తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు రమేష్ నాయుడు
ప్రభాతదర్శిని,(పెళ్లకూరు ప్రతినిధి): మండలంలోని పెళ్లకూరు గ్రామ తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత పేరం రమేష్ నాయుడు వారి నివాసం నందు మీడియా సమావేశం ఆదివారం నిర్వహించారు.ఈ సందర్భంగా మీడియా సమావేశంలో రమేష్ నాయుడు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ని విమర్శించే స్థాయి అర్హత మాజీ చైర్మన్ కామిరెడ్డి సత్యనారాయణ రెడ్డి లేదని తెలిపారు,హిందువుల పవిత్ర ఆలయమైన తిరుమల దేవస్థానంలో శ్రీ వెంకటేశ్వర స్వామి ప్రసాదం లడ్డు కల్తీ విషయమై గుజరాత్ లోని జాతీయ పాడి పరిశ్రమ అభివృద్ధి సంస్థ తిరుమలలో 19.77 శాతం మాత్రమే నెయ్యి ఉన్నట్లు నిర్ధారించడం జరిగిందన్నారు.ఈ విషయాన్ని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రపంచానికి తెలియజేశారు తప్ప, ఇందులో ఎలాంటి రాజకీయ కుట్ర లేదన్నారు. సత్యనారాయణ రెడ్డి రాజకీయ జీవితమంతా కుళ్ళు,కుతంత్రాలతో కుట్రలు చేస్తూ కొనసాగుతున్నాడు కాబట్టే దేవుడు ఆయనను జైల్లో పెట్టించినట్లు పేర్కొన్నారు.ప్రపంచంలోనే వేలకోట్ల ఆస్తులు ఉన్న టీటీడీ దేవస్థానానికి వై వి సుబ్బారెడ్డి గాని, భూమన కరుణాకర్ రెడ్డి గాని సేవలు చేయాల్సిన అవసరం లేదని వాళ్లకే దేవస్థానం అనేక సేవలు, సదుపాయాలు చేసిందని వివరించారు. టీటీడీ నెయ్యి కల్తీ విషయంలో అనేక కోణాల్లో విచారణలు మొదలుపెట్టారని దోషులను ఎట్టి పరిస్థితుల్లో వదలకుండా కచ్చితంగా శిక్షించడం జరుగుతుందని తెలిపారు.100 రోజుల కూటమి ప్రభుత్వ పాలనలో పింఛన్లు ఎవరికీ తొలగించలేదని సత్యనారాయణ రెడ్డి స్వగ్రామం చిల్లకూరులో కనీసం ఒక్క పింఛన్ కూడా రద్దు చేయలేదన్న విషయాన్ని గుర్తు చేశారు. గ్రామంలో గిరిజన భూములను ఆక్రమించుకుని సమీప స్వర్ణముఖి పొర్లకట్టను తవ్వేసి అక్కడ మట్టిని పొలాలకు తరలించిన కేసులో సత్యనారాయణ రెడ్డి పై చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. తదుపరి బంగారం పేట సర్పంచ్ దేవారెడ్డి నాగేంద్ర రెడ్డి మాట్లాడుతూ గుమ్మడికాయ దొంగ ఎవరు అంటే భుజాలు తడవుకుంటున్న సత్యనారాయణ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే సంజీవయ్య కలిసి పునబాకలోని వైష్ణవి డైయిరీ నుంచి 3.78 లక్షల లీటర్లు నెయ్యిని 15.75 కోట్లకు టీటీడీకి విక్రయించడంలో ఎంత లాభం పొందుకున్నారో దర్యాప్తు చేసి అసలు నిజాన్ని నిగ్గు తేల్చాలన్నారు.లీటరు నెయ్యి 411రూపాయలకే ఇప్పించడంలో ఎన్ని కోట్లు గుంజుకున్నారో చెప్పాలన్నారు. అలాగే జీలపాటూరు సర్పంచ్ కందమూడి శివకుమార్ మాట్లాడుతూ కూటమిపాలనలో ఎలాంటి అవినీతికి అవకాశం లేదని, ప్రభుత్వం మీద బురద చల్లడం సత్యనారాయణ రెడ్డికి తగదని హితువు పలికారు.ఈ కార్యక్రమంలో పలువురు తెలుగుదేశం పార్టీ నాయకులు పాల్గొన్నారు.