మళ్లీ కోరలు చాస్తున్న కొవిడ్.. కొత్త వేరియంట్ కలకలం

మళ్లీ కోరలు చాస్తున్న కొవిడ్.. కొత్త వేరియంట్ కలకలం
ప్రభాతదర్శిని – ప్రతినిధి:కొవిడ్..19: 2020లో కొవిడ్ ఎంతటి కల్లోలం సృష్టించిన సంగతి తెలిసిందే. సుమారు రెండేళ్ల పాటు ప్రపంచాన్నే చెడుగుడు ఆడుకున్న కరోనా.. మళ్లీ కోరలు చాస్తుంది. అయితే అందరూ ఇక కరోనా అంతమైపోయిందనుకున్నప్పటికీ.. మరో కొత్తరకం వేరియంట్ కలవరపెడుతుంది. జేఎన్ 1 రకానికి చెందిన కొత్త వేరియంట్ అత్యంత ప్రమాదకరంగా చెబుతున్నారు శాస్త్రవేత్తలు. ఇది తీవ్ర ఇన్ఫెక్షన్ కు కారణమవడమే కాకుండా.. ప్రస్తుతమున్న టీకాలేవీ పనిచేయవని అంటున్నారు. అందుకే శాస్త్రవేత్తలు ఈ వేరియంట్ పై ఆందోళన చెందుతున్నారు. జేఎన్ 1 వైరస్ రకాన్ని మూడు నెలల క్రితం లగ్జెంబర్గ్ లో తొలిసారిగా గుర్తించారు. ఈ వైరస్ అక్కడి నుంచి ఇంగ్లాండ్, ఐస్ ల్యాండ్, ఫ్రాన్స్, అమెరికా దేశాలకు వ్యాపించింది. ఈ వేరియంట్ ఎక్స్ బీబీ 1.5, హెచ్ వీ.1 వంటి కోవిడ్ వైరస్ రకాలకు చెందినదే అయినా దీనిలో చాలా తేడాలు ఉన్నాయి. ఎక్స్ బీబీ 1.5 రకం వైరస్ ముల్లు ప్రోటీన్ మీద 41 మార్పులు సంభవించి, ఈ స్థితికి చేరుకుందని వైద్య నివేదికలు చెబుతున్నాయి. అందువల్ల అందుబాటులో ఉన్న కొవిడ్ టీకాలు దీన్ని నిలువరించలేవని శాస్త్రవేత్తలు భయపడుతున్నారు. దీని నుంచి కాపాడుకోవడానికి ఆధునీకరించిన కొవిడ్ టీకాలు అవసరమని అమెరికాకు చెందిన సీడీసీ చెబుతోంది..