
ప్రభాతదర్శిని (తిరుపతి-ప్రతినిధి): మే 6వ తేదీ నుంచి 14 వ తేదీ వరకు జరిగే శ్రీ తాతయ్య గుంట గంగమ్మ జాతరను పండుగ వాతావరణం నిర్వహిద్దామని తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ అధికారులకు పిలుపు నిచ్చారు. సోమవారం సాయంత్రo స్థానిక కలెక్టరేట్ లో సమావేశ మందిరంలో తిరుపతి శాసన సభ్యులు ఆరణి శ్రీనివాసులు అధ్యక్షతన జరిగిన జాతర నిర్వహణ సమీక్ష సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఎంతో ప్రతిష్టాత్మకమైన తిరుపతి తాతయ్యగుంట గంగమ్మ జాతరను విజయవంతంగా నిర్వహించేలా వివిధ శాఖల అధికారుల సమన్వయంతో ప్రణాళిక బద్దంగా ఏర్పాట్లను చేపట్టాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్ ఆదేశించారు. ఈ సందర్భంగా ఎస్పీ హర్షవర్ధన్ రాజు, తిరుపతి మున్సిపల్ కమిషనర్ మౌర్య సంబంధిత శాఖల అధికారులు, కమిటీ సభ్యులతో కలిసి తిరుపతి శ్రీ తాతయ్యగుంట గంగమ్మ తల్లి జాతర ఏర్పాట్లపై జిల్లా కలెక్టర్ డా ఎస్ వెంకటేశ్వర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. అనంతరం జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఈ నెల 6వ తేదీ నుంచి 14 వ తేదీ వరకు జరిగే శ్రీ తాతయ్య గుంట గంగమ్మ జాతరను పండుగ వాతావరణం లో విజయవంతంగా నిర్వహించేలా ప్రత్యేక ఏర్పాట్లు చేపట్టాలని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జీ ఓ నంబర్ 9 మేరకు శ్రీ తాతయ్య గుంట గంగమ్మ జాతరను రాష్ట్ర పండుగగా ప్రకటించిన నేపథ్యంలో భక్తుల రద్దీ దృష్ట్యా సంబంధిత శాఖలు సమన్వయంతో గంగమ్మ జాతరను అత్యంత వైభవంగా నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. జాతరకు సంబంధించిన సమాచారంకు సంబంధించిన సేవల వివరాలతో కూడిన హోర్డింగ్ లను ఏర్పాటు చేయాలని సూచించారు. జాతర సందర్భంగా పారిశుద్ధ్యం నిర్వహణ పై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. క్యూ లైన్ నియంత్రణ, కంట్రోల్ రూం ఏర్పాటుతో పర్యవేక్షణ, పార్కింగ్, సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణ, ట్రాఫిక్ నియంత్రణ, పోలీస్ బందోబస్తు, మెడికల్ క్యాంపు లు ఏర్పాటు, అంబులెన్స్ లు అందుబాటులో ఉంచడం, త్రాగునీరు, విద్యుత్తు సరఫరా లో అంతరాయం లేకుండా చూడాలని, అగ్ని ప్రమాదాలు జరగకుండా ప్రత్యేక చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. పబ్లిక్ అడ్రస్ సిస్టమ్ అనౌన్స్మెంట్, రవాణా సౌకర్యం తదితర అంశాలపై ప్రణాళిక బద్దంగా ప్రత్యేక చర్యలు చేపట్టాలని కోరారు. శానిటేషన్, పబ్లిక్ టాయిలెట్లు ఏర్పాట్లపై మునిసిపల్ కార్పొరేషన్ అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అమ్మవారి సారె ఊరేగింపు రోజున భక్తుల రద్దీ ని దృష్టిలో పెట్టుకొని వారికి ఎటువంటి ఆటంకం కలగకుండా, తోపులాటలు జరగకుండా ప్రత్యేక బందోబస్తు చర్యలు చేపట్టాలన్నారు. సామాన్య భక్తులకు ఎలాంటి ఆటంకం కలగకుండా వీఐపీ దర్శనాల కోసం ఉదయం 6 నుండి 8 గంటల వరకు సాయంత్రం మూడు గంటల నుంచి 5 గంటల సమయంలో దర్శనం కల్పించేలా చర్యలు చేపట్టామన్నారు. తిరుపతి జిల్లా ఎస్పీ మాట్లాడుతూ భక్తులకు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ముందస్తు భద్రత ఏర్పాట్లు పోలీసులు చేపడుతున్నట్లు తెలిపారు. క్యూలైన్లలో ఎటువంటి తొక్కేసులాట జరగకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేయవలసినదిగా పోలీసు అధికారులను ఆదేశించారు. భక్తులు అధిక సంఖ్యలో రానున్న తరుణంలో బందోబస్తు ఏర్పాటును పటిష్టంగా చేపట్టామని తెలిపారు. తిరుపతి నగరపాలక కమిషనర్ మౌర్య మాట్లాడుతూ శ్రీ తాతయ్య గుంట గంగమ్మ జాతర సందర్భంగా పారిశుధ్యం పై ప్రత్యేక శ్రద్ధవహించి తగినన్ని ఏర్పాట్లు చేపట్టాలని మున్సిపల్ అధికారులను ఆదేశించారు. పొంగళ్ళు పెట్టే ప్రదేశాలలో నీటి సదుపాయం కల్పించాలని తెలిపారు. ఇందిర మైదానంలో సాంస్కృతిక ఏర్పాట్ల నిర్వహణ పక్కాగా ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డిఆర్ఓ నరసింహులు, టిటిడి బోర్డు మెంబర్ పనబాక లక్ష్మి, మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ, బీసీ యాదవ కార్పొరేషన్ చైర్మన్ నరసింహ యాదవ్, రాష్ట్ర బిజెపి అధ్యక్షులు సామంచి శ్రీనివాస్, అడిషనల్ ఎస్.పి లా అండ్ ఆర్డర్ రవి మనోహరాచారి, తాతయ్య గుంట గంగమ్మ తల్లి ఆలయ ఈ ఓ జయకుమార్, జిల్లా దేవదాయ శాఖ అధికారి రామ కృష్ణా రెడ్డి, సూపరింటెండెంట్ ఇంజనీర్ శ్యాంసుందర్, మునిసిపల్ హెల్త్ ఆఫిసర్ యువ అన్వేష్ , ప్రజా ప్రతినిధులు, తదితర అధికారులు పాల్గొన్నారు.
నేటి నుంచి గంగమ్మ జాతర- వివరాలు: మే 6 మంగళవారం చాటింపు, 7 వ తేదీ బుధవారం బైరాగి వేషo, 8 వ తేది గురువారం బండ వేషo, 9వ తేది శుక్రవారం తోటి వేషo, 10 వ తేది శనివారం దొర వేశo, 11 వ తేదీ ఆదివారం మాతంగి వేషం, 12 వ తేది సోమవారం సున్నపు కుండలు, 13 వ తేది మంగళవారం గంగమ్మ జాతర సప్పరం, మే 14 వ తేది బుధవారం విశ్వరూప దర్శనం కార్యక్రమాలతో జాతర ముగుస్తుంది అని అధికారులు తెలిపారు.