లైవ్‌లో యాక్సిస్ మై ఇండియా ఛైర్మన్, ఎండీ ప్రదీప్ గుప్తా కంటతడి
ప్రభాతదర్శిని, (ప్రత్యేక-ప్రతినిధి):2024 సార్వత్రిక ఎన్నికల ఫలితాలపై అంచనాలు తప్పడంతో యాక్సిస్ మై ఇండియా ఛైర్మన్, ఎండీ ప్రదీప్ గుప్తా లైవ్‌లో కంటతడి పెట్టుకున్నారు. ఇండియా టుడే ఎన్నికల ఫలితాల లైవ్‌ కవరేజీలో పాల్గొన్న ప్రదీప్‌ గుప్తా .. ప్యానెల్‌ చర్చ సందర్భంగా ఎగ్జిట్‌ పోల్స్‌ అంశం గరించి ప్రస్తావిస్తూ భావోద్వేగానికి గురయ్యారు. అంచనాలు తారుమారవడంతో భావోద్వేగానికి గురైన ఆయన లైవ్‌లోనే కంటతడి పెట్టుకున్నారు. సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వెలువడుతున్నాయి. అనేక సర్వేలు భాజపా భారీ మెజార్టీతో గెలుస్తుందని ప్రకటించారు. ఇక యాక్సిస్ మై ఇండియా ఎగ్జిట్ పోల్స్ కూడా లోక్‌సభ ఎన్నికల్లో ఎన్డీయే 361-401 సీట్లు గెలుచుకుంటుందని అంచనా వేసింది. ఇండియా కూటమి 131-166 సీట్లకే పరిమితం అవుతుందని పేర్కొంది. అయితే ఇప్పటివరకు వెలువడిన ఫలితాల ప్రకారం చూస్తే భాజపా మెజారిటీ మార్క్‌ను దాటినా సర్వేలో అంచనా వేసిన సీట్లను మాత్రం గెలుచుకోలేకపోయింది. ”యాక్సిస్‌ మై ఇండియా గత 10 ఏళ్లుగా ఎగ్జిట్‌ పోల్స్‌ను నిర్వహిస్తోంది. రెండు లోక్‌సభ ఎన్నికలతో సహా మొత్తం 69 ఎన్నికలకు సర్వేలు చేశాం. మా అంచనాలు 65 సార్లు కరెక్ట్‌గా ఉన్నాయి’’ అని నిన్న ఓ వార్తా సంస్థతో ప్రదీప్‌ గుప్తా అన్నారు. కానీ.. ఈసారి సర్వేల అంచనాలకు భిన్నంగా ఫలితాలు వెలువడుతున్నాయి. ఒక్కోసారి ఇలాంటి సర్వేల ఫలితాలు తారుమారవుతుంటాయి.