ప్రభాతదర్శిని (అమరావతి – ప్రతినిధి):అమరావతి శాసనసభా ప్రాంగణంలో
రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా స్టూడెంట్స్ మాక్ అసెంబ్లీ నిర్వహించారు ఈ మాక్ అసెంబ్లీకి సీఎం చంద్రబాబు, స్పీకర్ అయ్యన్నపాత్రుడు, మంత్రులు హాజరయ్యారు. మాక్ అసెంబ్లీలో మాక్ సీఎంగా మన్యం జిల్లాకు చెందిన ఎం.లీలాగౌతమ్, ప్రతిపక్ష నేతగా అదే జిల్లాకు చెందిన సౌమ్య వ్యవహరించారు. డిప్యూటీ సీఎం గా విశాఖ జిల్లాకు చెందిన కోడి యోగి, విద్యాశాఖ మంత్రిగా తిరుపతి జిల్లాకు చెందిన చిన్మయి, అసెంబ్లీ స్పీకర్ గా కాకినాడ జిల్లాకు చెందిన స్వాతి ఉన్నారు. అసెంబ్లీలో పలు బిల్లులు ప్రవేశపెట్టి వాటిపై స్వల్పకాలిక చర్చ చేపట్టారు. 45 వేల పాఠశాలల్లో మాక్ అసెంబ్లీ ప్రత్యక్ష ప్రసారం చేశారు. విద్యార్థులకు రాజ్యాంగం, ప్రజాస్వామ్య ప్రక్రియలపై అవగాహన కల్పించే లక్ష్యంతో మాక్ అసెంబ్లీ నిర్వహించాలన్న తన ఆలోచనని మంత్రి లోకేష్ ఇటీవల అసెంబ్లీలో ప్రతిపాదించగా సభ్యులంతా మద్దతు తెలిపారు. దాంతో వివిధ స్థాయిలలో విద్యార్థులకు పలురకాల పోటీలు పెట్టి నియోజకవర్గ స్థాయిలో ఒక్కొక్కరిని ఎంపిక చేశారు. ఆంధ్రప్రదేశ్ విద్యార్థుల మాక్ అసెంబ్లీ లో వాడి వేడిగా చర్చ జరిగింది. ఒలింపిక్స్ చర్చపై అధికార మరియు ప్రతిపక్ష వర్గాల మధ్య డిబేట్ జరిగింది. ఒక దశలో ప్రతిపక్ష నేతలు స్పీకర్ పోడియం వద్దకు వచ్చి నిరసన తెలిపారు. కొందరిని మార్షల్స్ ఎత్తుకొని బయట వేశారు. అసెంబ్లీని పోలినట్టు వేసిన సెట్ లో ఈ కార్యక్రమం అంతా జరిగింది. కొంతమంది ప్రజా ప్రతినిధులు గౌరవ సభల్లో ప్రవర్తిస్తున్న తీరును కళ్లకు కట్టినట్టు చూపించిన చిన్నారులు. ఇది చూసి అయినా వాళ్ళు కళ్ళు తెరిచి సభా మర్యాదలు పాటిస్తారేమో చూడాలి.
