
.
భీమవరంలో 8 వేల మందితో కనువిందు చేసిన యోగ అబ్యాసన ప్రభాతదర్శిని, (ప్రత్యేక-ప్రతినిధి): భీమవరం, జూన్ 21: అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా శనివారం పశ్చిమగోదావరి జిల్లాలో వేలాది మంది యోగాభ్యాసనలో పాల్గొనడం పండుగ వాతావరణం తలపించింది. జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి వ్యక్తిగత పర్యవేక్షణలో భీమవరం కలెక్టరేట్ పెరేడ్ గ్రౌండ్ నందు నిర్వహించిన యోగ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యులు పాకా సత్యనారాయణ పాల్గొన్నారు. విశాఖలో భారత ప్రధాని నరేంద్ర మోడీ పాల్గొన్న యోగా కార్యక్రమాన్ని అనుసరిస్తూ యోగా అభ్యసనాలు కొనసాగిన తీరు అత్యద్భుతంగా ఉంది. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి మాట్లాడుతూ ప్రధాని ఆకాంక్ష మేరకు ముఖ్యమంత్రి ఆదేశాలతో గత నెల రోజులుగా జిల్లా వ్యాప్తంగా యోగ అభ్యసన కార్యక్రమాలు విజయవంతంగా నిర్వహించు కోవడం జరిగిందన్నారు. ఈరోజు జిల్లా వ్యాప్తంగా 4,835 ప్రదేశాలలో సుమారు 8 లక్షల మంది, భీమవరం పట్టణంలో 8 వేల మందితో పెద్ద ఎత్తున యోగ కార్యక్రమం జరుపుకోవడం ఆనందంగా ఉందన్నారు. నేర్చుకున్న యోగ అభ్యాసన నిలిపివేయకుండా ప్రతిరోజు యోగాభ్యాసం చేసి సంపూర్ణ ఆరోగ్యం పొందాలన్నారు. నెల రోజులు పాటు నిర్వహించిన యోగాంధ్ర కార్యక్రమాలను విజయవంతం చేసినందుకు జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి ని జిల్లా కలెక్టర్ ప్రత్యేకంగా అభినందించారు, జిల్లా అధికారులు అందరూ సమన్వయంతో పనిచేసి కార్యక్రమాలను విజయవంతం చేసారని కితాబిచ్చారు. విద్యార్థిని, విద్యార్థులు ప్రతిరోజు యోగా చేయాలని, తద్వారా శారీరిక దృఢత్వంతో పాటు మానసిక ప్రశాంతత కలిగి చదువుపై దృష్టి కేంద్రీకరించడానికి వీలవుతుం దన్నారు. రాజ్యసభ సభ్యులు పాకా నారాయణ మాట్లాడుతూ ఆరోగ్య వంతమైన భారతదేశం కోసం ప్రధాని నరేంద్ర మోడీ యోగాకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నారన్నారు. ప్రపంచంలో ఏ దేశంలో లేని విధంగా యువత మన దేశంలోనే అధికంగా ఉన్నారని వారందరినీ ఆరోగ్యవంతులను చేయడం ద్వారా ఆరోగ్య భారత్ గా తీర్చిదిద్దాలనేదే మోడీ ఆశయం అన్నారు. ఈ రోజున 175 దేశాలలో యోగా కార్యక్రమాలు నిర్వహించుకోవడం జరుగుతోందన్నారు. పశ్చిమగోదావరి జిల్లాలో గత నెల రోజుల నుండి నిరంతరాయంగా యోగ అభ్యసన కార్యక్రమాలు విజయవంతంగా నిర్వహించిన కలెక్టర్, జాయింట్ కలెక్టర్లను పాక అభినందించారు. అనంతరం గత నెల రోజులుగా గ్రామ, మండల, జిల్లాస్థాయిలో నిర్వహించిన యోగ పోటీల్లో జిల్లాస్థాయిలో వివిధ పోటీలలో గెలుపొందిన విద్యార్థిని, విద్యార్థులకు బహుమతి ప్రధానం చేశారు. ఈ కార్యక్రమంలో డిఆర్ఓ మొగిలి వెంకటేశ్వర్లు, కె ఆర్ ఆర్ సి స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ బి.శివన్నారాయణ రెడ్డి, ఆర్డిఓ కె. ప్రవీణ్ కుమార్ రెడ్డి, డ్వామ పీడీ డా. కే సి హెచ్ అప్పారావు, జిల్లా టూరిజం అధికారి ఎ.వి అప్పారావు, డీఈవో ఇ.నారాయణ, వివిధ శాఖల జిల్లా అధికారులు, వివిధ కళాశాలల, పాఠశాలల విద్యార్థిని విద్యార్థులు పట్టణ ప్రముఖులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, పారిశ్రామికవేత్తలు, ప్రజలు పాల్గొన్నారు.