
గిఫ్ట్ డీడ్ను రద్దుతో వృద్ధ దంపతులకు న్యాయం
ప్రభాతదర్శిని, (ప్రత్యేక-ప్రతినిధి): కడప జిల్లా ప్రొద్దుటూరు పట్టణంలో నివసిస్తున్న ఓ వృద్ధ దంపతులకు న్యాయం లభించింది. వయస్సు పైబడి, ఆశ్రయంతో తమ ఆస్తిని కుమార్తెలకు బహూకరించిన తరువాత దారుణంగా విస్మరించబడిన ఈ వృద్ధ దంపతుల వేదనకు జమ్మలమడుగు రెవెన్యూ డివిజనల్ అధికారి ఏ. సాయి శ్రీ స్పందించారు. “వృద్ధుల సంరక్షణకు విఫలమైన వారిని చట్టం ఆదుకుంటుంది” అనే సందేశాన్ని అందిస్తూ, వారి ఐదుగురు కుమార్తెలకు అప్పగించిన ఆస్తి బదిలీ (గిఫ్ట్ డీడ్)ను సదరు ఆర్డీవో రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ తీర్పు “మెయింటెనెన్స్ అండ్ వెల్ఫేర్ ఆఫ్ పేరెంట్స్ అండ్ సీనియర్ సిటిజన్స్ యాక్ట్, 2007” చట్టంలోని సెక్షన్ 23 ప్రకారం ఇవ్వబడింది. వివరాల్లోకి వెళితే ప్రొద్దుటూరుకు చెందిన శ్రీ మలేపాటి మోహన్ రావు (వయస్సు 86) మరియు ఆయన భార్య మలేపాటి గౌరమ్మ (వయస్సు 75) లు గతంలో స్వంతంగా స్వీట్స్ వ్యాపారం నడుపుతూ జీవించారు. వయోవృద్ధత, ఆరోగ్య సమస్యల కారణంగా వ్యాపారం సన్నగిల్లింది. తమ సంతానమైన ఐదుగురు కుమార్తెలపై నమ్మకంతో, రంగయ్యగారి సత్రం వీధిలో ఉన్న నివాస గృహాన్ని (డోర్ నెం. 18/437-A) 2024 జూలై 23న నమోదు చేసిన డాక్యుమెంట్ నెం. 29419/2024 ద్వారా బహుమతిగా బదిలీ చేశారు. కానీ ఆస్తి బదిలీ అయిన వెంటనే, తమ కుమార్తెల ప్రవర్తన పూర్తిగా మారిపోయిందని మోహన్ రావు పేర్కొన్నారు. జీవితాంతం సంరక్షణ కల్పిస్తామన్న మాటలు, హామీలు అన్నీ వృథా అయ్యాయి. వారికి తిండి, దుస్తులు, వైద్య సాయం వంటి కనీస అవసరాలు కూడా అందించక, పక్కవారిని, సేవా సంస్థల దయపై ఆధారపడే స్థితికి చేరుకున్నట్లు తెలిపిన ఆయన, చివరికి వృద్ధాశ్రమంలో ఆశ్రయం పొందాల్సిన దుస్థితిని ఎదుర్కొన్నట్టు తెలిపారు. ఈ దంపతుల వేదనకు స్పందించిన జమ్మలమడుగు రెవెన్యూ డివిజనల్ అధికారి శ్రీమతి ఏ. సాయి శ్రీ ఐదుగురు కుమార్తెలకు ఫిబ్రవరి 22, 2025న ఆర్డీవో కార్యాలయం లో హాజరు కావలసినదిగా నోటీసులు జారీ చేశారు. తదనంతరం మార్చి 12, మార్చి 29 మరియు ఏప్రిల్ 19 తేదీల్లో కూడా విచారణలు జరిపారు. అయితే ప్రతివాదులు పూర్తి స్థాయిలో విచారణలో హాజరు కాక, తమ సంరక్షణ బాధ్యతను నిరూపించేందుకు ఎలాంటి ఆధారాలు సమర్పించలేదు.