకూరు గ్రామాన్ని టెంపుల్ విలేజ్ గా తీర్చిదిద్దామని తెలిపారు. మేనకూరులో పురాతన శివాలయాన్ని అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు. అలాగే శివాలయం ముందున్న కోనేరును అభివృద్ధి చేస్తామన్నారు. మాజీ ముఖ్యమంత్రి నేదురుమల్లి జనార్దన్ రెడ్డి సహకారంతో తిమ్మాజీ కండ్రిక కాజ్ వే నిర్మించడం జరిగిందన్నారు. 2005వ సంవత్సరంలో మాజీ ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి కృషితో మేనకూరులో ప్రత్యేక ఆర్థిక మండళ్లు (సెజ్)ఏర్పాటుకు తమ వంతు పాత్ర పోషించి,ఈ ప్రాంత అభివృద్ధికి కృషి చేశామన్నారు. అంతర్జాతీయ గుర్తింపు పొందిన మేనకూరు సెజ్ లో అనేక పరిశ్రమలు ఏర్పాటు చేయడంతో ద్వారా వేలాది మంది నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కలిగాయని అన్నారు. 20 ఏళ్ల క్రితం మేనకూరు లో ఉన్న విభేదాలను పక్కనపెట్టి పరిశ్రమల ఏర్పాటుకు పార్టీలకు అతీతంగా సహకరిస్తున్నట్లు తెలిపారు. మేనకూరు గ్రామాభివృద్దే ధ్యేయంగా పనిచేస్తామన్నారు.ఈ సమావేశంలో పాల్గొన్న తెలుగుదేశం పార్టీ నాయకులు కట్టా వెంకటరమణారెడ్డి మాట్లాడుతూ కట్టా సుధాకర్ రెడ్డి దంపతులు తెలుగుదేశం పార్టీలో చేరాలని కోరారు. మేనకూరు అభివృద్ధి తోపాటు గ్రామంలో చెన్నకేశవస్వామి దేవాలయం,రామాలయం,కృష్ణ మందిరం,శివాలయ నిర్మాణాలను కట్టా సుధాకర్ రెడ్డి దంపతులు తమ సొంత నిధులతో చేపట్టారని తెలిపారు. మేనకూరు సెజ్ లోని పరిశ్రమల్లో అనేక మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించి ఈ ప్రాంత అభివృద్ధికి ఆయన కృషి చేస్తున్నారని తెలియజేశారు. తమ సోదరుడైన కట్టా సుధాకర్ రెడ్డి తెలుగుదేశం పార్టీలోకి రావాలని ఆకాంక్షిస్తున్నట్లు తెలిపారు.ఆయన పార్టీలో చేరితే ఓజిలి, పెళ్లకూరు మండలాలతో పాటు నాయుడుపేట గ్రామీణ మండలంలో ఉన్న తమ సోదరుడు కట్టా సుధాకర్ రెడ్డి శ్రేయోభిలాషులు, బంధువులు పెద్ద ఎత్తున పార్టీలో చేరడం వల్ల టీడీపీ మరింత బలం పుంజుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు.